ప్లాస్టిక్‌ రహితంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర:సత్యవతి రాథోడ్‌

హైదరాబాద్‌: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించిందని మంత్రి సత్యవతి రాథోడ్‌ వెల్లడించారు. ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు నాలుగు రోజులపాటు జరిగే జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించనున్నామని.. ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మేడారం జాతరకు రూ.75 కోట్లు విడుదల చేసిన ముఖ్యమంత్రికి గిరిజనులు, ఆదివాసీల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. గతంలో కూడా జాతరకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిందన్నారు. మేడారంలో భక్తుల కోసం ఇప్పటికే అనేక శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలను చేపట్టినట్లు వివరించారు. వారం కిందట రూ.2.24 కోట్లతో భక్తులు దుస్తులు మార్చుకునే గదులు, ఓహెచ్ఆర్ఎస్, కమ్యూనిటీ డైనింగ్ హాల్‌కు శంకుస్థాపన చేసినట్లు సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మిగిలిన పనులను డిసెంబర్‌లోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
2022లో జరిగే జాతర తేదీలివే
ఫిబ్రవరి 16 – సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులును గద్దెల వద్దకు తీసుకొస్తారు.
ఫిబ్రవరి 17 – చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దెల వద్దకు చేరుస్తారు.
ఫిబ్రవరి 18 – సమ్మక్క-సారక్క అమ్మవార్లకు ప్రజలు మొక్కులు సమర్పించుకోవడం.
ఫిబ్రవరి 19 – వన ప్రవేశం, మహా జాతర ముగింపు

Leave a Reply