-జరుగుతున్న పనులను వివరించిన పోకూరి, తిరువీధి
-విస్తరణకు సంబంధించిన ప్లాన్ పరిశీలన
గుడివాడ, డిసెంబర్ 20: గుడివాడ పట్టణంలోని వాసవీచౌక్ సెంటర్లో ఉన్న ఆర్యవైశ్య కళ్యాణ మందిరం అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ను కోరారు. సోమవారం గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని ఆర్యవైశ్య కళ్యాణ మందిర నిర్వహణ సంఘం అధ్యక్షుడు పోకూరి మోహనరావు, కార్యదర్శి తిరువీధి శ్రీరాములు తదితరులు కలిశారు. ఈ సందర్భంగా కళ్యాణ మండపంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ మండపాన్ని ఇప్పటి అవసరాలకనుగుణంగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విస్తరణకు సంబంధించిన ప్లాన్ ను మంత్రి కొడాలి నానికి చూపించారు.
అనంతరం పోకూరి మోహనరావు, తిరువీధి శ్రీరాములు మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో ఆర్యవైశ్య కళ్యాణ మందిరాన్ని 60 ఏళ్ళ కిందట నిర్మించడం జరిగిందన్నారు. కళ్యాణ మండపానికి ఈశాన్యం వైపు తగినంత స్థలం లేదన్నారు. ఫంక్షన్లు జరిగే సమయంలో వాహనాల పార్కింగ్ సమస్యలు కూడా ఎదురవుతున్నాయన్నారు. కళ్యాణ మండపాన్ని ఆనుకుని మున్సిపల్ పార్క్ స్థలం ఉందన్నారు. ఈ స్థలంలో 500 గజాలను ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి కేటాయించాలని గత 20 ఏళ్ళుగా కోరుతున్నామన్నారు. దీనిపై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ కళ్యాణ మందిరం అభివృద్ధికి తనవంతు సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ గుడివాడ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు.