Suryaa.co.in

Andhra Pradesh

మోదీ సభ ఏర్పాట్లపై మంత్రి సత్యకుమార్ బిజీ బిజీ

– పీఎంఓకు నిరంతర సమాచారం
– ఢిల్లీ పార్టీ నుంచి ఎప్పటికప్పుడు ఆరా
– సత్యకుమార్‌తో వివరాలు సేకరిస్తున్న బీజేపీ జాతీయ కార్యాలయం
– ఇప్పటికే మోదీ, అమిత్‌షాతో సత్యకుమార్ భేటీ
– అమరావతిపై మోదీ ప్రసంగంలో సత్య కీలక పాత్ర?
( సుబ్బు)

ప్రధాని మోదీ అమరావతికి రానున్న నేపథ్యంలో.. సభ ఏర్పాట్లపై బీజేపీ జాతీయ కార్యదర్శి, మంత్రి సత్యకుమార్ దృష్టి సారించారు. గత కొద్దిరోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన సత్యకుమార్, అమరావతిలో మోదీ పర్యటనకు సంబంధించి మోదీతోపాటు.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర నిఘా వర్గాలతో భేటీ అయి, తగిన సూచనలు ఇచ్చారు. అమరావతి సభకు సంబంధించి పీఎంఓ, జాతీయ బీజేపీ నాయకత్వానికి సత్యకుమార్ ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు.

కాగా గత కొద్దిరోజుల నుంచి మంత్రి సత్య.. బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు తగిన సూచనలు ఇస్తున్నారు. ఆయన స్వయంగా వేదిక వద్దకు వెళ్లి, ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందిలేకుండా అధికారులు చేస్తున్న ఏర్పాట్లు అడిగి తెలుసుకుని, తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. సభ ముందు ప్రాంతం చదును చేయడం నుంచి, దూరంగా ఉండే ప్రజలకు ఎల్‌ఈడీ స్క్రీన్ల ఏర్పాట్ల వరకూ ఆయన దగ్గరుండి మరీ సమీక్షిస్తున్నారు.

ఇదిలాఉండగా.. ప్రధానమంత్రి కార్యాలయం సహా, బీజేపీ జాతీయ కార్యాలయం సైతం ప్రధాని మోదీ సభ ఏర్పాట్లపై, మంత్రి సత్యకుమార్ నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా అమరావతి సభలో ప్రధాని మోదీ ప్రసంగానికి సంబంధించిన పాయింట్లు, ప్రధాన అంశాలలో కూడా మంత్రి సత్యకుమార్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఢిల్లీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి సత్యకుమార్‌తోపాటు ఏపీ బీజేపీ సంఘటనా మంత్రి మధుక ర్‌జీ కూడా ఏర్పాట్లు పరిశీలించారు.

LEAVE A RESPONSE