Suryaa.co.in

Telangana

తెలంగాణా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబు

* ఏకగ్రీవంగా ఎన్నిక.. అధికారికంగా ప్రకటించిన పుల్లెల గోపిచంద్
* తెలంగాణను క్రీడలకు హబ్ గా మారుస్తాం; మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్: బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు పుల్లెల గోపిచంద్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.

అనంతరం అధ్యక్షుడిగా ఎన్నికైన మంత్రి శ్రీధర్ బాబును సచివాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ. ఒక క్రీడాకారుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలంగాణను క్రీడలకు హబ్ గా మార్చాలని కంకణం కట్టుకున్నారన్నారు.

‘దక్షిణ కొరియాలోని ఒక చిన్న స్పోర్ట్స్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఇటీవల జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ లో 37 పతకాలు సాధించారు. ఈ స్ఫూర్తితోనే తెలంగాణలోనూ స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించబోతున్నాం.

అకడమిక్స్, గేమ్స్ ను మిళితం చేస్తూ విద్యార్థి వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చి దిద్దుతూ.. ప్రతిభను వెలికితీసేందుకు స్పోర్ట్స్ పాలసీకి రూపకల్పన చేస్తున్నాం. ఈ ప్రక్రియలో విద్యావేత్తలు, ప్రముఖ క్రీడాకారులను భాగస్వామ్యం చేస్తున్నాం. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటాలన్నదే ప్రజా ప్రభుత్వం లక్ష్యం’ అని వివరించారు. ‘తెలంగాణలో ప్రతిభకు కొదవ లేదు.

క్రీడల్లో సత్తా చాటుతూ గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ అనుబంధ కేంద్రాలు, స్పోర్ట్స్ హబ్స్ ఏర్పాటు చేస్తాం. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ అకడమిక్, స్పోర్ట్స్ కు సంబంధించిన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాం. పేదలు, ధనికుల మధ్య తారతమ్యాలు లేకుండా సమ్మిళిత వృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంది’ అని వివరించారు.

‘ కొత్త పాఠశాలలకు అనుమతులిచ్చే ప్రక్రియలో మార్పులు తేబోతున్నానం. పాఠశాల ఆవరణలో మైదానం ఉంటేనే పర్మిషన్ ఇస్తాం. అందరూ కలిస్తేనే క్రీడలను అభివృద్ధి చేయగలం. ప్రభుత్వం తరఫున క్రీడాకారులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంద. ఒలంపిక్ సంఘం, ఇతర సంఘాలు, అకాడమీలను కలుపుకుని ముందుకు వెళ్తాం’ అని పేర్కొన్నారు.

క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు పుల్లెల గోపిచంద్ పేర్కొన్నారు. ‘ప్రభుత్వం సహకరిస్తేనే క్రీడలు అభివృద్ధి చెందుతాయి. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం. స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ పాలసీ తీసుకురావడం నిజంగా గొప్ప ప్రయత్నం’ అని పేర్కొన్నారు.

ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్(అండర్ – 19 ఇయర్స్) ను గచ్చిబౌలీలోని గోపిచంద్ అకాడమీలో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు.

LEAVE A RESPONSE