Suryaa.co.in

Telangana

ప్రయాణికులకు అందుబాటులోకి కొత్త ఏసీ స్లీపర్ బస్సులు!

రాష్ట్రంలో తొలిసారిగా వాడకంలోకి తెచ్చిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లోని విజయవాడ మార్గంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ ఈరోజు జెండా ఊపి ప్రారంభించిన కొత్త ఏసీ స్లీపర్ బస్సులు.ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్‌ హంగులతో తొలిసారిగా ఏసీ స్లీపర్‌ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) అందుబాటులోకి తీసుకువస్తోంది. మొదటి విడతగా 16 ఏసీ స్లీపర్‌ బస్సులను వాడకంలో తెస్తోంది. ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన ఈ బస్సులు సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయి. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులను సంస్థ నడపనుంది.

ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించాలనే ఉద్దేశంతో ఇటీవల కొత్త సూపర్ లగ్జరీ 630 బస్సులను, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 8 బస్సులను, నాన్ ఏసీ స్లీపర్ 4 బస్సులను సంస్థ ప్రారంభించింది. వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలోనే సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువ అయ్యేందుకు అత్యాధునిక హంగులతో కొత్త ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు ‘లహరి-అమ్మఒడి అనుభూతి’గా నామకరణం చేసింది.

ఈ కార్యక్రమానికి టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ , టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరైనారు

LEAVE A RESPONSE