– భీమవరంలో బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం: అమరావతి రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమ సభకు గోదావరి జిల్లాల ప్రజలు పెద్దయెత్తున తరలి వెళ్లారు. శుక్రవారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పాత బస్టాండ్ నుండి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అమరావతి రాజధాని పునర్నిర్మాణం కార్యక్రమ సభకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేయుచున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో 150 బస్సులలో 7,500 మంది ప్రజలు పశ్చిమగోదావరి జిల్లా నుండి బయలుదేరి వెళ్లారని తెలిపారు.
ఈ సందర్భంగా బస్సులలో ప్రయాణించే వారి అందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగ కుండా ఆహార పానీయాలు, వైద్య సహాయంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున బస్సుల్లో ప్రయాణం చేసేవారికి ఎటువంటి అలసట నీరసము రాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అరటి పళ్ళు, జామకాయలు, కేక్, వాటర్ బాటిల్స్ ప్రతి బస్సులోను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందరిని సురక్షితంగా తీసుకుని వెళ్లి, తీసుకురావడానికి ప్రతి బస్సుకు ఒక కోఆర్డినేటర్ ను, మహిళా పోలీస్ ను ఏఎన్ఎం ను నియమించడం జరిగిందన్నారు.
సాయంత్రం మూడు గంటలకు జరగనున్న ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సభకు జిల్లా నుండి బయలుదేరి వెళ్లే ప్రజలు అందరూ హాజరై సభను విజయవంత చేసి సురక్షితంగా తిరిగి రావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకాంక్షించారు. అమరావతికి బస్సులు బయలుదేరే ముందు జై అమరావతి, జై జై అమరావతి అంటూ ప్రజలు నినాదాలు చేస్తూ బస్సుల్లో బయలుదేరి వెళ్లారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఎఎంసి మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, రెవెన్యూ, మెప్మా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.