నిజం మాట్లాడితే టీఆర్ఎస్ నేతలకు ఉలుకెందుకు?

– కేసీఆర్ కుటుంబ పాలనలో ధ్వంసమైన తెలంగాణ
– టీఆర్ఎస్ ను తరిమికొట్టే రోజులు రాబోతున్నయ్
– బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడివన్నీ అక్షర సత్యాలే. నిజాలు మాట్లాడితే రాష్ట్ర మంత్రులకు, టీఆర్ఎస్ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ ధ్వంసమైన మాట వాస్తవం కాదా? సంపన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి తీసుకొచ్చింది కేసీఆరే కాదా…

మజ్లిస్ నేతలతో అంటకాగుతూ 15 శాతం ఓట్ల కోసం హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నది టీఆర్ఎస్ నేతలు కాదా? కేసీఆర్ కుటుంబం ఉద్యమాలు చేసి జైలుకు పోయిందంటూ రాష్ట్ర మంత్రులు సిగ్గు లేకుండా పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది బలిదానాలు చేసుకున్నారు. వేలాది మంది జైలుకు పోయారు. వారి త్యాగాల పునాదులపై తెలంగాణ వస్తే అధికారం చెలాయిస్తున్న కేసీఆర్ స్వరాష్ట్ర ఉద్యమంలో ఒక్కనాడైనా జైలుకు పోయాడా? దొంగ దీక్షలు… ఝూఠా మాటలతో ప్రజలను రెచ్చగొట్టి తెలంగాణ యువత చావుకు కారణమైన టీఆర్ఎస్ నేతలు సిగ్గూ,శరం లేకుండా నోటికొచ్చినట్లు అబద్దాలు చెబుతూ ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారు.

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ భాగోతం మొత్తం తెలిసిపోయింది. అందుకే టీఆర్ఎస్ ను ఛీ కొడుతున్నారు. ఈ విషయం తెలిసి దేశ రాజకీయాలు, సంచలనాలంటూ కల్లబొల్లి మాటలు చెబుతూ కేసీఆర్ పబ్బం గడుపుతున్నారు. కేసీఆర్ తలకిందపెట్టి తపస్సు చేసినా జనం ఆయన మాటలు నమ్మరు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీఆర్ఎస్ ను తరిమికొట్టడం తథ్యం. తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడటం ఖాయం.

Leave a Reply