Suryaa.co.in

Telangana

బాప్ ఏక్ నంబర్.. బేటా దస్ నంబర్

– అసలు కేసీఆర్ మనీషా… మానవ రూపంలో ఉన్న మృగమా?
– 2001 కి ముందు కేసీఆర్ కు తొడుక్కోవడానికి చెప్పులు లేవు
– ఇవాళ ఇన్ని లక్షల కోట్లు కేసీఆర్ కు ఎలా వచ్చాయి
– తొమ్మిదేళ్లలో అమరుల కుటుంబాలకు బుక్కెడు బువ్వ పెట్టారా?
– ఆయన తరువాత కొడుకు..అటుపై మనుమడు వస్తడట
– ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నం
– మూడోసారి ప్రజల్ని నట్టేట ముంచడానికి రెడీ అయ్యారు
– మీకు డిపాజిట్లు వస్తే మేము గుండు కొట్టించుకుంటాం
మీ ఒంట్లో చీము, నెత్తురు ఉంటే.. మీరు మీసమున్న మగాళ్లు అయితే నా సవాల్ ను స్వీకరించండి
ఎక్కడ మీరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టారో అక్కడే మీరు ఓట్లు అడగండని సీఎం కేసీఆర్ కు రేవంత్ సవాల్
– కేసీఆర్,కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫైర్

“తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. తండ్రిని నమ్మడం లేదని కొడుకును పంపిస్తుండు. బాప్ ఏక్ నంబర్.. బేటా దస్ నంబర్.. కేసీఆర్ కొడుకు కేసీఆర్ లాగే మోసం చేస్తాడు తప్ప ప్రజల కోసం ఆలోచించరు..మూడోసారి ప్రజల్ని నట్టేట ముంచడానికి రెడీ అయ్యారు…మళ్లీ మోసపోవద్దు…తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం తూముకుంట మునిసిపల్ కేంద్రంలో బీజేపీ, బీఆరెస్ నుంచి పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం వారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అరవై ఏండ్ల తెలంగాణ ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చారు. రాజకీయంగా నష్టపోయినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. సోనియాగాంధీకి కృతజ్ఞత తెలిపే బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందన్నారు.

“1200 మంది అమరుల త్యాగాలను చులకన చేస్తూ నిన్న కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ బిడ్డల ప్రాణాల విలువ నీకు తెలుసా కేసీఆర్? చేగువేరా, నెల్సన్ మండేలా, సుభాష్ చంద్రబోస్, గాంధీ కుటుంబాలు ఆర్థికంగా ఎలా ఉన్నాయో చూడండి. అడవి బిడ్డల కోసం కొట్లాడిన కొమురం భీం మనుమడు పేదరికంలో ఉన్నారు. చాకలి ఐలమ్మ వారసులు చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రజల కోసం కొట్లాడిన కుటుంబాలు ఆదర్శంగా ఉంటూ పేదరికంలో బతుకుతున్నారు..2001 కి ముందు కేసీఆర్ కు తొడుక్కోవడానికి చెప్పులు లేవు..ఇవాళ ఇన్ని లక్షల కోట్లు కేసీఆర్ కు ఎలా వచ్చాయి..? ” అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

220 ఏండ్లు ఏలిన తరువాత నిజాం ధనవంతుడు అయ్యాడు..కానీ కేసీఆర్ పదేళ్లలో లక్షల కోట్లు సంపాదించారు. ఇలాంటి మీరా తెలంగాణ ఉద్యమకారులా? అని కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “తెలంగాణ కోసం 1200 మంది ప్రాణత్యాగం చేస్తే ప్రభుత్వం గుర్తించింది కేవలం 528 మందిని మాత్రమే..తొమ్మిదేళ్లలో అమరుల కుటుంబాలకు బుక్కెడు బువ్వ పెట్టారా? అసలు కేసీఆర్ మనీషా… మానవ రూపంలో ఉన్న మృగమా?మళ్లీ వెట్టి చాకిరి విధానం తీసుకురావాలని కేసీఆర్ చూస్తున్నారు. ఆయన తరువాత కొడుకు..అటుపై మనుమడు వస్తడట. తెలంగాణ ప్రజలను బానిసలుగా మార్చాలని చూస్తున్నారు” అని విమర్శించారు.

పేదల బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన రిజర్వేషన్లతోనే దళిత బిడ్డలు ఉన్నత స్థానాలకు ఎదిగారన్నారు. కాంగ్రెస్ ను ఎందుకు ఓడించాలో కేసీఆర్ చెప్పాలి…తెలంగాణ ఇచ్చినందుకా? పేదలకు రిజర్వేషన్లు ఇచ్చినందుకా? నాలుగు కోట్ల ప్రజలను నమ్మించి మోసగించిన కేసీఆర్ ను, ఆ పార్టీని బొంద పెట్టాలి అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

మీకు డిపాజిట్లు వస్తే మేము గుండు కొట్టించుకుంటాం: రేవంత్
తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఎక్కడెక్కడ ఇందిరమ్మ ఇళ్లు కట్టామో అక్కడే మేము ఓట్లు అడుగుతాం.. ఎక్కడ మీరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టారో అక్కడే మీరు ఓట్లు అడగండని సీఎం కేసీఆర్ కు రేవంత్ సవాల్ విసిరారు. కేసీఆర్, మంత్రి మల్లారెడ్డికి ఛాలెంజ్ విసురుతున్నా.. మీ ఒంట్లో చీము, నెత్తురు ఉంటే.. మీరు మీసమున్న మగాళ్లు అయితే నా సవాల్ ను స్వీకరించండని పేర్కొన్నారు.

ఏ నియోజకవర్గంలో మీకు డిపాజిట్లు రావు.. అయినా మీకు డిపాజిట్లు వస్తే మేము గుండు కొట్టించుకుంటామన్నారు రేవంత్. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో లక్ష్మాపూర్ లోని మూడు చింతలపల్లిలో కుమ్మరి ఎల్లవ్వ ఇంటికి వచ్చి చూస్తే.. మురికి నీరు అంతా ఆ ఇంట్లోకే వెళ్లేదన్నారు. ఆ తర్వాత రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఎల్లవ్వ ఇల్లు చూశా..రోడ్డు ఆరు ఫీట్లు ఎత్తు కట్టి ఎల్లవ్వ ఇల్లును ముంచేశారన్నారు.

కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లడానికి మంచి దారి వేసుకున్నాడంటూ సెటైర్లు వేశారు రేవంత్. రోడ్డు బాధితులకు న్యాయం చేయాలని ఎంపీగా కలెక్టర్ కు చెప్పినా పట్టించుకోలేదని చెప్పారు రేవంత్. ఇక్కడి బీఆర్ఎస్ నాయకులకు భూ కబ్జాలు తప్ప.. పేదల బాధలు పట్టవు అంటూ ఆరోపించారు. అందుకే మా నాయకులకు చెప్పి ఎల్లవ్వకు ఇందిరమ్మ ఇల్లు కట్టించామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రం మొత్తం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని పేర్కొన్నారు.

గతంలో రాష్ట్రంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ ది అన్నారు. అందుకే నేను కేసీఆర్ కు సవాల్ విసిరా.. ఎక్కడెక్కడ ఇందిరమ్మ ఇళ్లు కట్టామో అక్కడే మేము ఓట్లు అడుగుతామని పేర్కొన్నారు రేవంత్. ఎక్కడ మీరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టారో అక్కడే మీరు ఓట్లు అడగండని అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి మల్లారెడ్డికి సవాల్ విసురుతున్నా.. మీ ఒంట్లో చీము, నెత్తురు ఉంటే.. మీరు మీసమున్న మగాళ్లు అయితే నా సవాల్ ను స్వీకరించండని చెప్పారు రేవంత్ రెడ్డి. ఈ సవాల్ ను స్వీకరిస్తే ఏ నియోజకవర్గంలో మీకు డిపాజిట్లు రావు.. అయినా మీకు డిపాజిట్లు వస్తే మేము గుండు కొట్టించుకుంటామన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే పేదలకు రూ.5లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. రూ.5 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం, రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేసి ఆదుకుంటామని పేర్కొన్నారు. అలాగే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను ఏడాదిలోగా భర్తీ చేస్తామని, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.

కేసీఆర్ నివాళిలో అడుగడుగునా కృత్రిమ భావన..రేవంత్ రెడ్డి ట్వీట్
కేసీఆర్ నివాళిలో అడుగడుగునా కృత్రిమ భావన కనిపించిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ట్వీట్ చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా చివరి రోజు అమరవీరుల సంస్మరణసభలో ఆ కుటుంబాలకు సత్కారాల నుండి ఎలక్ట్రానిక్ కొవ్వొత్తుల ప్రదర్శన వరకు నిజాయితీ కొరవడిందని రేవంత్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు ఎందరో ద్రోహులను అందలం ఎక్కించిన కేసీఆర్ నిన్న అమరవీరుల కుటుంబాల కోసం ఒక్క ఎమ్మెల్సీ పదవైనా ప్రకటిస్తాడేమోనని తెలంగాణ ఆశించింది అని రేవంత్ ట్వీట్ చేశారు.

సఫీల్ గూడ, ఇందిరా నెహ్రూ నగర్ బస్తీలను సందర్శించిన రేవంత్ రెడ్డి
మల్కాజ్ గిరిలోని సఫీల్ గూడ, ఇందిరా నెహ్రూ నగర్ బస్తీలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సందర్శించారు. బస్తీవాసుల సమస్యలను రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. రైల్వే ట్రాక్, మిలిటరీ ఏరియా వైపు దారులను మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బస్తీవాసుల ఆయనతో మొరపెట్టుకున్నారు. దారులు మూసివేయడంతో పది అడుగుల దూరం ఉన్న ఇతర బస్తీలకు వెళ్లేందుకు… కిలోమీటరుకు పైగా తిరిగి వెళ్లాల్సి బస్తీవాసులు వివరించారు. తమ సమస్యలను పరిష్కరించాలని బస్తీవాసులు రేవంత్ రెడ్డిని కోరారు.

LEAVE A RESPONSE