Suryaa.co.in

Editorial

సకుటుంబ.. సపరివార.. స‘మేత’ంగా!

  • ఆ మంత్రి గారి రూటే సెప‘రేటు’

  • ‘బరువు’ బాధ్యతలన్నీ తండ్రి-బావలేనట

  • ‘బావగారి బంధం’ బహు బాగట

  • ఆ శాఖలో బావగారు చెప్పకపోతే ఫైలు కదలదట

  • ఇసుక రీచ్, అన్నా క్యాంటీన్, జనరిక్ షాపులన్నీ అమలాపురానికేనట

  • నియోజకవర్గం మారినా అంతా అమలాపురం వాసనలే

  • పార్టీ మారినా పోని పాత వాసనలు

  • ఆ నియోజకవర్గంలో అనాధగా మారిన టీడీపీ

  • సొంత కులంలోనే తిరుగుబాటు

  • మంత్రిగారిపై విశృంఖలంగా సొంత కులం నేతల పోస్టింగులు

  • ఫ్యాక్టరీలో పేలుళ్లు జరిగితే కాసులపంటే

  • ఫార్మా, కెమికల్ కంపెనీలో వసూల్‌రాజాలు

  • థర్డ్‌పార్టీ ఏజెన్సీలు అడిగినంత ఇచ్చుకోవాల్సిందే

  • ఓ అధికారి తమ్ముడికే ఏజెన్సీ ఇవ్వాలట

  • తమ్ముడి కోసం ఇతర ఏజెన్సీలపై వేటు

  • ధర్డ్‌పార్టీ ఏజెన్సీలలో ఆయనే ‘రాజు’

  • విశాఖ వేదికగా పరిశ్రమల్లో ‘వసూల్‌రాజా’ జోరు

  • ‘సాన’బట్టిన నేత మేనేజర్‌తో కలసి వసూళ్ల పర్వం

  • ఎన్నికల ఖర్చు రికవరీ చేసే ఉద్యమమట

  • హడలిపోతున్న పారిశ్రామికవేత్తలు

  • బాధితుల్లో కమ్మవారే ఎక్కువట

  • లోకేష్‌కు ఫిర్యాదు చేసినా దక్కని ఫలితం

( మార్తి సుబ్రహ్మణ్యం)

చూడ్డానికి ఆ శాఖకు పెద్ద పనేమీ ఉండదనుకుంటారు. అందులో పెద్దగా ఏమీ రాలవనుకుంటారు. ఆ శాఖను వారంతా సకుటుంబ సపరివార స‘మేత’ంగా పంచేసుకున్నారు. ఒక కొడుకు..ఒక తండ్రి.. ఒక బావ. అదీ ఆ శాఖలో సినిమా! మామూళ్ల విషయంలో సారు ఫ్యామిలీ ‘చాలా స్ట్రిక్టు’గా ఉంటారట.

మంత్రిగారు ఎన్నికల్లో చేసిన ఖర్చు రికవరీ కోసం.. ఇటీవలే ప్రజాప్రతినిధి అవతారమెత్తిన ఓ యువ నేత బంధువుతో కలసి, విశాఖలో వ్యవహారాలు ‘సాన’బెడుతున్నారట. విశాఖలోని ఫార్మా కంపెనీలు సహా ఇతర పెద్ద కంపెనీల్లో తరచూ జరిగే పేలుళ్లు, సారుకు కాసులు కురిపిస్తున్నాయట.అంటే పేలుడు జరిగితే పండగేనన్నమాట! పేలుడు జరిగిన వెంటనే తన శాఖ అధికారితో బావగారిని మాట్లాడిస్తున్నారట.

అంతేనా? ఫార్మా కంపెనీలో సేఫ్టీని తనిఖీ చేసి నివేదికలిచ్చే, సాదాసీదా థర్డ్ పార్టీ ఏజెన్సీ వారిని కూడా సారు విడిచిపెట్టడం లేదట. తన శాఖలోని ఫ్యాక్టరీస్ విభాగంలో పనిచేసే ఓ ఉన్నతాధికారి తమ్ముడికి ఉన్న సొత ఏజెన్సీకే, థర్డ్‌పార్టీ ఆర్డరివ్వాలని హుకుం జారీ చేస్తున్నారట. పైగా తాను చెప్పిన రేటుకయితేనే ఏజెన్సీ పనిచేసుకోండి అని చెబుతున్నారట. ఈ విషయంలో బావగారు ఎంత చెబితే అంతట!

సకుటుంబ సపరివార స‘మేతం’గా జరుగుతున్న ఈ వ్యవహారంతో విశాఖ, రాజమండ్రికి చెందిన కమ్మ పారిశ్రామికవేత్తలు హడిపోతున్నారట. వసూల్‌రాజా ధాటికి తట్టుకోలేక విలవిల్లాడుతున్నారట. గత ఎన్నికల్లో కులాభిమానంతో, పార్టీపై అభిమానంతో విరాళాలు అందించిన ఈ సామాజికవర్గ పారిశ్రామికవేత్తలు, మళ్లీ ఈ అదనపు బాదుడు భరించలేకపోతున్నారట. ఆ మధ్య లోకేష్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదట. విచిత్రమేమిటంటే.. బాధితులు ఎవరిపైనయితే ఫిర్యాదు చేస్తారో, ఆ ఫిర్యాదు కాపీ చివరాఖరకు సదరు అధికారి టేబుల్‌పైకే వెళ్లడం!

ఈ విషయంలో సారు ఫ్యామిలీ ఎవరు చెప్పినా ‘చాలా స్ట్రిక్టుగా’ ఉంటారట. గుంటూరు జిల్లాకుచెందిన ఓ టీడీపీ దళిత మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే చెప్పినా బేఖాతరన్నారంటే.. వసూళ్ల విషయంలో సారు ఫ్యామిలీ ‘ఎంత స్ట్రిక్టు’గా ఉందో అర్ధమవుతోంది కదా? విశాఖ, రాజమండ్రి ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలు ఎక్కువ. వీటిలో తరచూ పేలుళ్లు జరిగి కార్మికులు, ఉద్యోగులు చనిపోతున్న వైనం మీడియాలో వస్తూనే ఉంటుంది. అయితే అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కంపెనీలు ఒక థర్డ్‌పార్టీ సేఫ్టీ ఏజెన్సీని నియమించుకుంటాయి.

అవి కంపెనీలోని రక్షణ లోపాలను పరిశీలించి, నివేదిక ఇస్తుంటాయి. పెద్ద కంపెనీలకయితే కనీసం ముగ్గురు ఉద్యోగులు రావలసి ఉంటుంది. వారికి విజిటింగ్ ఫీజు, తిండి, వసతి సౌకర్యాలన్నీ సదరు ఏజెన్సీనే చూసుకోవలసి ఉంటుంది. అందువల్ల ఏజెన్సీలు కంపెనీల నుంచి 2 లక్షల వరకూ ఫీజు వసూలు చేస్తుంటాయి. ఈవిధంగా రాష్టంలో ఒక అరడజనుకు పైగా సేఫ్టీ ఏజెన్సీలుంటాయి. అదే శాఖలోని ఫ్యాక్టరీస్ విభాగానికి చెందిన ఓ కీలక అధికారి తమ్ముడికి సైతం ఒక ఏజెన్సీ ఉంది. అది ఫ్యాక్టరీ విజిట్‌కు వెళితే 5 లక్షలకు తక్కువ వసూలు చేయదన్న ప్రచారం ఉంది. కారణం అన్నగారు వడ్డించే స్థానంలో కూర్చోవడమేనట.

చిన్న-మధ్య తరహా ఫ్యాక్టరీ యాజమాన్యాలు కూడా ఆ భయంతోనే, సదరు అధికారి తమ్ముడిగారి ఏజెన్సీకే ఇస్తాయట. అయితే పెద్ద కంపెనీలు మాత్రం 2 లక్షలు లోపు ఫీజు తీసుకునే ఏజెన్సీకే ఇస్తుండటం, తనకు పోటీ రావడం సహించలేని రాజుగారు.. తన అన్న గారికి చెప్పి, ఆ 2 లక్షలఫీజు తీసుకునే ఏజెన్సీపై మంత్రిగారికి చాడీలు చెప్పించారట. అతగాడు 5 లక్షలు ఫీజు తీసుకుంటున్నాడు కాబట్టి, పిలిచి ‘మాట్లాడుకోమ’ని అన్నగారు మంత్రి-ఆయన బావకు సలహా ఇచ్చారట. పైగా ఆ ఏజెన్సీ వైసీపీ వాళ్లకు సంబంధించినదంటూ మసాలా దట్టించారట.

దానితో రంగంలోకి దిగిన మంత్రి బావగారు ఆ ఏజెన్సీని పిలిచి, మా సంగతేమిటని పేషీలోనే బేరానికి దిగారు. అంత ఇచ్చుకోలేనని, తన ఏజెన్సీకి అంత తాహతు లేదని ఏజెన్సీ యజమానికి చేతులెత్తేశారట. పోనీ కంపెనీల వాళ్లతో మాట్లాడి తమ సంగతి చూసుకోమని చెప్పారట. అయితే తానెవరితోనూ మాట్లాడనని ఖరాఖండీగా చెప్పారు. ఆ విషయాన్ని బావగారు బావమరిదికి చేరవేశారట. అందుకు ఆగ్రహించిన మంత్రి.. విశాఖలో స్వయంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో.. ఏకంగా సదరు ఏజెన్సీపై వైసీపీ వారి పెత్తనం ఇక సాగదని, ఏజెన్సీల ఆటకట్టిస్తానని హెచ్చరించారు. వారికి ఎవరూ ఆ ఏజెన్సీకి వర్కులివ్వవద్దని పేరు చెప్పి మరీ ఆదేశించారట.

ఒక మంత్రి స్థాయి వ్యక్తి, చిన్న ఏజెన్సీ గురించి ప్రెస్‌మీట్‌లో మాట్లాడటం పరిశ్రమల యజమానులను విస్మయపరిచింది. ఇక అప్పటినుంచి ఆ పరిశ్రమలయజమానులు మంత్రికి భయపడి, వర్కులివ్వడం మానేశారట. ఈవిధంగా నష్టపోతున్న వారిలో కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉండటం విశేషం.

ఇప్పుడు కోస్తాలో క్షత్రియ వర్గానికి చెందిన ఏజెన్సీలు, రాయలసీమలో రెడ్ల ఏజెన్సీలకు అధికారులే సిఫార్సు చేస్తుండగా.. తాము మాత్రం ఎటూ కాకుండా పోయామని కమ్మ వర్గానికి చెందిన ఏజెన్సీలు బావురుమంటున్నాయి.

దానితో గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులకు విరాళమిచ్చిన సదరు ఏజెన్సీ యజమాని, ఈ విషయాన్ని తన నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నక్కా ఆనందబాబుకు చెప్పి భోరుమన్నారట. దానికి స్పందించిన నక్కా సదరు మంత్రిగారికి ఫోన్ చేసి, ఆ ఏజెన్సీ యజమాని పార్టీ సానుభూతిపరుడేనని చెప్పడంతో, తనను వచ్చి కలవమని మంత్రి బదులిచ్చారట. మంత్రిగారి వద్దకు వెళ్లిన ఆ ఏజెన్సీ యజమానిని.. నువ్వు ఎమ్మెల్యే దగ్గరికిపోతే విడిచిపెడతానా? అని తాను చెప్పిన రేటు ఇవ్వాలని స్పష్టం చేశారట. దానితో దిక్కుతోచని సదరు ఏజన్సీ యజమాని తన వ్యాపారం మూసుకున్నట్లు తెలుస్తోంది.

ఈవిధంగా మంత్రి, ఫ్యాక్టరీస్ విభాగంలోని కీలక అధికారి బాధితులు కొద్దిరోజుల క్రిత ం మంత్రి లోకేష్ దగ్గరకు వెళ్లి, తమ బాధలు వెళ్లబోసుకున్నారట. ఆ ఫిర్యాదును తీసుకున్న లోకేష్ ఆఫీసు సిబ్బంది.. దానిని సహజంగానే సంబంధిత శాఖ అధికారి అయిన ఫ్యాక్టరీస్ హెడ్‌కే పంపించారట.

అంటే ఎవరి నుంచయితే ఇబ్బందులు పడుతున్నారో, అదే అధికారి దగ్గరకు ఫిర్యాదు కాపీ పంపించారన్నమాట. అన్నట్లు త్వరలో రిటైరవనున్న సదరు ఫ్యాక్టరీస్ కీలక అధికారి, తన తమ్ముడు నిర్వహించిన ఏజెన్సీ వ్యాపారంలో దిగబోతున్నారట. దానికంటే ముందు ఓ రాజుల కంపెనీకి సేఫ్టీ అడ్వైజర్‌గా ఉండేందుకు ఒప్పందం కుదిరిందంటున్నారు. అదీ సంగతి!

ఇక ఫార్మా, కెమికల్ కంపెనీల్లో పేలుళ్లు జరిగిన వెంటనే రంగంలోకి దిగిపోతున్న ‘బావగారు’, కంపెనీవారితో బేరాలాడుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. ఈ వ్యవహారంలో ఫ్యాక్టరీస్ విభాగంలోని ఉన్నతాధికారి తమ్ముడు, పరిశ్రమల యజమానులతో బేరాలకు దిగి, వ్యవహారం సెటిల్ చేస్తున్నట్లు ఆ శాఖలో బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

తాజాగా పరవాడలోని ఓ ఫార్మా కంపెనీలో విషవాయు లీకయి ఇద్దరు కార్మికులు చనిపోయారు. కంపెనీ యాజమాన్యం వారికి 40 లక్షల చొప్పున నష్టపరిహారం అందించింది. దీనిని అనువుగా చేసుకున్న ‘బావగారు’ సదరు పరిశ్రమ యజమానికి దాదాపు 2 కోట్లు ఇవ్వాలని బేరం పెట్టారట. అందుకు ఆయన అంగీకరించకపోవడంతో, శాఖాధికారులు ఆ పరిశ్రమకు క్లోజింగ్ ఆర్డర్ ఇచ్చారు. అయితే తాజాగా మళ్లీ దానిని రిఓక్ చేస్తూ ఉత్తర్వులిచ్చారంటే, తెరవెనుక ఏం జరిగిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

అదేవిధంగా జగ్గయ్యపేటలోని ఓ జాతీయ స్థాయి సిమెంట్ ప్లాంట్‌లో పేలుడు జరిగి ఇద్దరు చనిపోగా, చాలామందికి గాయాలయ్యాయి. ఆ కంపెనీ ప్రతినిధిని పిలిపించిన బావగారు బేరం పెట్టారట. అందుకు ఒప్పుకోని ఆ మల్టీనేషన్ కంపెనీ.. దీనిని సీఎంఓ దృష్టికి తీసుకువెళ్లగా, భయంతో వారిని వదిలేశారట. కానీ అచ్యుతాపురం ఎస్‌ఈజడ్ లోని ఓ కెమికల్స్‌లో, పేలుడు జరిగి ఒకరు మరణించిన ఘటనను మాత్రం సొమ్ము చేసుకున్నారట.

‘మంత్రిగారి బావతో మాట్లాడుకోండి. లేకపోతే వ్యవహారం సీరియస్ అవుతుంద’ని స్థానిక అధికారులు బెదిరించడంతో.. రంగంలోకి దిగిన ఆ కంపెనీ యజమాని, తన మిత్రుడైన కైకలూరు ప్రజాప్రతినిధికి విషయం చె ప్పారట. దానితో మంత్రికి ఫోన్ చేసిన కైకలూరు ప్రజాప్రతినిధి.. ఫలానా కంపెనీ తన మిత్రుడిదేనని, అతను వచ్చి కలుస్తాడని చెప్పడం, ఆయన సరే రమ్మని సమయం ఇవ్వడం, బావగారు రంగంలోకి దిగి వ్యవహారం సెటిల్ చేయడం చకాచకా జరిగిపోయాయట. విచిత్రమేమిటంటే.. పేలుళ్లు, విషవాయువు లీకయి కార్మికులు మృతి చెందిన సందర్భంలో ఫ్యాక్టరీని క్లోజ్ చేయించి, హడావిడి చేసే అధికారులు మళ్లీ కొద్దిరోజులకే వాటిని ఎలా తెరిపిస్తున్నారు? ఎందుకు తెరిపిస్తున్నారని ఆలోచిస్తే, దానికి కారణం.. ‘మామూలే’

కాగా ఇటీవలే ప్రజాప్రతినిధి అవతారమెత్తిన కాకినాడ యువనేతతో కలసి.. బావగారు విశాఖ వేదికగా ఈ దందాలను ‘సాన’బెడుతున్నట్లు బహిరంగంగానే చర్చ జరుగుతోంది. ఆ మేరకు ఆ యువ ప్రతినిధి తన మేనేజర్‌గా విశాఖలో ఒకరిని నియమించార ని.. బావగారు-ఆ మేనేజర్ కలసి మెలసి ఫ్యాక్టర్టీలను పిండేపనిలో ఉన్నారన్నది పారిశ్రామికవర్గాల్లో వినిపిస్తున్న ముచ్చట. నిజం నారాయణుడికెరుక?

ద్రాక్షారామం గుడిలో ఫ్యామిలీదే పెత్తనం
సుప్రసిద్ధ ద్రాక్షారామంలో గత ఎన్నికల సమయంలో దొడ్డా మణిదీప్ అనే ఉద్యోగి వైసీపీ అభ్యర్ధి విజయం కోసం ప్రచారంలో పాల్గొన్నారట. టీడీపీ కార్యకర్తలు దానిని ఫొటోలు తీసి ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశారు. ఆయన దానిని పరిశీలించి సదరు ఉద్యోగిని విధుల నుంచి తప్పిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. అయితే మంత్రి గారి ఫ్యామిలీని‘తృప్తి’ పరిచిన సదరు సస్పెండైన ఉద్యోగి, మళ్లీ అదే ఆలయంలో నిక్షేపంగా ఉద్యోగం చేసుకుంటున్న ఫొటోలు, ఇటీవల సొషల్‌మీడియాలో ప్రత్యక్షమవడంపై టీడీపీ శ్రేణులు కస్సుమంటున్నాయి. వైసీపీ కోసం పనిచేసిన ఉద్యోగిని మంత్రిగారి ఫ్యామిలీ, మళ్లీ ఎలా తీసుకుంటారని, ఎన్నికలకు 24 రోజుల ముందు పార్టీలో చేరిన మంత్రికి పార్టీపై ఇంతకన్నా ఇంకేమి చిత్తశుద్ధి ఉంటుందని విరుచుకుపడుతున్నారు. అసలు మంత్రి గారి చుట్టూ ఒక్క టీడీపీ కార్యకర్త ఉండరని, నియోజకవర్గంలో తమ పార్టీ అందరూ ఉన్న అనాధ అన్నది తమ్ముళ్ల ఆవేదన.

గత ఎన్నికల్లో మిగిలిన వారితో సమానంగా రాత్రి వరకూ ఎన్నికల ప్రచారం చేసిన, సొంత సామాజికవర్గానికి చెందిన మండల సమాఖ్య అధ్యక్షురాలు వాసంశెట్టి లావణ్యను, అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగించటంపై పార్టీలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పోనీ జనసేనలో పనిచేసే కార్యకర్తలకు ఇచ్చినా బాగుండేదని, ఆ పార్టీ పేరు చెప్పుకుని తిరిగే వారికి పదవి ఇవ్వడంపై అటు జనసేనలోనూ ఆగ్రహం వ్యక్తమవుతోందట.

అంతా అమలాపురం వాసనలేనట!
కులసమీకరణల నేపథ్యంలో సొంత నియోజకవర్గం నుంచి, ఇక్కడి కి వచ్చి ఎమ్మెల్యే-మంత్రి అయినప్పటికీ.. గెలిచిన నియోజకవర్గంలో ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేస్తున్న తమ్ముళ్లను పట్టించుకునే దిక్కులేదట. అమలాపురంలో ఆయన సొంత అనుచరులు, వైసీపీలకే గె లిచిన నియోజకవర్గంలోనూ పనులవుతున్నాయన్న ప్రచారం ఉంది. పెదలంకలోని ఇసుక ర్యాంపు నుంచి జనరిక్ షాపు, తిరుమల లెటర్లు అన్నీ అమలాపురంలోని తన అనుచరులకే ధారాదత్తం చేయడంపై గెలిచిన నియోజకవర్గంలోని తమ్ముళ్లు అగ్గిరాముళ్లలవుతున్నారట. ఎవరైనా పనుల కోసం వెళితే ‘నాన్నగారిని కలిశారా’ అని, మరికొన్ని పనుల కోసం వెళితే ‘బావగారిని కలిశారా’ అని అంటున్న వైనంపై సోషల్‌మీడియాలో.. ‘నాన్నగారిని కలిశారా’ అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.

శెట్టిబలిజల్లోనూ తిరుగుబాటు
కాగా మంత్రి గారికి ఏ కులం చూసయితే మంత్రి పదవి ఇచ్చారో, ఆ కులంలోనే ఆయనపై తిరుగుబాటుకు తెరలేవడం విస్మయపరుస్తోంది. కుల తాలూకా కుల సంఘం నిర్వహించిన వనభోజనాలకు సైతం మంత్రిని ఆహ్వానించకపోవడం చర్చనీయాంశమయింది. మంత్రిగారు స్థానికేతరుడయినప్పటికీ.. కులాభిమానంతో గెలిపించుకున్న శెట్టిబలిజ నాయకులే, ఇప్పుడు మంత్రికి దూరంగా ఉండటంపై విస్మయం వ్యక్తమవుతోంది.

నిజానికి బలమైన సంస్థగా పేరున్న శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ (ఎస్‌ఏఎఫ్)ను 2019లో మేడిశెట్టి ఇస్రాయేల్ శ్రీనివాస్ అనే వ్యక్తి స్థాపించారట. దానితోపాటు స్థానిక శెట్టిబలిజ తాలూకా సంఘం రెండూ పవర్‌ఫుల్ సంస్థలని, ఏ అభ్యర్ధులకయినా వారి మద్దతు లేకపోతే గెలవడం కష్టమన్న ప్రచారం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రిగారు 2022లో దానికి మద్దతునిచ్చారని చెబుతున్నారు. అయితే మంత్రిగారిని ఎన్నికల ముందు ప్రోత్సహిస్తే.. చివరకు ఎస్‌ఏఎఫ్‌ను సొంతం చేసుకుని, కులంలో హీరో అయ్యారంటున్నారు.

‘‘కుల పెద్దలయిన ఇతర ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుని, వారిని గౌరవించాలని చెప్పినా వినకుండా, ఎమ్మెల్యే అయిన తర్వాత చివరకు సొంత కులం అధికారులనే తొలగించిన మంత్రికి మేం మద్దతు ఇవ్వడం మానేశాం. పైగా నియోజకవర్గంలో ఆయన అనుచరులు చేస్తున్న దందాలు పార్టీని భ్రష్టుపట్టిస్తున్నాయి. దొంగలబ్యాచ్‌ను వెంటేసుకుని తిరుగుతున్నారు. ఇటీవల మంత్రి అనుచరులు 75 లారీలతో ఉన్న ఇసుకను తరిస్తుంటే పోలీసులు పట్టుకుంటే మంత్రి తనకు సంబంధం లేదన్నారు. కానీ అధికారులు ప్రెస్‌మీట్ పెట్టి మంత్రి అనుచరుల పేర్లు ప్రకటించారు. నేను ఇవన్నీ ఆయనకు ఎస్‌ఎంఎస్ ద్వారా పంపించా. స్వయంగా మాట్లాడి చెప్పి చూశా. కులపెద్దలతో చెప్పించాం. కానీ మార్పు లేదు. అందుకే మేం ఆయనను కుల సంఘం మీటింగులకు పిలవడం లేదు. ఇటీవల శెట్టిబలిజ తాలూకా సంఘం నిర్వహించిన వనభోజనాలకు మంత్రిని ఆహ్వానించలేదంటే సొంత కులంలో ఆయనకు స్థానికంగా ఎంత మద్దతు ఉందో మీరే అర్ధం చేసుకోండి. అసలు ఎస్‌ఏఎఫ్ ఎవరిదో, దానిని ఇప్పటివరకూ ఎందుకు రిజిస్టర్ చేయలేదో అడగండి. ఇది ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అనడమే’’ అని రామచంద్రాపురం టీడీపీ నేత మేడిశెట్టి ఇస్రాయేల్ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

ఎన్నికల ముందు శెట్టిబలిజ యువకులను ఆకట్టుకునేందుకు, మంత్రి తాను కుల సంఘానికి కోటి రూపాయలు ఇస్తున్నానంటూ, ఆర్భాటంగా రాజకీయ కుల ప్రముఖుల సమక్షంలో డమ్మీ చెక్కు ఇచ్చారు. ఇప్పటికీ ఆ విరాళం ఇవ్వలేదని వెల్లడించారు. ఎస్‌ఏఎఫ్ పేరుతో వాట్సాప్ గ్రూపులు సృష్టించి, వాటి ద్వారా వచ్చిన విరాళాలకు లెక్కా పత్రం లేదన్నారు. ఇప్పటికీ దానికి కమిటీ లేదన్నారు. తాను సోషల్‌మీడియాలో చెప్పినవన్నీ అక్షరసత్యాలని, కాకపోతే ప్రభుత్వం- పార్టీ ఇంటలిజన్స్‌తో విచారణ చేయించుకోవచ్చని స్పష్టం చేశారు.

మంత్రి వ్యవహారశైలిపై తాను సీఎం చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేసిన మాట నిజమేనని, ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘నేను ఇదంతా పార్టీ మేలు కోసమే సీఎంగారికి ఫిర్యాదు చేశా. మంత్రి వైసీపీ నుంచి టీడీపీలో చేరినప్పుడు ఆయనతో ఒక్క కౌన్సిలర్ కూడా చేరలేదు. అదే నా వెంట ఎంతమంది సర్పంచులు, స్థానిక నేతలు చేరారో చూసుకోండి. ఇక్కడ మేం లోకల్. శెట్టిబలిజ సంఘాన్ని మేమంతా కంటికి రెప్పలా కాపాడుకుంటాం. దానికోసం నష్టపోయినా దానికి సిద్ధంగానే ఉంటాం. కులపెద్దలందరినీ గౌరవిస్తాం. అలాగే ఎమ్మెల్యేలను కూడా కులపెద్దలను గౌరవించాలని చెబుతాం.

కానీ ఆయనకు మంత్రి పదవి వచ్చిన తర్వాత మా కులానికి చెందిన అధికారులకు లాభం కలగకపోగా, ఉన్నవారిని తీసేస్తుంటే కులంలో మాపై ఎంత ఒత్తిడి ఉంటుంది? మాకెంత అవమానంగా ఉంటుంది? ఆయన చుట్టూ ఎవరు ఉంటున్నారు? ఏ తరహా వ్యక్తులు ఉంటున్నారో మీరే చూస్తున్నారు. మీడియాలో రోజూ వస్తూనే ఉన్నాయి. అవన్నీ సీఎం గారికి ఫిర్యాదు చేశాం. ఆయనకు ఎవరెవరి మద్దతో ఉందంటున్నారు. అయినా మేం భయపడం. మేం పార్టీ కోసం, కులం కోసం పనిచేసేవాళ్లం’’ అని ఇస్రాయేలు శ్రీనివాస్ స్పష్టం చేశారు.

‘ఫ్యామిలీ ప్యాకేజీ’లో మరికొన్ని ముచ్చట్లు
– బావగారు జిల్లాల్లోని డిప్యూటీ చీఫ్ ఇన్స్‌పెక్టర్లకు ఫోన్ చేసి, పరిశ్రమలకు సంబంధించిన అన్ని పనులను నరసింహరాజు ద్వారా చేయించుకోవాలని, ఫోన్ల ద్వారా ఆదేశిస్తున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
– మంత్రిగారి ఇలాకాలో వైసీపీ సర్కారులో ఫుడ్ కమిషన్ మెంబరుగా ఉన్న వైసీపీ నేత కు రెండు వైన్‌షాపులు దక్కాయట.
– శేఖర్ అనే వ్యక్తి ఇసుక, మద్యం వ్యవహారంలో చక్రం తిప్పుతున్నట్లు పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.
– తాజాగా సర్పవరం పోలీసుస్టేషన్‌లో ఒక మహిళను భయపెట్టి ఖాళీ చెక్కులపై సంతకం చేయించుకున్న ఫిర్యాదుపై, మంత్రి అనుచరులపై కేసు నమూదు చేశారు.
– సొంత శాఖలో అయినా, నియోజకవర్గంలో అయినా.. తాను చెప్పిన మాట వినని అధికారులు-ఏజెన్సీలు- వ్యక్తులపై, వైసీపీ ముద్ర వేసి తాను కోరుకున్న వారిని తెచ్చుకుంటున్నారని తమ్ముళ్లు చెబుతున్నారు.
– అనుమతులు లేని ఆక్వా చెరువుల తవ్వకాలకు సంబంధించి రైతులు గత వైసీపీ సర్కారులో ఫార్మాలిటీస్ ఇచ్చారు కాబట్టి.. తమకూ ఫార్మాలిటీస్ ఇవ్వాలన్న మంత్రి గారి వీడియోను, ఎంపి పిల్లి సుభాష్‌చంద్రబోస్ విడుదల చేసిన వైనం.. పార్టీని అప్రతిష్ఠపాలు చేసిందని కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు.

LEAVE A RESPONSE