Suryaa.co.in

Telangana

కేసీఆర్….వడ్లపై ఎందుకీ డ్రామాలు

-ఇది ముమ్మాటికీ రైతులపై కక్ష సాధింపు చర్యే
-రైతులు తిరగబడటం ఖాయం
– వడ్ల కొనుగోలుపై ప్రతి పైసా చెల్లించేది కేంద్రమే
– చేతనైతే సహకరించు…లేదంటూ ఫాంహౌజ్ లో పడుకో..
-కశ్మీర్ ఫైల్స్ సినిమాపై అంత అక్కసు ఎందుకో…
-నీదంతా కేడీ నెంబర్ వన్ సినిమా బాపతే కదా..
– రజాకార్ ఫైల్స్, ఓల్డ్ సిటీ ఫైల్స్ చూపిస్తే నీ పని ఖతమే….
-మోదీ పాలనను ప్రపంచమే కీర్తిస్తుంటే..నీకంత అక్కసెందుకు?
-సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ ఫైర్

యాసంగి ధాన్యం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుకో కొత్త డ్రామాలాడుతూ రైతుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. తన పాలన పట్ల ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకే కేసీఆర్ ఇట్లాంటి డ్రామాలాడుతున్నారని అన్నారు. కేసీఆర్ దుకాణం బంద్ అయ్యిందని… రైతులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతి పైసా చెల్లిస్తోంది కేంద్రమేనని… ఇకపైనా కేంద్రం తెలంగాణ రైతులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం చేసేది బ్రోకరిజమేనని చెప్పారు.

‘ కేసీఆర్… చేతనైతే బ్రోకరిజం చెయ్.. కమీషన్ తీసుకో… చేతగాకుంటే ఇంట్లో పడుకో… అంతే తప్ప రైతులపై కక్ష సాధింపు చర్యలు మానుకో… లేకుంటే రైతులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్ ’’అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈరోజు ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, ఢిల్లీలో పార్టీ రాష్ట్ర సమన్వయకర్త నూనె బాలరాజ్, పార్టీ నేత లంకల దీపక్ రెడ్డితో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ యాసంగి వడ్ల కొనుగోలు, కశ్మీర్ ఫైల్స్, మోదీ పాలన విషయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అందులోని ముఖ్యాంశాలు…..

సీఎం కేసీఆర్ కు వయసు మీద పడ్డది. కాయల్ (మతి) తప్పింది. గంటల కొద్దీ ఏదేదో మాట్లాడుతున్నడు. తన పాలనపై ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకు రోజుకో కొత్త సమస్యను స్రుష్టించి దాని ద్వారా జల్సా చేయడమే పనిగా పెట్టుకున్నడు. ప్రజల దృష్టి మళ్లించేందుకే వడ్ల పేరిట డ్రామాలాడుతున్నరు.
నిన్న కూడా పీయూష్ గోయల్ స్పష్టంగా చెప్పారు. రా రైస్ కొంటామని స్పష్టం చేశారు. దేశంలోని అన్ని రాష్ర్టాలు బియ్యం సేకరణపై స్పందించినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంత వరకు స్పందించలేదని, గతంలో ఇచ్చిన బియ్యం కూడా ఇయ్యలేదని క్లియర్ గా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అంచనా లేదు. విధివిధానాల్లేవని పీయూష్ గోయల్ గతంలోనూ పార్లమెంట్ సాక్షిగా చెప్పారు.

ఇన్నాళ్లు బాయిల్డ్ రైస్ కొనాలని డ్రామాలాడిన కేసీఆర్ ఇప్పుడు మాటమార్చి వడ్లు మాత్రమే కొనాలని మళ్లీ కొత్త డ్రామా చేస్తున్నడు. గతంలో ధాన్యం మొత్తం కొనేది మేమే అన్నడు. కేంద్రం గింజ కూడా కొనడం లేదన్నడు. కేంద్రం వద్దకు పోయి ‘భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ ఇవ్వబోము’’అని సంతకం చేస్తడు. బయటకొచ్చి కేంద్రం బాయిల్డ్ రైస్ కొనాల్సిందేనని మాటమారుస్తడు.

కేంద్రం మెడమీద కత్తిపెడితే రాసిచ్చినని అబద్దాలు చెబుతడు. బాయిల్డ్ రైస్ కొనకుంటే ఇండియా గేట్ దగ్గర వడ్లు పారబోస్తానన్నడు. అంతకుముందు మళ్లీ బాయిల్డ్ రైస్ కొనకుంటే మరి ఎందుకు ఆనాడు పోయలేదు? మళ్లా ఈసారి వడ్ల కొనుగోలు కేంద్రాలు మూసేస్తున్నట్లు ప్రకటించినవ్… ఇప్పుడు కేంద్రమే వడ్లు కొనాలంటున్నవ్.

గతంలో వరి వేస్తే ఉరే గతి అని రైతులను బెదిరిస్తడు… ఆయన మాత్రం ఫాంహౌజ్ లో వరి పంట వేసి కోటీశ్వరుడైతడు.. రైతులను బికారి చేస్తడు.. రైతులు ఇబ్బంది పడుతుంటే రాక్షసానందం పొందుతున్నడు. నీలాంటి వ్యక్తి సీఎంగా కొనసాగడం బాధాకరం.

కేసీఆర్… అసలెందుకీ డ్రామాలు? కేంద్రం కొనడానికి సిద్ధంగా ఉంది కదా… ఎందుకు సహకరించడం లేదు? వడ్లు మాత్రమే కొనాలని ఇన్నాళ్లూ ఎందుకు చెప్పలేదు? కేంద్రం అనేకసార్లు మీటింగ్ పెడితే ఎందుకు చెప్పలేదు? నీ మూర్ఖత్వంవల్ల రైతులు ఇబ్బంది పడుతుంటే జల్సా చేస్తవా? రైతుల పట్ల కక్ష సాధింపు చర్యలెందుకు… ఇట్లనే చేస్తే రైతులు తిరగబడే రోజులు వస్తయ్ జాగ్రత్త…

ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగింది. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలే అక్రమాలకు పాల్పడ్డరని మా దగ్గర సమాచారం ఉంది. దీనిపై సమగ్ర విచారణ ఎందుకు జరపడం లేదు? బియ్యం అక్రమాలపై గతంలో కొన్నిచోట్ల ఫిర్యాదులు వస్తే విచారణ జరిపితే నిజమేనని తేలినా ఎందుకు చర్యలు తీసుకోలేదు… భవిష్యత్తులో ఇలాంటి జరగబోవని కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకున్నవే తప్ప ఎందుకు అక్రమాలను ఆపలేకపోతున్నవ్?

ప్రజలకు నీ కుప్పిగంతులన్నీ తెలిసిపోయనయ్… నీపై తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్. ఇగ నీ దుకాణం బందైనట్లే… ఏదో ఒక తికమక చేసి మభ్యపెట్టాలనుకుంటున్నవ్. నీ పప్పులుడకవ్. నిన్నెవరూ నమ్మరు..

4 రాష్ట్రల్లో బీజేపీ గెలవడంతోనే కేసీఆర్ మైండ్ దొబ్బింది. అందుకే నిన్నటిదాకా ముందస్తు ఎన్నికలని ఊదరగొట్టి… ఇప్పుడు ముందస్తు లేదంటూ పారిపోయిండు… పైగా సర్వే రిపోర్ట్ లో 95 సీట్లు వస్తాయని బీరాలు పలుకుతుండు… సర్వే రిపోర్ట్ లో 95 సీట్లు వచ్చింది బీజేపీకి… టీఆర్ఎస్ కు వచ్చేది 5 లేకుంటే… 9 సీట్లే..

కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై కేసీఆర్… నీకు వచ్చిన ఇబ్బందేమిటి? అంత అక్కసు ఎందుకు? నీకు నచ్చేది కేడీ నెంబర్ వన్… మోసగాళ్లకు మోసగాడు వంటివే కదా… 370 ఆర్టికల్ వల్ల కాశ్మీర్ లో జరిగిన నష్టమేందో తెలుసుకో… కాశ్మీర్ పండిట్లపై జరిగిన ఉచకోతపై వాస్తవ విషయాలను ప్రజలకు చూపిస్తే… జనం ఆలోచనలో పడితే… దీనిని పనికిమాలిన సినిమా అంటూ పనికిమాలిన బుద్దలు చూపిస్తవా?

బోధన్ లో 35 మందిపై 307 కింద కేసు పెట్టిండ్రు. సిరిసిల్లలో 25 మంది కార్యకర్తలపై 307 కేసు పెట్టి జైల్లో వెసిండ్రు. కేసీఆర్ కు….బీజేపీని ఎదుర్కొనే దమ్ము లేక పోలీసుల ద్వారా తప్పుడు కేసులు పెట్టి అడ్డుకునే కుట్ర చేస్తున్నరు. మాకు కేసులను ఎట్లా ఎదుర్కోవాలో తెలుసు.. ఉద్యమాలు తెలుసు… త్యాగాలు తెలుసు…. నీలాంటి పిరికిపందను ఎట్లా తరిమి కొట్టాలో కూడా మాకు తెలుసు…

మోదీ పాలన యూపీఏ పాలన కంటే అధ్వాన్నమంటావా…. యూపీఏలో నువ్వు (కేసీఆర్) మంత్రి వి కదా.. నీపై వచ్చిన సహారా, ఈఎస్ఐ స్కాంలు తెల్వదా? నీ లెక్క పాలన చేయడం మోదీగారికి చేతగాదు.. యూపీఏ పాలనకు, మోదీ పాలనకు లింకు పెట్టడమంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు..
మోదీ అద్బుత పాలనను చూసి విదేశాలే కీర్తిస్తున్నయ్.. పక్కనున్న పాకిస్తాన్ ఫ్రధాని సైతం మోదీ విదేశాంగ విధానం భేష్.. ఆయన పాలన చూసి నేర్చుకోవాలని పొగుడుతున్న సంగతి తెల్వదా? ఆ బుద్ధి కూడా నీకు లేదా?

ఉక్రెయిన్ లో భారత విద్యార్థులను యుద్దం ఆపించి తీసుకొచ్చిన ఘనత నరేంద్రమోదీదే… ఉక్రెయిన్ విద్యార్థులు చావుబతుకుల మధ్య కొట్లాడుతుంటే… ఏ ఒక్కనాడు నోరు విప్పని సీఎం కేసీఆర్… ఇయాళ మేమే కాపాడామంటూ చెప్పుకోవడం సిగ్గు చేటు.. ఏ ఒక్క కుటుంబాన్ని కలవకుండా.. ఓదార్చకుండా రాజకీయం చేయడమే పనిగా పెట్టుకున్న మానవ మ్రుగం కేసీఆర్… ఉక్రెయిన్ విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని కేంద్రమే భరోసా ఇస్తే… భయపడి ఢిల్లీ నుండి హైదరాబాద్ కు ఫ్లైట్ బుక్ చేసిన నాయకుడు కేసీఆర్..

విలేకరులు అడిగిన ప్రశ్నలకు…..
వడ్ల విషయంలో కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఎత్తేస్తానన్నారో…. వడ్లు కొనబోమని ఎందుకు చెప్పిండో కేసీఆర్ ప్రజలకు ముందు సమాధానం చెప్పాలి? బియ్యం కొనబోమని కేంద్రం చెప్పలేదు కదా…. కేంద్ర మంత్రి నిన్న కూడా రారైస్ కొంటామని స్పష్టం చేశారు కదా…
వడ్లు కొనాలని ఇప్పుడు చెప్పడమేంటి? ఇన్నాళ్లు ఎందుకు అడగలేదు? కేంద్రంతో మీటింగ్ పెట్టినప్పుడు ఎందుకు ఆ విషయం చెప్పలేదు? ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతి పైసా చెల్లించేది కేంద్రమే… ఈ విషయంలో నువ్వు చేసేది బ్రోకరిజమే… నీకు చేతనైతే బ్రోకరిజం చెయ్… చేతగాకపోతే ఇంట్లో పండుకో.

• వరి వస్తే ఉరి అని సీఎం అంటే… మీరు వరి వేయండి.. కొని తీరుతామని ఆనాడే చెప్పింది నేనే… ఈనాడూ అదే చెబుతున్న. దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలోనే ఎందుకొస్తోంది? బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ రాసిచ్చిందెవరు?

• అరవింద్ మాట్లాడుతూ…. మనసుంటే మార్గం ఉంటుంది. కానీ ఈ సీఎంకు మనసు లేదు. లొల్లి అంతా బ్రోకెన్ రైస్ గురించే కదా… దీంతో బ్రాన్ ఆయిల్ తయారైతది. వ్యాపారులకు రూ.300 చొప్పున మిగుల్తుతుంది. దీన్ని కట్ చేసి ఆ సొమ్ము రైతులకు అందిస్తే సమస్య పరిష్కారమైతది. కానీ సీఎంకు ఆ మనసు లేదు..కోవిడ్ టైంలో 82 మంది యువకులకు వాడుకుని వదిలేసిండు. 8 ఏండ్ల నుండి ఉద్యోగాలియ్యకుండా ఇప్పుడు మళ్లీ డ్రామాలు చేస్తుండు. ఈయన (కేసీఆర్) ఉద్యోగాల నోటిఫికేషన్ వేసి,… భర్తీ చేసే సరికి ఆయన ఉద్యోగమే ఊడిపోతది… ఇది తెలిసి ఉద్యోగాల భర్తీ పేరుతో మళ్లా డ్రామా చేస్తుండు…

LEAVE A RESPONSE