– రాష్ట్ర సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలతో జరిగిన చర్చల సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్: ఆర్టీసీ కార్మిక సోదరుడు శంకర్ గౌడ్ మరణించడం చాలా బాధాకరం. వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా సరే, ప్రాణం అనేది అత్యంత విలువైనది. శంకర్ గౌడ్ మరణంతో ఆ కుటుంబం మొత్తం తలకిందులైంది. ఇలాంటి విషాదకర సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తరపున మేము, కార్మిక సంఘాల నేతలుగా మీరు సమిష్టిగా కార్మికులకు పిలుపునిద్దాం.
సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప, ప్రాణాలు తీసుకోవడం సరైన నిర్ణయం కాదు. సమస్య ఎంత క్లిష్టమైనదైనా సరే.. కూర్చుని మాట్లాడుకుంటే ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది.
ఇది మన ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వం. తెలంగాణలో ఎవరినీ శత్రువులుగా చూసే స్వభావం మా ప్రభుత్వానికి లేదు. ఆర్టీసీ అనేది మన రాష్ట్రంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. ఇతర రాష్ట్రాల్లో సంస్థల పరిస్థితి వేరుగా ఉన్నా, మన సంస్థను మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లపాటు ఆర్టీసీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. పాలనాపరంగా సంస్థ చిన్నాభిన్నమైంది. ఆనాడు పరిస్థితులను తట్టుకోలేక కార్మికులు సమ్మె చేసినప్పుడు, అప్పటి పాలకులు ఎంత కఠినంగా ప్రవర్తించారో మీరందరూ చూశారు. గత పాలకుల మాదిరిగా మేము వ్యవహరించబోమని స్పష్టం చేస్తున్నాను.
బడ్జెట్ సమావేశాలు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా బిల్లు మరియు ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేను, ఇతర మంత్రులు బిజీగా ఉన్న సమయంలో.. అకస్మాత్తుగా సమ్మె నిర్ణయం తీసుకోవడం వల్ల ఒక కార్మికుని కోల్పోవాల్సి వచ్చింది. ఇది అత్యంత బాధాకరం, ఆ కుటుంబానికి ఇది తీరని లోటు.
ఆర్టీసీ మనందరి సంస్థ. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ముఖ్యంగా పేదలు, మహిళలకు రవాణా పరంగా ఉన్న ఏకైక మార్గం ఆర్టీసీ. వారందరినీ దృష్టిలో పెట్టుకుని, సంస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చి నిలబెట్టుకోవాల్సిన సామాజిక బాధ్యత మనపై ఉంది.
ఆర్టీసీకి సంబంధించిన పాలనాపరమైన, విధానపరమైన నిర్ణయాలపై ఖచ్చితంగా చర్చిద్దాం. కార్మికుల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించుకుందాం.