ఎస్సీ వర్గీకరణ అమలు పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉంది

-రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ 
-వినోద్ కుమార్ తో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ భేటీ

ఎస్సీ వర్గీకరణ అమలు జరగాలన్న విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉందని, ఎస్సీ వర్గీకరణ జరగాలని రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేసి కొన్నేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న ఒక కేసులో మంద కృష్ణ మాదిగ ఇంప్లీడ్ అయిన సందర్భంగా కేంద్రంతోపాటు పలు రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేయగా, తెలంగాణ రాష్ట్రానికి నోటీసు అందిన నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ బుధవారం మంత్రుల నివాస ప్రాంగణంలో వినోద్ కుమార్ తో సమావేశమయ్యారు.

ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన వైఖరిని ప్రభుత్వ పరంగా, అసెంబ్లీ చట్టసభ వేదికగా స్పష్టంగా తెలిపారని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ జరగాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అని ఆయన తెలిపారు.

పోలీసు పరీక్షలలో కటాఫ్ మార్కులు తగ్గించాలి
పోలీసు ఎస్.ఐ, కానిస్టేబుల్ పరీక్షలలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులు తగ్గించాలని కోరుతూ ఎమ్మార్పీఎఫ్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో పలువురు అభ్యర్థులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ బుధవారం మంత్రుల నివాసంలో వినతి పత్రాన్ని అందజేశారు.

ప్రస్తుతం 60 మార్కులకు ఉన్న కటాఫ్ ను మరింత తగ్గించాలని, ఇతర వర్గాలకు కన్నా కటాఫ్ తక్కువగా ఉండేలా చూడాలని వారు వినోద్ కుమార్ ను కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తానని వినోద్ కుమార్ వారికి తెలిపారు.

Leave a Reply