– అసెంబ్లీ లో ఇక కొత్త రూల్
అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొత్త రూల్ వచ్చేసింది. స్పీకర్ పోడియం వద్ద ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనలను కట్టడి చేసేందుకు స్పీకర్ తమ్మినేని సీతారం సరికొత్త రూల్ను అమల్లోకి తెచ్చారు. ఇకపై పోడియం వద్దకు దూసుకువస్తే ఆటో మేటిక్గా సస్పెండ్ అయ్యే రూలింగ్ను తీసుకువస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. పోడియం ముందు తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు లైన్ను ఏర్పాటు చేశారు. ఎవరైనా సభ్యులు ఎరుపు లైన్ను దాటితే ఆటోమేటిక్గా సస్పెండ్ అయ్యేలా రూలింగ్ తీసుకొచ్చారు స్పీకర్. అంతే కాకుండా సస్పెండ్ అయిన సభ్యుడిని పంపడానికి ఇకపై సభ అనుమతి అవసరం లేకుండా ఈ రూలింగ్కు స్పీకర్ తమ్మినేని ఆమోదముద్ర వేశారు. కాగా ఈ మధ్య అసెంబ్లీలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జంగారెడ్డిగూడెం ఘటనకు సంబంధించి అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.