– ప్రభుత్వం నామినేట్ చేసిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను రిజెక్ట్ చేసిన గవర్నర్ తమిళ సై తీరుపై శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రెడ్డి తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్: “గవర్నర్ తమిళ సై రాజ్ భవన్ ను రాజకీయ అడ్డాగా మార్చుకుని రాజకీయాలు చేస్తున్నది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్,కుర్రా సత్యనారాయణ పేర్లను రాష్ట్ర క్యాబినేట్ ఆమోదం తెలిపి పంపితే వారికి రాజకీయా నేపథ్యం ఉందని రిజెక్ట్ చేయడం అత్యంత దుర్మార్గం.
అత్యంత వెనుక బడిన కులాలకు(ఎంబిసి)చెందిన సామాజిక కార్యకర్త దాసోజు శ్రవణ్, షెడ్యుల్ తెగకు (ఎస్టీ) చెందిన సామాజిక కార్యకర్త కుర్రా సత్యనారాయణ లను రిజెక్ట్ చేయడం యావత్ తెలంగాణ ఎంబీసి కులాలను,ఎస్టీ(ఎరుకల) సమాజాన్ని అగౌర పర్చినట్టే.
రాజకీయ నేపథ్యం ఉందని తెలంగాణ ఉద్యమకారులను అవమాన పరిచిన గవర్నర్ తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూ డైరెక్ట్ గా తెలంగాణ గవర్నర్ గా నియమించబడలేదా..?. తమిళ సై కి నైతిక విలువలు ఉంటే ఆమె వెంటనే పదవికి రాజీనామా చేయాలి.
సర్కారియ కమిషన్ చెప్పినట్టు రాజకీయాలకు సంబంధం లేని వారిని గవర్నర్లు గా నియమించాలని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ పలు మార్లు వ్యాఖ్యలు చేశారు. సర్కారియ కమిషన్ సూచనలు తుంగలో తొక్కి ఒక రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిని గవర్నర్ గా నియమించారు. ఇది పూర్తిగా సర్కారియా కమిషన్ సూచనలకు విరుద్ధం. రాజకీయాల నుండి నేరుగా గవర్నర్ అయిన తమిలి సై కి గవర్నర్ గా కొనసాగే నైతిక అర్హత లేదు. ఆమె నిర్ణయం అప్రజాస్వామికం. గవర్నర్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నా.”