రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే…మూల్యం చెల్లించకతప్పదు

– చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులను దోషులుగా నిలబెట్టి తీరుతాం!
– ప్రజలు రాబోయే రోజుల్లో మిమ్మల్ని కుక్కల్ని కొట్టినట్లు కొడతారు
– అనంతపురం ఘటనపై ముఖ్యమంత్రి, సాక్షి గుమాస్తా సమాధానం చెప్పాలి
– తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు
అధికారపక్షం స్థానిక సంస్థల ఎన్నికలను ఏ విధంగా ప్రహసనంగా మార్చిందో ప్రజలంతా గమనించాలి. ఎక్కడికక్కడ దౌర్జన్యాలు, ప్రలోభాలు, పోలీసులు బెదిరింపులు, సెటిల్ మెంట్లు ఇష్టానుసారంగా చేశారు. ఈ సారి అధికారపక్షానికి ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా ఒక పటిష్టమైన విధానంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభుత్వం ముందు అభ్యర్ధులను పోలీసులతో బెదిరించారు. నామినేషన్ వేయడానికి వస్తే దారి కాచి ఎక్కడికక్కడ బెదిరింపులు దిగి భయబ్రాంతులకు గురిచేసి రిటర్నింగ్ ఆఫీసర్ ముందే కాగితాలు చించేశారు. ఏదో ఒక వంకచూపి నామినేషన్లను స్క్రూటినీలో రిజెక్ట్ చేయడం, అదీ సాధ్యంకాకపోతే ఆ తర్వాత విత్ డ్రాలో బెదిరించి రాజకీయ లబ్ది పొందారు. అదీకూడా సాధ్యం కానిచోట కౌంటింగ్ సమయంలో బాక్సులు తారుమారు చేశారు.
గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి మేమంతా పకడ్బందీగా ఉన్నాం, నామినేషన్లు వేసే సమయంలో ప్రెస్ వాళ్లకు కూడాచెప్పాం. మేము ఇచ్చిన డాక్యుమెంట్లన్నింటిని కలెక్టర్ కు, ఆన్ లైన్ రిటర్నింగ్ ఆఫీసర్, స్టేట్ ఎలక్షన్ కమీషన్ తో పాటు కొంత మంది హైకోర్టు కూడా పంపాం. అయినా అధికారపక్షం నాయకులు బరితెగించారు. ఇన్ని జాగ్రత్తలు మేము ఎప్పుడూ తీసుకోలేదు. గతంలో చదువుకోని వారు నామినేషన్లు వేసే సమయంలో తప్పులుంటే సరిచేసేవారు. అది రిటర్నింగ్ అధికారి పని, ప్రజాస్వామ్య స్పూర్తి. పోటీ చేయాలనుకున్న అభ్యర్ధికి సహకరించాల్సిన అవసరం రిటర్నింగ్ అధికారికి ఉంది.
అయితే ఇప్పుడు పరిస్థితులు వేరేలా ఉన్నాయి. కుప్పంలో ఎప్పుడూ నామినేషన్లనుంచి ఎన్నికలవరకు అన్నీ పగడ్బందీగా చేస్తాం. కుప్పం అంటే నీతి నిజాయితీ గల నియోజకర్గం. గొడవలంటే తెలియని ప్రజలు. నేను ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏడుసార్లు గెలిపించారు. అటువంటి తన నియోజకవర్గంలో నేడు అధికారపక్షం నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రౌడీయిజాన్ని పెంచి పోషిస్తున్నారు.
కుప్పంలోని 14వ వార్డులో దళితుడైన వెంకటేశ్, మరో అభ్యర్థి ప్రకాష్, అతని భార్య తిరుమగల్ నామినేషన్ వేశారు. 05.11.2021న వెంకటేశ్ పై దాడి చేశారు. బుల్లెట్ పైన వచ్చి ఆయన దగ్గర ఉండే కాగితాలు చించేసి వెళ్లిపోయారు. తరువాత రోజు 06.11.2021న మళ్లీ నామినేషన్ వేయిస్తే అన్ని కరెక్ట్ గా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి చెబితే బయటకు వచ్చారు. రాత్రి 9 గంటలకు లిస్ట్ ఆఫ్ వాలిడ్ నామినేషన్లలో వెంకటేష్ పేరు తీసేశారు. ఏదైనా ఉంటే అప్పుడే చేయాలి. కాని వీళ్లు ఉద్దేశ్యపూర్వకంగా అతని పేరును తొలగించారు.
ప్రకాష్, తిరుమగల్ లు నామినేషన్లు వేశారు, 08.11.2021న భీఫాం ఇచ్చిన తరువాత ఫోర్జరీ సంతకాలతో విత్ డ్రా చేసుకున్నారని చెప్పి ఏకగ్రీవం చేసుకున్నారు. 07.11.2021న మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి వీరిద్దరినీ కిడ్నాప్ చేశారని చెప్పారు. వారు మాత్రం మమ్మల్ని ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని వీడియో విడుదల చేశారు. విత్ డ్రా కోసం తాము సంతకం పెట్టలేదని స్పష్టంగా చెప్పారు.
రిటర్నింగ్ ఆఫీసర్ కు ఇచ్చిన సర్టిఫికేట్లన్నీ ఎస్ఇసి, హైకోర్టుకు కూడా పంపించాం. 3గంటలకు నామినేషన్లు విత్ డ్రా సమయం అయిపోయింది. లిస్టు ఎనౌన్స్ చేయకుండా నెల్లూరులో ఏకగ్రీవమైన వాటికి డిక్లరేషన్ ఇచ్చారు.ఎన్నిగట్స్ ఉండాలి ఎన్నికల అధికారులకు? నెల్లూరు, కుప్పం, దర్శి, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల తదితర మున్సిపాలిటీల్లో తప్పుడు డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలు చేసుకొని డిక్లేర్ చేశారు.
ఈ పరిస్థితుల్లో మేం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా, లేదా? నిన్న రాత్రి మా మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి ని ఈడ్చుకెళ్లి చొక్కా చించేశారు. మావారు చేసిన నేరం న్యాయం, ధర్మాన్ని గౌరవించమని చెప్పడమే. తప్పుచేసి మళ్లీ మావారిపై కేసులు పెడతారా, పైశాచిక ఆనందం పొందుతారా? డిఎస్పీ ఏం మాట్లాడుతున్నారో చూడండి.
వేరేజిల్లాల వారు ఇక్కడనుంచి పోవాలని కోరుతున్నాం, ఇక్కడే ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎవరిపై చర్యలు తీసుకుంటారు, మామీద తీసుకుంటారా? సిగ్గులేకుండా మేం కొట్టామని చెబుతారా?
19మంది నాయకులు, మరికొంతమంది దాడిచేశారని చెప్పారు, విధులకు ఆటంకం కలిగించారని, వారినుంచి ప్రాణాపాయం ఉన్నందున కార్యాలయంతోపాటు నాకు రక్షణ కల్పించాలని కోరుతున్నానని మున్సిపల్ కమిషనర్ సెలవిస్తున్నారు. మీ ఇష్టప్రకారం కేసులు, తప్పుడు కేసులు పెడితే సరిపోతుందని భ్రమ పడుతున్నారు. ఇదే డిఎస్పీ పరిధిలో నన్ను ఆహ్వానించిన కార్యకర్త ఇంటిని మంత్రి పెద్దిరెడ్డి కాంపౌండ్ వాల్ ను కొట్టించేశారు, మీరు ఏం చేస్తున్నారు? మీరు పోలీసులే కదా, కనబడలేదా?
గత ఎన్నికల్లో కుప్పం మున్సిపల్ పరిధిలో నన్ను 10వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు, ఇప్పుడు 20వేలతో గెలిపిస్తారు, అది ప్రజలకు నాపై ఉన్న విశ్వాసం. జరిగిన దౌర్జన్యకాండకు ఎస్పీ, డిఎస్పీ సమాధానం చెప్పండి.
చట్టాలను ఉల్లంఘించిన వారిని సాక్ష్యాధారాలతో కోర్టులో నిలబెడతాం, మళ్లీ రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే…అధికారులంతా గుర్తుపెట్టుకోండి…చట్టాన్ని ఉల్లంఘించిన వారెవరినైనా దోషులుగా నిలబడాల్సిందేనని హెచ్చరిస్తున్నా. నెల్లూరులో మా అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి 8వార్డులు ఏకగ్రీవం చేసుకున్నారు, దీనికి ఏం సమాధానం చెబుతారు? మావద్ద బి.ఫారం తీసుకున్న వారికి అప్పటికప్పుడు వైసిపిపై ప్రేమ పుట్టిందా?
గెలిచే ధైర్యం ఉంటే పోటీచేసి గెలవండి, దౌర్జన్యాలు, ప్రలోభాలు, ఫోర్జరీ సంతకాలతో గెలుపుకాదు, పులివెందుల పంచాయితీ జరగదు, జరగనీయం. దర్శిలో విత్ డ్రా అయ్యాక 2.45కి బి.ఫారం ఇచ్చారు, రాత్రి అతని ఫోర్జరీ సంతకం పెట్టి విత్ డ్రా చేసుకున్నారు, సిగ్గనిపించడం లేదా? ప్రజలు తిరగబడితే మిమ్మల్ని కుక్కలమాదిరి వెంటపడి కొడతారు, గుర్తుంచుకోండి.
గురజాలలో కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా 4వ వార్డు అభ్యర్థి షేక్ జుబేదాను నామినేషన్ వేయనీయలేదు. అధికారులకు ఎన్నికలు నిర్వహించడం చేతనవుతుందా, లేదా? జంగమహేశ్వరపురంలో నామినేషన్ వేసే అవకాశం ఇవ్వలేదు, దాచేపల్లి 10వవార్డులో ఏకగ్రీవం చేశారు. ప్రజలు తిరబడే పరిస్థితి వచ్చింది. మీ ఆటలు ఇకపై సాగవు.
ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి, ఏంచేయగలిగారు మీరు? హైకోర్టు ఆదేశాలను ఎందుకు పాటించలేకపోయారు, పాటించలేకపోతే రాజీనామా చేయండి, అందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని తగలబెడదామనుకుంటున్నారా? ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు, విద్యార్థుల విషయమే చూడండి…అనంతపురంలో ఏం జరిగిందో!
ముఖ్యమంత్రి, సాక్షి గుమాస్తాను అడుగుతున్నా…. అనంతపురంలో ఏం జరిగింది, వారు ఏం అడుగుతున్నారు, ఎయిడెడ్ స్కూలును కొనసాగించమని అడిగారు. ఆ కళాశాల స్థలంపై కన్నేసి బలవంతంగా స్వాధీనం చేసుకోవాలని చూశారు, దశాబ్దాల క్రితం చాలామంది దాతలు ముందుకువచ్చి స్థలం ఇచ్చి ఎయిడెడ్ కొనసాగించాలని ఇచ్చారు. పురాతనమైన నెల్లూరు విఆర్ కాలేజి, గుంటూరు ఎసి కాలేజిలు ఏ కాలం నాటివి. గుంటూరు ఎసి కాలేజిలో ఎన్టీఆర్ చదువుకున్నారు… విజయవాడనుంచి రైలులో వెళ్లి చదువుకున్నారు, అటువంటి చరిత్ర ఉన్న కాలేజిని భూమిపై కన్నేసి దురుద్దేశంతో స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. ఎయిడెడ్ యాజమాన్యాలు కోర్టుకు వెళ్లి పోరాడుతున్నారు, కోర్టులో వాటిని తీసుకోబోమని చెప్పి ఆ స్కూళ్ల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఫీజులు కట్ చేశారు, అమ్మఒడి, నాడు-నేడు ఏమయ్యాయి?
నాడు- నేడు పేరుతో 3-4వేల కోట్లు తగలబెట్టారు, చివరికి ఏం చేశారు, విద్యావ్యవస్థను నాశనం చేశారు, ఉపాథి అవకాశాలు లేకుండా చేశారు. గత పాతికేళ్లలో ఎప్పడూ పిల్లలు రోడ్డుపైకి వచ్చిన పరిస్థితి లేదు, మీ దుర్మార్గం వల్ల ఈరోజు పిల్లలు రోడ్డుపైకి వచ్చారు. పేద విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవద్దు…ఎయిడెడ్ విద్యాసంస్థల గ్రాంటును, స్టాఫ్ ను యథావిధిగా కొనసాగించండి. ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని బేషరతుగా విత్ డ్రా చేయండి, విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేయడం అమానుషం, అమానవీయం, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఎన్ సిఆర్ బి నివేదిక చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఏంత ఘోరంగా ఉందో అర్థమవుతోంది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత రెండున్నరేళ్లలో లిక్కర్, డ్రగ్స్ కారణంగా ప్రతిఏటా 27శాతం మరణాలు పెరిగాయి, ఇప్పుడు సమాధానం చెప్పండి డీజిపి గారూ? వాస్తవాలు దాచిపెడితే దాగవు, తప్పుడు విధానాలు చేయాలంటే మీ వల్లకాదు, మిమ్మల్ని ప్రజాకోర్టులో దోషులుగా నిలబెడతాం.
ఎన్నికల్లో మేం పోటీలో లేకపోతే మీరు రిగ్గింగ్ చేసుకుంటారా? కుప్పంలో మావారు ఉండకూడదని ఎవరు చెప్పారు? ఎలాంటి వత్తిడి, రౌడీయిజం లేని ఎన్నికలు జరపండి. మా 14వ వార్డు అభ్యర్థి వెంకటేష్ ను కొడితే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? తెలుగుదేశం ఆఫీసుపై దాడిచేసిన వారిపై ఎందుకు చర్యతీసుకోలేదు, మేం వచ్చాక బాధ్యులపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదికాదు, రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి తగులబెడుతున్నారు. అప్పులకు రాష్ట్రమే అత్యధిక వడ్డీ చెల్లిస్తోంది. పెట్రోలు, డీజిల్ ధరలు ఎపి కంటే తమ వద్ద తక్కువగా ఉన్నాయని బోర్డులు పెడుతున్నారు.
రాష్ట్రం ఎందుకు అప్పులపాలైంది, దీనికి ఏం సమాధానం చెబుతారు. ప్రభుత్వ ఆస్తులు, కలెక్టరేట్ లు తాకట్టుపెడతారా? సిగ్గనిపించడం లేదా? మీ అసమర్థత, చేతగాని తనం వల్లే ఈ దుస్థితి వచ్చింది. చెత్తపై పన్నేసిన చెత్త ప్రభుత్వం, తుగ్లక్ ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తోంది. చైతన్యవంతులైన రాష్ట్రప్రజలు ఈ అరాచకపాలనకు త్వరలోనే చరమగీతం పాడతారు.
నామినేషన్ విత్ డ్రా చేసుకున్నట్లు వార్తల్లో చూసి ఆశ్చర్యపోయాం
కుప్పం నియోజకవర్గ 14వ వార్డు అభ్యర్ధి తిరుమగల్ :
మేం కుప్పం 14వ వార్డుకు పోటీ చేశాం. నామినేషన్ వేసిన రోజున సొంత పనిమీద బయటికి వచ్చాము. విత్ డ్రా చేసుకోమని ఒత్తిడి తెస్తారనే ఉద్దేశంతో కూడా బయటికి రావడం జరిగింది. ప్రత్యర్థులకు భయపడి కుటుంబమంతా బయట ఉంటున్నాము. మాకు టీడీపీ సీటు ఇచ్చింది. మాలాంటి తక్కువ కులం వారికి టీడీపీ సీటు ఇవ్వడం గర్వంగా ఉంది. కాని ప్రత్యర్ధులు మామీద కక్ష కట్టారు. మాకు పోటీ చేసే అర్హత లేదా? మాలాంటి తక్కువ కులం వారు పోటీ చేయకూడదా? ప్రత్యర్థులు ఎందుకు మాపై ఇలా ప్రవర్తిస్తున్నారు? మా కుటుంబ సభ్యుల్ని బెదిరించారు. మా ఇంటిని, అంగడిని ధ్వంసం చేస్తామంటున్నారు. మీ ఆయనను చంపేస్తామని బెదిరిస్తున్నారు. మీ పిల్లలు దిక్కులేనివారవుతారని అంటున్నారు. మమ్మల్ని హింసిస్తూ, బెదిరిస్తూ ఉన్నారు. మేం ఏం తప్పు చేశామని మమ్మల్ని బెదిరిస్తున్నారు? మాకు ఎలాంటి మద్దతు, బలం లేదు. మాలాంటి సాధారణ ప్రజానీకంపైనా ప్రత్యర్థులు బలం చూపేది? అన్ని వార్డులు వారే సొంతం చేసుకోవాలన్నదే వారి ఉద్దేశం. మాకు జనం మద్దతు కావాలి. మాకు న్యాయం చేయండని రోడ్డెక్కడానికి కూడా మేం సిద్ధం. మాకు ధనబలం, కండబలం లేదు. మాపై ప్రత్యర్థులు తప్పుడు కేసులు పెట్టారు. మాకు న్యాయం చేయండని చంద్రబాబు నాయుడు గారిని ఆశ్రయించాము. మా వదినని, వారి పిల్లల్ని టీడీపీవారే కిడ్నాప్ చేశారని తప్పుడు కేసులు పెట్టారు. మా పార్టీవారు మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేస్తారని నేనడుగుతున్నాను. మా వారిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని మేమే స్వయంగా చెబుతున్నాం. మా పని ముగించుకొని నిన్న కుప్పం వచ్చాం. ఓట్లు అడగడానికి ప్రజల వద్దకు వెళ్దామనుకున్నాం. వార్తలు చూసి ఆశ్చర్యపోయాం, మేం విత్ డ్రా చేసుకున్నట్లు చెబుతున్నారు. ప్రపోజ్ చేసినవారు ఎవరూ సంతకాలు పెట్టకపోయినా, మా నామినేషన్ ను వాపసు తీసుకోకపోయినా విత్ డ్రా చేసుకున్నట్లు ఎలా చెబుతారు? మా నామినేషన్ ను వాపసు తీసుకోలేదు. మా లాంటివారిని రాజకీయాల్లోకి రాకూడదనుకుంటే ఎలా? మాకు ప్రత్యర్థుల నుండి న్యాయం చేయాలని చంద్రబాబునాయుడు సార్ వద్దకు వచ్చాము. చంద్రబాబునాయుడుగారు మాకు మద్దతిచ్చి మాకు న్యాయం వచ్చేలా చేస్తారనే ఉద్దేశంతోనే కుప్పం నుంచి మంగళగిరిలోని పార్టీ ఆఫీసుకు రావడం జరిగింది. కోర్టులో కేసు వేశాము. మేము పోటీ చేస్తామనే నమ్మకం ఉంది. చంద్రబాబునాయుడు సార్ ద్వారా మాకు న్యాయం లభిస్తుందనే నమ్మకముంది.

Leave a Reply