* తెలంగాణ ఏర్సాటును అడ్డుకునేందుకు ఎన్నో కుట్రలు
* నేటి సీఎంతో కలిసి బీఆర్ఎస్ సర్కార్ ను కూల్చేందుకు పన్నాగం
* అభివృద్ది చేయడం చేతగాక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు
* తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్
హైదరాబాద్: తెలంగాణ మీద ఎప్పుడు టీడీపీ నేతలు విషం కక్కుతున్నారని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో కట్టుబట్టలతో గెంటేశారని ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఏపీ, తెలంగాణ రెండు కళ్లని చెప్పిన చంద్రబాబు, ఎప్పుడు తెలంగాణ కన్నును పొడవాలనే చూస్తున్నారని విమర్శించారు.
యావత్ తెలంగాణ సమాజం రోడ్డు మీదకు వచ్చి ప్రత్యేక రాష్ట్రం కోసం కోట్లాడితే టీడీపీ అధినేత తెలంగాణకు వ్యతిరేకంగా పావులు కదిపారని గుర్తుచేశారు. అసలు చంద్రబాబు కుటుంబానికి, టీడీపీ నేతలకు తెలంగాణ అంటేనే ఇష్టం ఉండదన్నారు. పదేళ్లలో కేసీఆర్ వందేళ్ల అభివృద్ది చేస్తే ఓర్వలేక ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఎప్పుడు సమయం దొరికిన టీడీపీ నేతలు తెలంగాణ పట్ల వారి కున్నా అసూయను బయటపెడుతున్నారని వివరించారు.
2014లో తెలంగాణలో కొత్తగా ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు నాటి టీడీపీ ఎమ్మెల్యే, నేటి సీఎంతో కలిసి చంద్రబాబు కుట్రలు చేశారని వివరించారు. 1953నాటికి తమిళనాడు నుంచి ఏపీ రాష్ట్రం ఏర్పడే నాటికే తెలంగాణ ప్ర\త్యేక రాష్ట్రంగా ఉందని గుర్తుచేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రం అప్పటికే అభివృద్దిలో, ఆర్ధికంగా మొదటి వరుసలో ఉండేదన్నారు. నాటి సీమాంధ్ర నాయకులు ఎలాగైనా తెలంగాణను ఏపీలో కలపాలని కుట్రలు చేశారని గుర్తు చేశారు.
పోరాటం తరువాత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సిద్దిస్తే దానిపై సైతం ఇంకా కుట్రలు చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ ను నిర్మించింది చంద్రబాబు అని చెప్పుకునే టీడీపీ నేతలు, ఎందుకు అమరామతి ఇప్పటి వరకు నిర్మించుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పబ్లిసిటీ మీద ఉన్న దృష్టి పాలన మీద ఉంటే ఐదేళ్ల క్రితమే అమరావతి పూర్తయ్యేదని తెలిపారు.
తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టుల మీద వరుసగా కేంద్రానికి టీడీపీ ప్రభుత్వం ఫిర్యాదులు చేస్తున్నారని మండిపడ్డారు. అటు కేంద్రం అండ, ఇటు రేవంత్ రెడ్డిని చూసుకుని కృష్ణా నదిలో నీటి దోపిడికి పాల్పడుతున్నారని విమర్శించారు. కృష్ణా జలాల్లో ఏపీకి తాత్కాలికంగా 512 టీఎంసీలు కేటాయిస్తే 655 టీఎంసీల నీటిని తరలించుకుని తీసుకుని పోయారని దుయ్యబట్టారు.