Suryaa.co.in

Editorial

తెలంగాణ కమల దళపతిగా ఈటల?

-నేడు ప్రకటించే అవకాశం?
-ఈటలతో అసోం సీఎం శర్మ భేటీ
-అంతకుముందు అమిత్‌షాతో భేటీ
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ బీజేపీ దళపతిగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నియామకం దాదాపు ఖరారయింది. ఆమేరకు పార్టీ నాయకత్వం ఆయన నియామకాన్ని సోమవారం ఖరారు చేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఢిల్లీలోనే ఉన్న ఈటలతో అసోం సీఎం హేమంత్ బిశ్వాస్ శర్మ పార్టీ దూతగా చర్చలు జరిపారు. అంతకుముందు.. అమిత్‌షాతో కూడా ఈటల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల్లో పార్టీ ప్రదర్శించిన ప్రతిభను అభినందించారు. కొత్త బాధ్యతలతో పార్టీని క్షేత్రస్ధాయికి తీసుకువెళ్లాలని వారిద్దరూ సూచించినట్లు తెలిసింది.

బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ ను నియమించాలని అధిష్టానం నిర్ణయించింది. సోమవారం అధికారికంగా ప్రకటన వెలువడనుంది. ఆదివారం ఉదయం ఈటల రాజేందర్ తో ఫోన్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. అధిష్టానం దూతగా అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాస శర్మ ఈటెల రాజేందర్ తో చర్చలు జరిపారు.

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి బాగా పుంజుకుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే ఊపును కొనసాగించాలని శర్మ సూచించారు. తెలంగాణలో అధికారం లోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని, ఇందుకోసం పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే బాధ్యత స్వీకరించాలని కోరినట్లు తెలిసింది. దీనికి ఈటెల రాజేందర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సోమవారం ఈటెల రాజేందర్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో చర్చించనున్నారు. ఆ తర్వాత అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

LEAVE A RESPONSE