Suryaa.co.in

Telangana

కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతారా?

– అయ్యా కొడుకుల అధికార దాహానికి పరాకాష్ట సభ
– పదేళ్లు పాలించిన టీఆర్ఎస్ విలన్ నెం.2 గా మిగిలింది
– బీఆర్ఎస్ రజతోత్సవ సభలో అసలు తెలంగాణ ఆత్మను ఎందుకు ఆవిష్కరించలేదు?
– తెలంగాణ అమరవీరులను ఎందుకు స్మరించుకోలేదు?
-బీఆర్ఎస్ సభ భబ్రాజమానం భజగోవిందం
– హరీష్ రావు పని అయిపోయినట్లుగానే కనపడింది
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు

హైదరాబాద్: ఎల్కతుర్తి లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజలు కేసీఆర్‌ను అధికారం నుండి దూరం చేసి, ఫాంహౌస్‌ కే పరిమితం చేసినా, ఆయన ఇంకా రాచరిక మనస్తత్వాన్ని వదిలిపెట్టలేకపోయారు. అదే అహంభావంతో మాట్లాడడం కొనసాగించారు.

కేసీఆర్ 11 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి, 11 పైసలు కూడా ఇవ్వలేదని సోయిలేకుండా, అవగాహనారాహిత్యంతో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రూ. 11 లక్షల కోట్ల నిధులు కేటాయించింది. కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఈ వివరాలను లెక్కలతో సహా ప్రచురించి, రాష్ట్ర ప్రభుత్వానికి, వివిధ అధికారులకు మరియు జర్నలిస్టులకు పంపించడం జరిగింది.

తెలంగాణకు 11 పైసలు కూడా ఇవ్వలేదని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కట్టుబడి ఉంటారా? కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించిన నిధులను సాక్ష్యంతో రుజువు చేస్తే, కేసీఆర్ తన పొరపాటును అంగీకరించి, ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతారా? కేసీఆర్ దీని గురించి సమాధానం చెప్పాలి. మహాలక్ష్మి పథకం గురించి ప్రస్తావిస్తూ, కేసీఆర్ ఆడపిల్లలను అవమానపరచి మాట్లాడారు.

ఆడపిల్లలు మహాలక్ష్మి స్వరూపాలు. తెలంగాణ యాసతో మాట్లాడటం మాత్రమే కాదు, మహిళలను గౌరవించాలని కేసీఆర్ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ ఒక మాట వాస్తవంగా చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ప్రస్తుతం తెలంగాణకు విలన్ నెం. 1 కాంగ్రెస్ పార్టీ అని. కానీ పదేళ్లు పాలించిన టీఆర్ఎస్ విలన్ నెం.2 గా మిగిలింది. తెలంగాణకు విలన్ నెం. 1 కాంగ్రెస్, నెం. 2 బీఆర్ఎస్ అని ప్రజలు చెబుతున్నారు.

కేసీఆర్ కగార్ ఆపరేషన్ గురించి మాట్లాడుతూ.. నక్సలైట్లను చర్చలకు పిలవాలని చెప్పుతున్నారు. అయితే, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నక్సలిజాన్ని సామాజిక సమస్యగా ఎందుకు గుర్తించలేదు? కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నక్సలైట్ల పక్షాన మాట్లాడి, వారి జెండాలను భుజానికెత్తుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది. కానీ బిజెపికి దేశంలో శాంతిభద్రతలే ముఖ్యమైనవి. ఎటువంటి హింసనైనా వ్యతిరేకించి, దానిని అడ్డుకుంటాం.

కేసీఆర్ రజతోత్సవ సభ ఉద్దేశం… టీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల ప్రస్థానమా? లేదా బీఆర్ఎస్ ప్రస్థానమా? బీఆర్ఎస్ రజతోత్సవ సభలో అసలు తెలంగాణ ఆత్మను ఎందుకు ఆవిష్కరించలేదు? తెలంగాణ అమరవీరులను ఎందుకు స్మరించుకోలేదు? కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొ. జయశంకర్ గార్లను కనీసం స్మరించుకోలేదు ఎందుకు? తెలంగాణ ఉద్యమ చరిత్రను, అమరవీరుల త్యాగాల గురించి ఏమాత్రం చెప్పలేదు.

బీఆర్ఎస్ రజతోత్సవ సభ మాత్రం ఫక్తు రాజకీయ సభగా మారింది. ఇది తెలంగాణ ప్రజలను అవమానించడం తప్ప మరొకటి కాదు. నిన్నటి బీఆర్ఎస్ సభలో ఎస్సీ, ఎస్టీ నాయకులెవ్వరూ మాట్లాడలేదు. కేవలం కేసీఆర్ విమర్శలు చేసేందుకే, పరనింద మోపడానికే తప్ప ప్రజలకు ఏం ఒరగబెట్టింది లేదు. ఇది కేసీఆర్ భాషలో చెప్పాలంటే… ‘భబ్రాజమానం భజగోవిందం’.

తెలంగాణ రాష్ట్రాన్ని శాస్త్రీయంగా విభజన చేయలేదని మేం మాట్లాడినప్పటికీ, మేమెప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా నరేంద్ర మోదీ లేదా బిజెపి ఎప్పుడూ మాట్లాడలేదు. కేసీఆర్ కేవలం కంటగింపుగా మాట్లాడుతున్నారు. బిజెపి ప్రభుత్వం మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. ఎక్కడా ఒక్క రక్తపుబొట్టు కూడా రాలకుండా, రక్తపాతం లేకుండా రాష్ట్రాలను ఏర్పాటు చేసింది.

అన్ని రాష్ట్రాలకు సమానంగా, ఒక ప్రాతిపదికగా బడ్జెట్ ను పెంచి ఇస్తున్నది తప్పితే, ఏ రాష్ట్రానికి తక్కువ బడ్జెట్ కేటాయించలేదు. బహిరంగ సభ ప్రచారం ఫ్లెక్సీల్లో తండ్రీకొడుకుల ఆర్భాటం తప్ప, హరీష్ రావు పని అయిపోయినట్లుగానే కనపడింది. గత ఏడాది కాలంగా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఏనాడు ప్రజాసమస్యలపై మాట్లాడలేదు. కేవలం ఫాంహస్ కే పరిమితమైయ్యాడు. ఈరోజు ‘ఉద్యమిస్తాన’ని చెప్తుండటం విడ్డూరంగా ఉంది.

కేసీఆర్ చెబుతున్న మాటలు ప్రజలను అవమానపరిచే విధంగానే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా కేసీఆర్ కనీసం ఆ పార్టీ ఆఫీసు లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేయలేదు. 25 ఏండ్ల రజతోత్సవ సభ కాదు. అయ్యా కొడుకుల అధికార దాహానికి పరాకాష్ట సభ. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేవలం డప్పుల మోత, ఆర్భాటం తప్పితే, అమరవీరుల ఆత్మను ఎక్కడా ఆవిష్కరించలేదు.

బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం రూ. 200 కోట్లు ఖర్చుపెట్టింది. కాని ప్రజలకు ఇచ్చిన సందేశం ఏమీలేదు. శుష్కవాగ్ధానాలు మాత్రమే. పార్లమెంటు ఎన్నికల ముందు.. ప్రతి జిల్లా లేదా పార్లమెంటు నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ భారీ బహిరంగ పెట్టి ఆర్భాటం చేశారు. కాని, రెండు సీట్లు మినహాయించి అన్ని సీట్లలో డిపాజిట్లు గల్లంతయ్యాయి. అన్ని సీట్లలో బీఆర్ఎస్ ఓడిపోయింది.

బీఆర్ఎస్ రజతోత్సవ సభ కూడా అదే కోవలో జరిగింది. దీంతో తెలంగాణ ప్రజలకు, సమాజానికి ఒరిగిందేమీ లేదు. పదేళ్ల పాలనలో తెలంగాణను మొత్తం లూఠీ చేసి, అప్పుల ఊబిలోకి నెట్టి.. గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం నమ్మదు.

LEAVE A RESPONSE