అయ్యన్న కబ్జాలకు మద్దతా?

– ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన అయ్యన్నకు బీసీ కార్డా..!
– అయ్యన్న కబ్జాలను డైవర్ట్ చేసేందుకే టీడీపీ రాద్ధాంతం
– బీసీలకు బాబు ఏం చేశాడు..?
– నర్సీపట్నం పిల్లి అయ్యన్నపాత్రుడు
– మీడియాలో హైలెట్ కావాలని, రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనే టీడీపీ డ్రామాలు
– నర్సీపట్నం ఎమ్మెల్యే పి. ఉమా శంకర్ గణేష్

ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
కబ్జాలకు బీసీ కార్డా..
బీసీలకు అన్యాయం జరిగిపోయిందంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఛలో నర్సీపట్నంకు పిలుపునివ్వడం సిగ్గుచేటు. అసలు అచ్చెన్నాయుడుకు సిగ్గుందా? నర్సీపట్నంలో జరిగిన సంఘటన ఏంటి? అయ్యన్నపాత్రుడు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తే.. దానికి టీడీపీ బీసీల కార్డును వాడుకోవడం ఏంటి? పంట కాలువ గట్టును రెండు సెంట్ల మేర ఆక్రమించుకున్నారనే అభియోగంపై అయ్యన్న పాత్రుడు ఇంటి వెనుక ఉన్న ప్రహరీని కూల్చడం జరిగింది. దాన్ని ఆసరాగా తీసుకుని బీసీ కార్డు ఉపయోగించి రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరిగిపోతుందంటూ.. చంద్రబాబు మొదలుకొని టీడీపీ నేతలంతా పాడిందే పాటరా అన్నట్టు మాట్లాడటం సరికాదు.

బీసీలకు అన్యాయం జరిగింది టీడీపీలోనే..
టీడీపీ మహానాడు వేదికపై ఉన్న బ్యానర్ లోగానీ, వారి మీడియాలో గానీ ఒకవైపు చంద్రబాబు, మరోవైపు లోకేష్ బొమ్మలు వేసుకున్నారే తప్పితే… ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఒక బీసీ అచ్చెన్నాయుడు బొమ్మ మాత్రం వేయలేదు. అంటే బీసీల పట్ల టీడీపీకి ఏపాటి గౌరవం ఉన్నదో అర్థమవుతుంది. అచ్చెన్నాయుడు కేవలం బీసీ నాయకుడనే ఆయనను పక్కన పెట్టారు. అలాంటి విలువలేని పార్టీలో ఉంటూ ఇవాళ బీసీలకు ఏదో అన్యాయం జరిగిపోతోందంటూ మాట్లాడటం సిగ్గుచేటు. నర్సీపట్నానికి ఎవరు వచ్చినా, ఇక్కడకు వచ్చి ఊడపొడిచేది ఏమీలేదు. ఎంతసేపటికీ మీడియాలో హైలెట్ కావడం కోసం టీడీపీ చేసే డ్రామా పాలిటిక్స్ ను ఎవరూ నమ్మరు.

నర్సీపట్నం పిల్లి అయ్యన్న
నారా లోకేష్‌ వ్యాఖ్యలు వింటుంటే నవ్వొస్తోంది. పులివెందుల పులికి.. నర్సీపట్నం పిల్లికి పోలికేంటి?. నక్కకూ నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఏదోవిధంగా ఒక అలజడి సృష్టించాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. ఆఖరికి కబ్జాలు చేసి, దొంగల్లా దొరికిపోయి కూడా ఛలో నర్సీపట్నం అంటూ పిలుపు ఇస్తున్నారు. మీ రాజకీయ లబ్ది కోసం సంబంధం లేని విషయంలో బీసీ కార్డు వాడుతున్నారు. అయ్యన్న కబ్జాలపై ప్రజల దృష్టిని మరల్చేందుకు టీడీపీ ఈ ఎత్తుగడ వేసింది. బీసీలపై దాడి అంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ఏవిధంగా ముందుకు వెళ్లాలనే దానిపై ప్రభుత్వంలోని అధికారులు నిర్ణయం తీసుకుంటారు.
ఇదే అయ్యన్నపాత్రుడు ఇరిగేషన్‌ శాఖ కాలువ పక్కన, ప్రజలు అమ్మవారు ఆలయం కడుతుంటే ఆ స్థలాన్ని ఆక్రమించారంటూ కోర్టుకు వెళ్లి గుడి కట్టకుండా స్టే తీసుకువచ్చాడు. అదే కోర్టు ఇవాళ అయ్యన్న ఇంటి నిర్మాణం విషయంలో స్టే ఇచ్చిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది.

సీఎం జగన్ కు ఉన్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి రోజు రోజుకూ ప్రజాదరణ పెరిగిపోతుండటంతో చూసి ఓర్వలేక, ఏదోవిధంగా బురద చల్లాలనే దురుద్దేశాలతో టీడీపీ కుట్రలు చేస్తుంది. మరో రెండేళ్లు ఆగితే.. టీడీపీ అధికారంలోకి రాదు సరి కదా.. ఆపార్టీ మరింత పాతాళంలోకి వెళ్ళడం ఖాయం. ఎవరెన్ని కుట్రలు చేసినా మరో 30ఏళ్లు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉంటారు.
ఈరోజు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి వెళుతుంటే.. టీడీపీకి ఓటు వేసినా.. తమకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకాలు ఇస్తున్నారంటూ స్వయంగా ఆపార్టీ వాళ్లే బహిరంగంగా చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీని ఏవిధంగా ప్రజలు బాదుడే బాదుడు అని బాదారో… రాబోయే 2024 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి అంతకంటే ఎక్కువగా బాదుడే బాదుడు ఉంటుంది.

బీసీలకు బాబు ఏం చేశాడు..?
బీసీలకు అన్యాయం జరిగిపోయిందని టీడీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారే? అసలు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఏం చేశారు? వాళ్లకే కాదు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కూడా చంద్రబాబు చేసిందేమీ లేదు. ఇవాళ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అన్నిరంగాల్లో పెద్ద పీట వేసి, సముచిత గౌరవం దక్కుతుంది.

Leave a Reply