బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాలుపంచుకునే నిమిత్తం తెలంగాణ రాజధాని హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆ పార్టీ యువ నేత, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ టీఆర్ఎస్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్తో పాటు సీఎం కేసీఆర్ను టార్గెట్ చేస్తూ ఠాకూర్ విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోతుందని చెప్పిన ఠాకూర్… తెలంగాణలో వంద శాతం బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఎన్నికల తర్వాత కేసీఆర్ విహార యాత్ర చేసుకోవచ్చంటూ ఆయన సెటైర్లు సంధించారు.
జాతీయ పార్టీగా టీఆర్ఎస్ను మలిచే దిశగా కేసీఆర్ చేస్తున్న యత్నాలపైనా ఠాకూర్ సెటైర్లు సంధించారు. కేసీఆర్ నేషనల్ పార్టీ చంద్రబాబు జాతీయ పార్టీలా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ లాంటి నాయకులకు ప్రధాని మోదీ గురించి ఏం తెలుసని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఖజానాలోని నిధులు ఎమయ్యాయని ప్రశ్నించిన ఠాకూర్… ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేశారని ఆరోపించారు. రూ.2.50 లక్షల కోట్ల అప్పులు తెచ్చిన టీఆర్ఎస్ సర్కారు… ఆ నిధులను కేసీఆర్ కుటుంబానికి తరలించిందని ఠాకూర్ ఆరోపించారు.