Suryaa.co.in

International National

అంతర్జాతీయ విమాన ప్రయాణీకులకు వ్యాక్సిన్ సర్టిఫికెట్ చాలు..

– నో టెస్టింగ్, నో క్వారంటైన్!
– అంతర్జాతీయ ప్రయాణికులపై కోవిడ్ ఆంక్షల సడలింపు

కోవిడ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులపై విధించిన ఆంక్షలను కేంద్రం సడలించింది. ప్రయాణికులు ఇకపై ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

అంతర్జాతీయ ప్రయాణికులపై ప్రస్తుతం ఉన్న ఆంక్షలను కేంద్రం సడలించింది. భారత్కు వచ్చిన ప్రయాణికుల్లో నెగెటివ్ వచ్చిన వారు ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలన్న నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.ఆ స్థానంలో ప్రయాణికులు 14 రోజుల పాటు స్వీయ పర్యవేక్షణ చేసుకుంటే సరిపోతుందని స్పష్టం చేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు ఈనెల 14న అమలులోకి రానున్నట్లు వెల్లడించింది.

అప్పుడు టెస్టింగ్ అవసరం లేదు
ప్రయాణానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ రిపోర్ట్తో పాటు వ్యాక్సిన్ సర్టిఫికెట్ను కూడా అప్లోడ్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఒకవేళ పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకుంటే.. ఆ సర్టిఫికెట్ పెడితే సరిపోతుందని, ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ అవసరం లేదని స్పష్టం చేసింది.82 దేశాల ప్రయాణికులకు ఈ అవకాశం కల్పించింది.

ఈ జాబితాలో అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, హాంగ్కాంగ్, సింగపూర్, ఇరాన్ దేశాలు ఉన్నాయి. భారత్కు వచ్చిన 8వ రోజు కొవిడ్ టెస్ట్ చేయించుకుని ఎయిర్ సువిధా పోర్టల్లో సమర్పించాలన్న నిబంధనను కూడా ఎత్తివేస్తున్నట్లు పేర్కొంది.

ఎయిర్పోర్టు వద్ద స్క్రీనింగ్లో ప్రయాణికులకు లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే.. వారిని ఐసోలేషన్కు తరలించి చికిత్స అందిస్తామని కేంద్రం తెలిపింది.భారీగా ఒమిక్రాన్ కేసులు నమోదైన కారణంగా ఇదివరకు ముప్పు ప్రాంతాలుగా పలు దేశాలను గుర్తించింది. తాజాగా ఈ జాబితాలో నుంచి వివిధ దేశాలను తొలగించింది.

LEAVE A RESPONSE