Suryaa.co.in

Telangana

మోదీని గద్దె దించే వరకు కష్టపడాలి

– మన సక్సెస్ స్టోరీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
– రాహుల్ గాంధీని ప్రధానిని చేసేవరకు విశ్రమించవద్దు
– టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్: మీనాక్షి నటరాజన్ గారి లాంటి వారిని ఇంచార్జ్ గా నియమించినందుకు రాహుల్‌గాంధీకి కృతజ్ఞతలు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇది నిరంతర ప్రక్రియ. ఒకరోజుతో ముగిసేది కాదు. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలి.

పార్టీ జెండా మోసినవారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. పార్టీ కోసం కష్టపడినవారికే నామినేటెడ్ పదవులు ఇచ్చాం.సుదీర్ఘకాలంగా పని చేసినవారికి కొంతమందికి అవకాశాలు రాలేదు. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉంది. రాబోయే రోజుల్లో వారికి తప్పకుండా ప్రాధాన్యత కల్పిస్తాం. వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాల్సి ఉంది.

మార్చి 10 లోగా అన్ని జిల్లాల్లో నియామకాలు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇంచార్జ్ మంత్రులకు ఆదేశాలు ఇస్తున్నాం. పదవులు వచ్చిన వారూ పార్టీ కోసం కష్టపడాలి. పనితీరు సరిగా లేని వారికి రిన్యూవల్ ఉండదు. మంచిని మైక్ లో చెప్పండి. చెడును చెవిలో చెప్పాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.

రూ.4200 కోట్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల విద్యుత్ అందిస్తున్నాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. రైతు భరోసాను రూ.12 వేలకు పెంచడంతోపాటు భూమిలేని పేదల కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తున్నాం. మన సక్సెస్ స్టోరీని మనమే చెప్పుకోవాలి. మన ప్రభుత్వం కులగణన చేసి దేశానికే ఆదర్శంగా నిలిచింది.

పెద్ద పెద్ద విమర్శకులు కూడా మన ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. మన సక్సెస్ స్టోరీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. దేశంలోనే అత్యధిక విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్న రాష్ట్రం తెలంగాణ. ఇది మన చిత్తశుద్ధికి నిదర్శనం. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకుంటున్నాం. దేశానికి మేం ఒక కొత్త మోడల్ ను క్రియేట్ చేస్తున్నాం.

రాహుల్ గాంధీని ప్రధానిని చేసే వరకు మనమంతా కసితో పనిచేయాలి. మోదీని గద్దె దించే వరకు మనం కష్టపడాలి. రాహుల్ గాంధీ పట్టుదలతోనే కులగణన, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేయగలిగాం. రాష్ట్రంలో అధికారంలో ఉంటేనే ఇన్ని చేయగలిగితే…దేశంలో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొస్తే ఇంకెన్ని చేయొచ్చు.

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ గ్రామగ్రామాన తిరుగుతున్నారు. అలాంటి రాహుల్ గాంధీని ప్రధానిని చేసేవరకు విశ్రమించొద్దు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే ఎజెండాగా పని చేయాలి.

LEAVE A RESPONSE