ధర్మకార్యంలో యువతను భాగస్వామ్యం చేస్తాం

Spread the love

– విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్ రెడ్డి

ధర్మం రక్షణ కోసం తమ సంస్థ విరామ మెరుగక పనిచేస్తోందని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి అన్నారు. దాదాపు 58 సంవత్సరాలుగా విశ్వహిందూ పరిషత్ అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. శుక్రవారం పరిషత్ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సురేందర్ రెడ్డి తో పాటు సంస్థ రాష్ట్ర కార్యదర్శి పండరినాథ్, బనారస్ స్వామి మాట్లాడారు. హిందూ ధర్మం కోసం పనిచేసేటందుకోసం తెలంగాణ రాష్ట్రంలో లక్ష మంది యువతను బజరంగ్ దళ్ లో చేర్చుకుంటున్నామని వారు చెప్పారు.

ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో “హితచింతక్ అభియాన్” (సభ్యత్వ నమోదు కార్యక్రమం) నిర్వహిస్తున్నట్లు వారు వివరించారు. అందులో భాగంగానే నవంబర్ ఆరవ తేదీ నుంచి 20వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రం తో పాటు ప్రపంచవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో యువతను విశ్వహిందూ పరిషత్ వైపు ఆకర్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలోని 6000 గ్రామాలకు వెళ్లి సభ్యత్వ నమోదు చేయిస్తామన్నారు. ప్రత్యేకంగా 30 వేల మంది కార్యకర్తలు ఈ పనిలో ఉన్నారని.. మొత్తంగా 10 లక్షల మందిని విశ్వహిందూ పరిషత్ లో కొత్తగా సభ్యులుగా చేర్చుకుంటామని చెప్పారు.

సమాజంలోని స్వామీజీలు.. దేవాలయాలు.. పీఠాలు.. మఠాలు.. పేరుమోసిన ప్రముఖులు.. ఇతర వ్యక్తులు అందరినీ కలుపుతూ బడుగు బలహీన వర్గాలను హిందుత్వం వైపు ఆకర్షిస్తామన్నారు. కులాలకు అతీతంగా అగ్రవర్ణాలు, అనగారిన వర్గాలు తేడా లేకుండా ప్రతి ఒక్కరిని విశ్వహిందూ పరిషత్ సాధారణంగా ఆహ్వానిస్తుందన్నారు.

దళితులను హిందూ సమాజంలో గౌరవ భాగస్వాములను చేస్తామని, అంటరానితనం అనే వివక్షను తొలగించేందుకు పనిచేస్తామనీ నాయకులు పేర్కొన్నారు. అగ్రవర్ణాలు.. అణగారిన వర్గాలు అనే తేడా లేకుండా హిందువులందరినీ ఒక్కటి చేస్తామన్నారు. 1964 శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఆవిర్భవించిన విశ్వహిందూ పరిషత్ వచ్చే రెండు సంవత్సరాలలో షష్టిపూర్తి చేసుకుంటుందని.. అప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లెలో విశ్వహిందూ పరిషత్ కమిటీ వేస్తామన్నారు. బజరంగ్ దళ్.. దుర్గా వాహిని.. గోరక్ష .. మఠ మందిర్ తదితర విభాగాల ద్వారా సమస్త హైందవ లోకాన్ని ఏకం చేస్తామని విశ్వహిందూ పరిషత్ నాయకులు చెప్పారు. ధర్మకార్యంలో పాలుపంచుకునేందుకు ప్రతి హిందువు విశ్వహిందూ పరిషత్ లో చేరాలని ఈ సందర్భంగా వారు సూచించారు. ఏ హిందువుకు ఆపద వచ్చినా విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ముందుంటారని భరోసా ఇచ్చారు.

ధర్మం వీడి ఇతర మతంలోకి వెళ్లిన వారందరూ తిరిగి స్వధర్మం లోకి రావాలని ఆహ్వానించారు. లవ్ జిహాద్ ను అడ్డుకుంటామని.. ప్రతి మహిళ ధర్మం గురించి తెలుసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదుకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. సమావేశంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్ , రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు, దుర్గా వాహిని రాష్ట్ర కన్వీనర్ వాణి సక్కు భాయి, నాయకులు పుప్పాల వెంకటేశ్వరరావు, రజినీకాంత్, పశ్శంతి, సోమన్న, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply