Suryaa.co.in

Telangana

సింధూర్‌కు స్వాగతం.. ఆపరేషన్ కగార్‌కు మాత్రం వ్యతిరేకం

– ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడాన్ని స్వాగతిస్తున్నాం
– ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేయాలి
– మావోయిస్టులు కూడా మనుషులే కదా?
– ఎంతమందిని చంపితే మీ రక్త దాహం తీరుతుంది?
– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

హైదరాబాద్: ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ఉగ్రవాదానికి మతం లేదు,కులం లేదు, దేశం లేదు. పాకిస్తాన్ ఉగ్రవాదులే బెనజీర్ భుట్టోను హత్య చేశారు. పాకిస్తాన్ దేశం ఉగ్రవాదుల చేతుల్లోనే ఉంటుంది.

కచ్చితంగా చెడును నియంత్రించాల్సిందే, న్యాయాన్ని బతికించుకోవాలి. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయమిస్తుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. ఆపరేషన్ సిందూరు విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. సమస్యకు పరిష్కారం ఎలానో ప్రభుత్వం త్వరగా ఆలోచించాలి. ఈ సమస్య పరిష్కారం కోసం అన్ని పార్టీల సలహాలు తీసుకోవాలి. భారతదేశం సహనానికి మారుపేరు. శాశ్వతంగా ఉగ్రవాదం నుంచి విముక్తి జరగాలి.

ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేయాలి.మావోయిస్టులు చర్చలకు వస్తామంటే చర్చలకు ఒప్పుకునేది లేదని కేంద్ర మంత్రులు అంటున్నారు. మంత్రులు స్థాయి లేకుండా మాట్లాడుతున్నారు. మావోయిస్టులు తప్పు చేస్తే తప్పకుండా ఖండిస్తాం. వాళ్లు కూడా మనుషులే కదా? ఈరోజు కూడా కర్రేగుట్టలో 22 మందినీ ఎన్ కౌంటర్ చేశారు.ఎంతమందిని చంపితే మీ రక్త దాహం తీరుతుంది? ఈ ఘటనల వల్ల వాళ్లకు సంతోషంగా ఉంటుంది. ఆపరేషన్ కగార్ ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మీరు మంత్రులుగా శాశ్వతంగా ఉండరు.

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించాం. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆర్టీసీలో యూనియన్లను నడిపే హక్కును ప్రభుత్వం కల్పించాలి. గత ప్రభుత్వం లానే ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుంది.యూనియన్ నడిపే హక్కు బ్రిటిష్ కాలం నుంచే ఉంది. యూనియన్లను నడపకుండా యూనియన్ లను రద్దు చేసింది కేసీఆర్. యూనియన్ గుర్తింపు ఎన్నికలు పునరుద్ధరించాలని ప్రభుత్వానికి కోరాము. కొన్ని సమస్యలపై ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం..

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీని వేయడం జరిగింది. రేవంత్ రెడ్డి ఆవేదనతో ఆవేశంతోను, ఆందోళనతోను ఓ ప్రకటన చేశారు. సీఎం ఓర్పు, సహనంతో వ్యవహరించి పరిస్థితి చక్కదిద్దాలి. ఈ సమస్యకు కారణమైన వాళ్ళు ఎవరో ప్రజలకు అర్థమయ్యే విధంగా రేవంత్ రెడ్డి చెప్పాలి. మీరు అధికారంలోకి వచ్చే నాటికే అప్పులు కాకుండా 60నుంచి 70 వేల కోట్లు బకాయిలు ఉన్నారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం ఒకటో తారీకు ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేదు. మీరు అధికారంలో వచ్చే నాటికే మున్సిపల్ పంచాయతీ కార్మికులకు ఐదు నుంచి ఆరు నెలలు జీతాలు ఇవ్వలేదు గత ప్రభుత్వం. గత బిఆర్ఎస్ ప్రభుత్వము ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. ఆ విషయాలన్నిటినీ ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలి.

టిఆర్ఎస్ చేసిన తప్పులను దాచుకొని ఈ ప్రభుత్వం పై విమర్శలు చేస్తుంది. ఈ విమర్శల నుంచి ఎలా బయటపడాలో రేవంత్ రెడ్డి ఆలోచించాలి. రెండు ప్రభుత్వాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత బెటర్ గా ఉంది. ప్రస్తుతం ఉన్న సమస్యలన్నిటికీ కారణం గత బిఆర్ఎస్ ప్రభుత్వం..

ఆర్టీసీలో యూనియన్లను రద్దు చేసింది, ధర్నా చౌక్లు రద్దు చేసింది, టి ఏ లు డిఏలు ఇవ్వకుండా ఇబ్బంది చేసింది మీరు కాదా? పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది మీరు కాదా? గతంలో కాంగ్రెస్, టిడిపి, సిపిఐ ఎమ్మెల్యేలను చేర్చుకున్నది మీరు కాదా? టిఆర్ఎస్ పార్టీకి నాయకులకు మాట్లాడే హక్కు లేదు. ఫిరాయింపుల చట్టాన్ని పూర్తిగా మార్చాలి.

ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలకు మూల కారణం టిఆర్ఎస్సే. పార్టీ మారిన వాళ్ళ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నిటినీ అమలు చేయాలి.రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించింది సంతోషమే.

వాటిలో ముఖ్యంగా సన్న బియ్యం, రైతులకు బోనస్సు మంచిగా ఉన్నాయి. ప్రభుత్వం తీసుకునే ఏ స్కీం అయిన లోతుగా వెళ్లి విశ్లేషణ చేయాలి. విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను ఫీజు రీయింబర్స్ మెంట్ ని వెంటనే విడుదల చేయాలి.

LEAVE A RESPONSE