-డోన్ లో రూ.65కోట్లతో నిర్మితమవుతోన్న 100పడకల ఆస్పత్రి సహా పలు భవన నిర్మాణాల పనుల పరిశీలన
-డోన్ మున్సిపాలిటీ 16వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహించిన మంత్రి
-సీపీఐ కౌన్సిలర్ సుంకయ్యతో లబ్ధిదారులకు బుక్ లెట్ ఇప్పించిన మంత్రి
-ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
అమరావతి,ఏప్రిల్,06; ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పార్టీలకతీతంగా ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. సీఎం జగన్ తరచూ చెప్పే కులం చూడం..మతం చూడం..ప్రాంతం చూడం అన్న మాటలను ఆచరణలో చూపించారని మంత్రి స్పష్టం చేశారు. డోన్ మున్సిపాలిటీ 16 వార్డులో గురువారం ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా సీపీఐ కౌన్సిలర్ సుంకయ్యతో కలిసి మంత్రి బుగ్గన గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. ప్రభుత్వం నుంచి వార్డులోని కుటుంబాలకి అందుతున్న సంక్షేమాన్ని కౌన్సిలర్ ద్వారా చదివి వినిపించి బుక్ లెట్ ను పంపిణీ చేశారు. వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ సున్నావడ్డీ తదితర పథకాల ద్వారా వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఏర్పాటైన గత నాలుగేళ్ల కాలంలో సుమారు రూ.3 లక్షల లబ్ది పొందిన ఓ కుటుంబంతో మంత్రి బుగ్గన మాట్లాడారు.అనంతరం వార్డు మొత్తం కుటుంబాలను పలకరిస్తూ కలియతిరుగుతూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.
అంతకు ముందు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ డోన్ పట్టణంలో పర్యటించారు.డోన్ లోని శ్రీ బుగ్గన శేషారెడ్డి మున్సిపల్ ఇండోర్ స్టేడియం పక్కనే రూ.9 కోట్లతో వేగంగా పనులు జరుగుతున్న కూరగాయల మార్కెట్ కొత్త కాంప్లెక్స్ ను ఆయన పరిశీలించారు. రూ.2.80 కోట్లతో 60 అడుగుల రైల్వేస్టేషన్ రోడ్డు పనులను పర్యవేక్షించారు. అనంతరం రూ.4.40 కోట్లతో నిర్మిస్తున్న మినీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ,రూ.7.20 కోట్లతో అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దుతున్న కొత్త మున్సిపాలిటీ భవనం నిర్మాణ పనులను మంత్రి బుగ్గన పర్యవేక్షించారు.చివరిగా డోన్ లో రూ.40కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతోన్న 100 పడకల ఆస్పత్రి పనుల పురోగతిని పరిశీలించి వివరాలను అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. రూ.1.20 కోట్లతో నిర్మిస్తున్న సబ్ రిజిస్ట్రర్ కార్యాలయాన్ని కూడా మంత్రి బుగ్గన పరిశీలించారు. మొత్తం రూ.65 కోట్లతో డోన్ పట్టణంలో జరుగుతున్న కీలకమైన భనవ నిర్మాణాల పనులు వేగంగా పూర్తి చేసి తద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేస్తామని మంత్రి తెలిపారు.