– సామాజిక రంగాలను పట్టించుకోని మోడీ ప్రభుత్వం
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలు, మధ్య తరగతి ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని కేంద్ర బడ్జెట్ను పరిశీలిస్తే అర్థమవుతుంది. వాస్తవానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంతోపాటు ఇతర సామాజిక సంక్షేమ పథకాలైన ప్రధానమంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై), జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (ఎన్ఎస్ఏపీ), మధ్యాహ్న భోజన పథకం, ఐసీడీఎస్ (సమీకృత శిశు అభివృద్ధి సేవలు)కు 2019-20 బడ్జెట్ నుండే కేటాయింపులు తగ్గిపోయాయి. ఆరోగ్యం, విద్య వంటి సామాజిక రంగాలకు జరిపిన కేటాయింపులను చూస్తుంటే ఆ రెండు రంగాలకు ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని బోధపడుతుంది.
భారత్ను సంపన్న దేశంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో వికసిత్ భారత్ ఎజెండా కోసం కృషి చేస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ పేదలు, మధ్య తరగతి ప్రజల అభ్యున్నతికి దోహదపడే కీలక రంగాలకు ఈ బడ్జెట్లో కేటాయించిన నిధులు నిరాశాజనకంగా ఉన్నాయి. ఉదాహరణకు గ్రామీణ ప్రజలకు జీవనోపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో రూ.86 వేల కోట్లు కేటాయించారు.
2022-23 బడ్జెట్లో సవరించిన అంచనాలు కూడా ఇంతే మొత్తంలో ఉన్నాయి. గ్రామీణ సమాజం నుండి డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ ఈ పథకానికి కేటాయింపులు పెద్దగా పెంచలేదు. ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ (పీఎం పోషణ్)కు మాత్రం కేటాయింపులను స్వల్పంగా… రూ.10,000 కోట్ల నుంచి రూ.12,467 కోట్లకు పెంచారు.
జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం, ఇందిరాగాంధీ జాతీయ దివ్యాంగుల పెన్షన్ పథకం, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం సహా జాతీయ సామాజిక సహాయ కార్యక్రమానికి మొత్తం బడ్జెట్లో కేటాయించింది కేవలం 0.2 శాతం మాత్రమే. ఐదు సంవత్సరాల లోపు వయసున్న చిన్నారులు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, కౌమార దశలో ఉన్న బాలికల కోసం ఉద్దేశించిన సాక్షం అంగన్వాడీ, పోషణ్ 2.0 పథకానికి కూడా కేటాయింపులు స్వల్పంగానే పెరిగాయి.
2023-24లో దీనికి రూ.20,544 కోట్లు కేటాయిస్తే ప్రస్తుత బడ్జెట్లో రూ.21,200 కోట్లు కేటాయించారు. రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్)కి కేటాయింపులు పెంచలేదు. 2023-24లో రూ.60,000 కోట్లు కేటాయించగా ఇప్పుడు కూడా అంతే మొత్తాన్ని కేటాయించారు.