Suryaa.co.in

Telangana

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏవీ?

– ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతూ ఉపాధిని దెబ్బతీస్తున్న మోడీ
-ధరలు పెంచడంతో పోటీ పడుతున్నా ప్రధాని మోడీ సీఎం కేసీఆర్
– రైతుల శ్రమ తో రాజకీయం చేయడం మానుకోండి
– అమరావతి నాగపూర్ హైవే నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి
పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి వేస్తూ ఉన్న ఉపాధిని దెబ్బతీస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. వరుసగా ఆరు రోజులుగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి డీజిల్ ధరను సెంచరీ దాటించిన ఘనత మోడీకే దక్కింది అని ఎద్దేవా చేశారు. ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ చెప్పినట్లుగా రైతుల శ్రమతో రాజకీయాలు ఆడకుండా రైతులు పండించిన ప్రతి గింజలను పాలకులు కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

ప్రజాసమస్యల పరిష్కారం కొరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బుధవారం చింతకాని మండలం పొద్దుటూరు గ్రామం నుంచి బోనకల్లు మండలం తూటికుంట్ల మీదుగా చింతకాని మండలం రేపల్లెవాడ, పాతర్ల పాడు గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆ గ్రామాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి పాదయాత్రకు ఘన స్వాగతం పలికారు. భట్టి విక్రమార్క అడుగులో అడుగులు వేసి పాదయాత్రలో కదం తొక్కారు. మహిళలు మంగళ హారతులు పట్టుకొని వెల్కమ్ చెప్పారు.

దారిపొడవునా బంతిపూల వర్షం కురిపిస్తూ కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారికి అభివాదం చేస్తూ విక్రమార్క తన పాదయాత్రను ఆయా గ్రామాల్లో కొనసాగించారు. అనంతరం ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభలలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో 350 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను అచ్చే దిన్ తీసుకొస్తానని చెప్పిన ప్రధాని మోడీ ఇప్పుడు 1050 రూపాయలకు పెంచి ప్రజలకు సచ్చే దిన్ తీసుకొచ్చాడని నిప్పులు చెరిగారు. మోడీ సర్కార్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే… టిఆర్ఎస్ ప్రభుత్వం కరెంటు చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపిందని దుయ్యబట్టారు.

రోజు రోజుకు ధరలు పెంచి ప్రజల నడ్డి విరగొట్టడంలో మోడీ, కేసీఆర్ పోటీ పడుతున్నారని విమర్శించారు. అమరావతి- నాగపూర్ హైవే నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులను బెదిరించి అడ్డగోలుగా భూసేకరణ చేయాలని చూస్తే ప్రతిఘటన తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఇచ్చిన అన్ని ప్రోత్సాహకాలు, రాయితీలను బంద్ చేసిందని విమర్శించారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుబంధు తో పాటు రైతులకు వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ రుణాలు, సబ్సిడీపై విత్తనాలు ఎరువులు, డ్రిప్ ఇరిగేషన్, పాలీహౌస్ లు ఏర్పాటు చేసుకోవడానికి నిధులు ఇస్తామని వెల్లడించారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడంతో పాటు ఆత్మగౌరవంతో తలెత్తుకు జీవించేలా రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలను అరికట్టడానికి కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటాలను తీవ్రతరం చేయనున్నామని వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్నానని ఇది రాజకీయ ఎన్నికల యాత్ర కాదని స్పష్టం చేశారు.

ఇల్లందులో పాదయాత్ర చేయాలని సీఎల్పీ నేత భట్టిని ఆహ్వానించిన నాయకులు
తూటికుంట్లలో భట్టి పాదయాత్రకు ఇల్లందు నాయకుల సంఘీభావం
ఇల్లందు నియోజకవర్గంలో పీపుల్స్ మార్చ్(పాదయాత్ర) నిర్వహించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిసి కాంగ్రెస్ పార్టీ గార్ల మండల అధ్యక్షులు ధన్యాకుల రామారావు, మాజీ ఎంపీపీ మారుతి వెంకట్ లాల్, గార్ల ఎంపిటిసి-2 పసుపులేటి సుజాత రామారావులు విజ్ఞప్తి చేశారు.

ప్రజాసమస్యల పరిష్కారం కొరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో చేపట్టిన పీపుల్స్ మార్చ్ బుధవారం బోనకల్లు మండలం తూటికుంట్ల గ్రామానికి చేరుకున్న సమయంలో ఇల్లందు నియోజక వర్గ నాయకులు అక్కడికి చేరుకొని భట్టి పాదయాత్రకు స్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మధిర నియోజకవర్గంలో విశేషమైన జనాదరణ పొందుతున్న క్రమంలో తమ నియోజకవర్గంలో కూడా పాదయాత్ర నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎల్పీ నేతకు వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ఎద్దు రవి కుమార్, ఎన్ఎస్ యుఐ నాయకులు మాలోతు కిషోర్ కుమార్ తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE