Suryaa.co.in

Telangana

రేవంత్ రెడ్డికి పరిపాలించే నైతిక హక్కు ఎక్కడుంది?

– కళ్యాణలక్ష్మి చెక్కులు పెళ్లిపందిరిలో ఇస్తామని చెప్పిన కాంగ్రెస్
– పిల్లలు పుట్టాక కూడా చెక్కులు ఇవ్వని పరిస్థితి
– రెసిడెన్షియల్ స్కూళ్లకి కిరాయిలు చెల్లించని దౌర్భాగ్య స్థితి
– బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు రూ.10 నుంచి రూ.20 లక్షల మధ్య పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ వాటిని చెల్లించలేదు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాంట్రాక్టర్లు మంత్రులను పట్టుకుని 10 శాతం కమిషన్ ఇస్తున్న దయనీయ పరిస్థితి నెలకొంది. అయినా వారు తమ బిల్లులు పొందలేక గగ్గోలు పెడుతున్నారు.

పోలీస్ శాఖ, ఆర్టీసీ ఉద్యోగులు దాచుకున్న తమ డబ్బులు తీసుకోలేని స్థితిలో ఉన్నారు. రుణాలు పొందలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయులు రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నరు. రిటైర్డ్ ఉద్యోగులకు అందవలసిన పెన్షన్లు అందడం లేదు. ఇంత అసమర్థ పాలన సాగిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుదించేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక హక్కు ఎక్కడుంది?

వృద్ధాప్య, దివ్యాంగులకు కొత్త పెన్షన్ల విషయం దేవుడెరుగు… రాష్ట్రంలో పాత పెన్షన్లు రద్దు చేయడమే గానీ, కొత్త పెన్షన్లకు దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవడం లేదు. కళ్యాణలక్ష్మి చెక్కులు పెళ్లిపందిరిలో ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు పిల్లలు పుట్టాక కూడా చెక్కులు ఇవ్వని పరిస్థితి.

గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు వేసినా, నిజమైన అర్హులకు ఇండ్లు ఇవ్వకుండా, కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది సరికాదు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తారని హెచ్చరిస్తున్నాం. ఇండ్లు కట్టినా, రోడ్లు వేసినా, డ్రైనేజీలు నిర్మించినా, పెన్షన్లు ఇచ్చినా – ఇవన్నీ ప్రజల పన్నుల డబ్బులతోనే జరుగుతున్నవి. రాష్ట్ర ప్రభుత్వం తన వ్యక్తిగత జాగీరు లాగా చూపించకూడదు.

రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు తీవ్ర నష్టంతో కన్నీళ్లు పెడుతున్నరు. ఎండాకాలం పంట కావున.. తడిసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నేడు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ విచ్చేసి పలు రహదారులు, ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, మరికొన్ని ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.

రాష్ట్రంలో కేంద్రం నిధులతో నిర్మించనున్న అభివృద్ధి పనులకు భూమిపూజలు, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి – ఉదాహరణకు ఉప్పల్ ఫ్లైఓవర్, అంబర్‌పేట్ ఫ్లైఓవర్. కేంద్రం నిధులు కేటాయించిన అభివృద్ధి పనులు వేగంగా పూర్తవలసిన అవసరం ఉంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా పనులు పూర్తిచేయాలని సూచిస్తున్నాం.

నల్లగొండ రూట్‌లో కొన్నిచోట్ల ఫ్లైఓవర్లు లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. ఇందుకోసం రూ.260 కోట్లతో కొత్త పనులను కేంద్రం ప్రారంభించనుంది. బాలానగర్ నుండి నర్సాపూర్ వరకు, జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో ఫ్లైఓవర్ల కొరత వల్ల ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితమవుతోంది. అమృత్ నగరాల పేరిట కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతోంది. కొంపల్లి ప్రాంతంలో ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి కేంద్రానికి ప్రతిపాదన అందిస్తాం.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్‌లు తగ్గడంలో గడ్కరీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వమే ప్రధాన కారణం. జాతీయ రహదారులు, ఫ్లైఓవర్లకు వేల కోట్లు కేటాయించాయి. ఆరంఘార్ చౌరస్తా, ఉప్పల్ ఫ్లైఓవర్, విజయవాడ రూట్ హైవే అభివృద్ధి కేంద్రంతోనే సాధ్యమైంది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను మరింత తగ్గించేందుకు కేంద్రాన్ని మరిన్ని నిధులు కేటాయించాలని కోరుతాం. శామీర్‌పేట్ నుండి కరీంనగర్ వైపు హైవేను నేషనల్ హైవేగా మారుస్తే ప్రయోజనకరమవుతుంది. దీనిపై కేంద్రానికి నివేదిస్తం.

రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోంది. ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. 1935లో బ్రిటిష్ పాలనలో మొదటిసారిగా కులగణన జరిగింది. అప్పటి నుండి ఇప్పటిదాకా 90 సంవత్సరాలు గడిచాయి. నెహ్రూ, రాజీవ్ గాంధీ వంటి కాంగ్రెస్ ప్రధానులు రిజర్వేషన్ల వల్ల మెరిట్ తగ్గిపోతుందని, నైపుణ్యం పడిపోతుందని నిర్లక్ష్యం చేశారు. వారు ఎప్పుడూ అణగారిన వర్గాల అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు.

రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతున్నా, అదే రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ని ఓడించిన పార్టీ కాంగ్రెస్‌నే. బీసీ జనాభా రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్నా, కాంగ్రెస్ ఇటీవల చేసిన కులగణనలో వారి సంఖ్యను తక్కువగా చూపించి అన్యాయం చేసింది. దేశానికి ఓబీసీని ప్రధానమంత్రిగా అందించిన ఘనత బీజేపీకే చెందింది.

మోదీ కేబినెట్‌లో 27 మంది ఓబీసీ మంత్రులు, 12 మంది దళిత మంత్రులు, 8 మంది గిరిజన మంత్రులు, 5 మంది మైనారిటీ మంత్రులు ఉన్నారు. 60 శాతం పైగా బడుగు బలహీన వర్గాలకే అధికార బాధ్యతలు అప్పగించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో మోదీ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థులు, రైతులు, పేదల పట్ల ప్రయారిటీ లేదు. వారికి ముఖ్యమైనది కేవలం పేపర్లలో అడ్వర్టైజ్‌మెంట్‌లే.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ఆరోగ్యశ్రీ బకాయిలు, సఫాయి కార్మికుల జీతాలు, కాంట్రాక్టర్ల బిల్లులు – ఇవన్నీ చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. రెసిడెన్షియల్ స్కూళ్లను కిరాయికి తీసుకుని నడుపుతూ, వాటికీ కిరాయిలు చెల్లించని దౌర్భాగ్య స్థితి నెలకొంది.

LEAVE A RESPONSE