– వాళ్లతో మాటల్లేవ్…మాట్లాడుకోవడాల్లేవ్
– బాంబులు అమర్చి పోలీసులను తునాతునకలు చేసి నక్సల్స్ చంపుతుంటే రేవంత్ రెడ్డి, కేసీఆర్ సమర్ధిస్తారా?
– కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం
– తుపాకీ చేతపట్టి అమాయకులను చంపుతుంటే చర్చలేంది?
– నక్సల్స్ సానుభూతిపరులు హరగోపాల్, వరవరరావు సాధించిందేమిటి?
– దశాబ్దాలుగా అమాయకులను కాల్చి చంపిన సంగతి గుర్తు లేదా?
– తుపాకీ వీడి లొంగిపోవాల్సిందే…జనజీవన స్రవంతిలో కలవాల్సిందే
– పౌరహక్కుల సంఘం నేతలారా…నక్సల్స్ కు నచ్చజెప్పండి
– రాష్ట్ర ప్రభుత్వం చేసింది కులగణన కానేకాదు
– కేవలం సర్వే మాత్రమే జరిపింది
– బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసింది
– ప్రతి ఇంటికి కచ్చితంగా వెళ్లి నిర్వహించేది కులగణన
– జనగణన మాదిరిగానే మోదీ ప్రభుత్వం కులగణన చేస్తుంది
– బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతాం
– పెద్దపల్లిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
నక్సల్స్ పై నిషేధం విధించిన కాంగ్రెస్ పార్టీయే ఈరోజు నక్సల్స్ తో చర్చలు జరపాలని చెప్పడం ఆ పార్టీ రెండు కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. తుపాకీ చేతపట్టి అమాయకులను చంపుతుంటే సామాజిక కోణంతో చూడాలనడం బాధాకరమన్నారు. తుపాకీ పట్టి చంపేటోళ్లతో చర్చలేందని ప్రశ్నించారు.
దశాబ్దాలుగా నక్సల్స్ చేసిన హింసతో ఎంతో మంది చనిపోయారని, నెత్తురోడిన ఎన్నో ద్రుశ్యాలను చూసిన ప్రొఫెసర్ హరగోపాల్, వరవరరావు సాధించిందేమిటో చెప్పాలన్నారు. నక్సల్స్ తుపాకీ వీడి లొంగిపోవాల్సిందేనని, జనజీవన స్రవంతిలో కలవాల్సిందేనని ఉద్ఘాటించారు. ఈ విషయంలో హరగోపాల్, వరవరరావుసహా పౌరహక్కుల సంఘం నేతలే నక్సల్స్ కు నచ్చజెప్పాలని సూచించారు.
కాగజ్ నగర్ నుండి కరీంనగర్ వెళుతూ మార్గమధ్యలో రామగుండంలోని ఎన్టీపీసీ వద్ద కాసేపు ఆగారు. స్థానిక బీజేపీ నేతలను కలిశారు. అనంతరం అక్కడికి వచ్చిన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ ఏమన్నారంటే… కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి కోసం రూ.12 లక్షల కోట్లకుపైగా ఖర్చు చేసంది. ఒక్క నేషనల్ హైవేస్ అభివృద్ధి కోసమే 1 లక్షా 25 వేల 485 కోట్ల ఖర్చు చేసినం. ఇవిగాక రైల్వేల అభివృద్ధికి రూ.32 వేల కోట్లు ఖర్చు చేసినం. వడ్ల కొనుగోలు కోసమే లక్షనర్న కోట్ల రూపాయలదాకా ఖర్చు చేసినం. మేం ఇంత చేసినా కేంద్రం నయాపైసా ఇయ్యలేదని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది. కేంద్రం ఖర్చు చేసిన నిధులపై లెక్కా పత్రంతోసహా వివరిస్తాం. చర్చకు రావాలని కోరినా వాళ్లు రావడం లేదు.
6 గ్యారంటీలపై కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. వీటి గురించి ప్రస్తావిస్తుంటే ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తోంది. కులగణన పేరుతో డ్రామాలాడుతోంది. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయనేలేదు. చేసిందల్లా సర్వే మాత్రమే. సర్వే అంటే తూతూ మంత్రంగా వెళ్లి డేటా తీసుకోవడం. రాష్ట్రంలో 50 శాతం ఇండ్లకు కూడా వెళ్లలేదు. జనాభా లెక్కలకు సర్వేకు పొంతనే లేదు.
సమగ్ర కుటుంబ సర్వేకు, కుల సర్వేకు పొంతనేలేదు. కుల సర్వేతో బీసీలకు తీవ్ర అన్యాయం చేసింది. 52 శాతం జనాభా ఉంటే 46 శాతానికి కుదించింది. 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు కేటాయించి దారుణంగా మోసం చేసింది. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని మోదీ ప్రభుత్వం జనగణన మాదిరిగా ఇంటింటికీ వెళ్లి కులగణన చేస్తుంది. బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దబోతోంది. బీసీల వాస్తవ జనాభాను తేల్చబోతోంది.
మేం వాస్తవాలు చెబుతుంటే… ఆపరేషన్ కగార్ ను నిలిపివేసి చర్చలు జరపాలంటూ కొత్త నాటకం మొదలు పెట్టారు. అసలు నక్సల్స్ ను నిషేధించిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇయాళ నక్సల్స్ మెప్పు పొందడానికి కేసీఆర్, రేవంత్ రెడ్డి పోటీలు పడి పొగుడుతున్నారు. పదేళ్లు పాలించిన కేసీఆర్, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నక్సల్స్ పై నిషేధాన్ని ఎత్తివేసే దమ్ముందా? అయినా తుపాకీ చేతపట్టి అమాయకులను చంపుతున్న వాళ్లతో చర్చలేంది? వాళ్లతో మాటల్లేవ్…మాట్లాడుకోవడాల్లేవ్.
ప్రొఫెసర్ హరగోపాల్, వరవరరావును అడుగుతున్నా. ఎన్నో హత్యలను, చావులను చూశారు. ఎంతో మంది అమాయకులు, పోలీసులను కాల్చి చంపడాన్ని, నెత్తురోడిన దృశ్యాలు చూశారు. మరి ఇన్ని దశాబ్దలుగా మీరు సాధించిందేమిటి? శాంతి భద్రతల సమస్యను ముఖ్యమంత్రి సామాజిక కోణంతో చూస్తామని చెప్పడం కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం. అంతెందుకు? ఆనాడు టీడీపీలో రేవంత్ రెడ్డి ఉన్నప్పుడే నాటి సీఎం చంద్రబాబుపై నక్సల్స్ అలిపిరి వద్ద బాంబులు పేల్చి చంపాలని చూసింది నిజం కాదా?
అజాత శత్రువు శ్రీపాదరావును చంపింది నిజం కాదా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చిట్టెం నర్సిరెడ్డి, రాగ్యానాయక్ ను చంపింది నక్సల్స్ కాదా? జాతీయ జెండా ఎగరేసినందుకు సామా జగన్మోహన్ రెడ్డిని కాల్చి చంపిన నక్సల్స్ నల్ల జెండాలు ఎగరేసి దేశద్రోహం చేయలేదా?
మహాముత్తారంలో ఎస్ఐ భార్య శ్రీమంతం చేసుకునే సమయంలో బాంబులు పెట్టి నక్సల్స్ ఆ ఎస్ఐని చంపేశారు. అప్పుడే కానిస్టేబుల్ ను చంపేశారు. దూరదర్శన్ జర్నలిస్టును చంపేశారు. బీజేపీ నాయకులు సామ జగన్మోహన్ రెడ్డి, మధుసూదన్ గౌడ్, రామన్నగోపన్నలను చంపేశారు. అంతెందుకు మీ కాంగ్రెస్ నాయకులను ఎంతో మంది చంపేశారు. శ్రీపాదరావు వంటి అజాత శత్రువును కూడా నక్సల్స్ చంపేశారు.
బాంబులు అమర్చి పోలీసులను తునాతునకలు చేసి నక్సల్స్ చంపుతుంటే రేవంత్ రెడ్డి, కేసీఆర్ సమర్ధిస్తారా?… గిరిజనులను, అమాయక ప్రజలను ఇన్ ఫార్మర్ల పేరుతో కాల్చి చంపుతుంటే సమర్దిస్తారా? సమాధానం చెప్పాలి. మేం మాత్రం చర్చలు జరిపే ప్రసక్తే లేదు. తుపాకీ వీడాల్సిందే. పోలీసులకు లొంగిపోవాల్సిందే. వారి వైఖరి మారాల్సిందే. వాళ్లతో చర్చలు జరిపే సందర్భమే రాదు. ఈ విషయంలో నక్సల్స్ ను హరగోపాల్, వరవరరావుసహా పౌరహక్కుల సంఘం నాయకులే నచ్చజెప్పాలి.