– తెలంగాణలో గత పదేళ్లలో జాతీయ రహదారులు 5 వేల కి.మీ.కు పెరిగాయి
– 770 కి.మీ. మేర ఈ ఇండోర్-హైదరాబాద్ కారిడార్ నిర్మిస్తున్నాం
– సిర్పూర్ కాగజ్ నగర్ బహిరంగ సభలో నితిన్ గడ్కరీ
సిర్పూర్ కాగజ్ నగర్: పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతాలకు అనుగుణంగా దేశంలోని పేదలకు సేవలందిస్తున్నాం. నా నియోజకవర్గంలో చాలా వరకు రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుంటాను. ఇప్పుడు రైతు అంటే కేవలం అన్నదాత మాత్రమే కాదు.. విద్యుత్ దాత, ఇంధన దాతగా, పవన విద్యుత్ దాత.. బిట్యుమిన్, హైడ్రోజన్ దాతలుగా మారారు.
అలాంటి వారందరినీ పైకి తీసుకువచ్చేందుకు నా చేతనైన సాయం చేస్తుంటాను. విదర్భలో రైతుల ఆత్మహత్యలు తగ్గించేందుకు మేం అమృత్ సరోవర్ కింద చెరువులను నిర్మించాం, పంటలకు నీటిని అందించాం. అలా మీరు కూడా తెలంగాణలో నీటిని నిల్వ చేసుకుని, రైతులకు, భవిష్యత్తు తరాలకు నీటిని అందించాలని కోరుతున్నాను.
చెరువులు, కుంటలు, డ్యాంలలో ఉచితంగా పూడిక తీసి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకున్నాం. మహారాష్ట్రలోని వాసిం జిల్లా, గడ్చిరోలి జిల్లాలను దత్తత తీసుకున్నాను. ఆయా జిల్లాల్లో రైతులు, యువతకు అనేక రంగాల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి మెరుగుపరిచేందుకు మేం కృషి చేస్తున్నాం.
తెలంగాణలో కూడా జల సంరక్షణ విషయంలో కృషి చేసి, రైతులకు మేలు చేసేందుకు ముందుకు రావాలని కోరుతున్నాను. జల సంరక్షణలో ముందుడుగు వేస్తే రైతుల ఆత్మహత్యలు తగ్గి, గ్రామాలు సమృద్ధంగా, సంపన్నంగా తయారవుతాయి.
నేను ముంబైలో మంత్రిగా ఉన్న సమయంలో వర్లీ-బాంద్రా సీలింగ్ ప్రాజెక్టులో భాగస్వామ్యం అయ్యే అదృష్టం నాకు దక్కింది. అప్పుడు నా వయసు కేవలం 36 ఏళ్లు మాత్రమే. అదే సమయంలోనే అటల్ బిహారీ వాజపేయి నన్ను పిలిచి.. గ్రామాలను అనుసంధానం చేసేందుకు పథకం తీసుకురావాలనుకుంటున్నానని చెప్పారు. దీంతో 6 నెలల పాటు కష్టపడి నివేదిక అందించాను. 15 రోజుల్లోనే ఎర్రకోట వేదికగా మా నివేదిక ఆధారంగా ప్రధానమంత్రి గ్రామ సఢక్ యోజనను ప్రకటించారు.
దేశంలోని ఆరున్నర లక్షల గ్రామాలకు గాను 6.4 లక్షల గ్రామాల్లో అద్భుతమైన రోడ్లు నిర్మించేందుకు ఈ పథకం నాంది పలికిన విషయం తెలిసిందే. అమెరికా ధనిక దేశం కాబట్టి అమెరికా రోడ్డు బాగోలేవు.. అమెరికా రోడ్లు బాగున్నాయి కాబట్టే అమెరికా ధనిక దేశం అయిందని అమెరికా మాజీఅధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ అనేవారు.
అందుకే తెలంగాణలోని రోడ్లను మెరుగుపరిచి, ఇక్కడి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించి, వీరు సమృద్ధంగా తయారయ్యేందుకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళ్తోంది.
2014లో తెలంగాణలో 2511 కి.మీ. మేర జాతీయ రహదారులు ఉండేవి. గత పదేళ్లలో 5 వేల కి.మీ.కు పెరిగాయి. ఇప్పటివరకు 1.25లక్షల కోట్ల రూపాయలతో పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులు పూర్తి చేశాం. తెలంగాణలో రానున్న మూడు, నాలుగేళ్లలో ఏకంగా 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టనున్నాం. ఈ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ ముఖ చిత్రం మారిపోతుందని నాకు నమ్మకం ఉంది.
తెలంగాణ అభివృద్ధికి మేం కట్టబడి ఉన్నామని మరోసారి చెబుతున్నాను. 2014 కన్నా ముందు తెలంగాణలో మారు మూల ప్రాంతాల నుంచి హైదరాబాద్ చేరుకోవాలంటే కనీసం 12 గంటల సమయం పట్టేది. ఇప్పుడు ఏ మూల నుంచి హైదరాబాద్ రావాలన్నా కూడా 4, 5 గంటల్లోనే చేరుకునేలా రోడ్లు నిర్మించాం.
ములుగు, కొత్తగూడెం, ఆదిలాబాద్, గద్వాల జిల్లాల్లోని ఏ మారుమూల గ్రామం నుంచి అయినా హైదరాబాద్ వరకు రాకపోకలు ఇప్పుడు సులభతరం అయ్యాయి. తెలంగాణలోని జాతీయ రహదారులకు మరిన్ని మెరుగులు దిద్దేందుకు పలు ప్రాజెక్టులు ఇప్పటికే రూపొందించాం. వాటిలో కొన్ని పనులు పూర్తి కాగా, మరికొన్ని పనులు జరుగుతున్నాయి.
కొత్త గ్రీన్ ఎక్స్ప్రెస్ కారిడార్ తెలంగాణ మీదుగా వెళ్లనుంది. 770 కి.మీ. మేర ఈ ఇండోర్-హైదరాబాద్ కారిడార్ నిర్మిస్తున్నాం. తెలంగాణలో ఈ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మార్చి 2026 నాటికి ఈ కారిడార్ పనులు మొత్తం పూర్తికానున్నాయి. తెలంగాణలో కామారెడ్డి-మెదక్-సంగారెడ్డి జిల్లాల మీదుగా హైదరాబాద్ వరకు ఈ కారిడార్ నిర్మాణం జరుగుతోంది. ఈ నిర్మాణం కనుక పూర్తయితే ఇండోర్ నుంచి హైదరాబాద్ కు కేవలం 10 గంటల్లోనే చేరుకోవచ్చు.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనెక్టివిటీ ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎప్పుడూ అడుగుతుండే వారు. సూరత్ నుంచి నాసిక్-అహ్మద్ నగర్, సోలాపూర్ కర్నూల్, హైదరాబాద్, చెన్నై, కన్యాకుమారి వరకు సులువుగా చేరుకునేలా కారిడార్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాం. ఈ ప్రాజెక్టు పూర్తయితే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కనెక్టివిటీ కలలు నిజం అవుతాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా 1,100 కి.మీ. మేర కారిడార్ తెలంగాణ మీదుగా వెళ్తుంది.
సూర్యాపేట నుంచి దేవరపల్లి వరకు 221 కి.మీ. మేర రూ.8 వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మిస్తున్నాం. హైదరాబాద్-విశాఖపట్నం హైవేను తెలంగాణలో రూ.6,040 కోట్లతో 164 కి.మీ. మేర రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య ప్రయాణ దూరం దాదాపు 60 కి.మీ. మేర తగ్గనుంది. ఆరు గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకోవచ్చు.
565 కి.మీ. మేర 16 వేల కోట్ల వ్యయంతో నాగ్పూర్ నుంచి విజయవాడ కారిడార్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 30 శాతం పనులు పూర్తయ్యాయి. తెలంగాణలో 401 కి.మీ. మేర రూ.13,300 కోట్లతో ఆసిఫాబాద్-మంచిర్యాల-భూపాలపల్లి-హన్మకొండ-వరంగల్-ఖమ్మం మీదుగా ఈ కారిడార్ వెళ్లనుంది. ఈ కారిడార్ నిర్మాణం పూర్తయితే నాగ్పూర్ నుంచి విజయవాడ వరకు 175 కి.మీ. దూరం తగ్గుతుంది. దీంతో విజయవాడకు 6 గంటల్లోనే చేరుకోవచ్చు.
ఇలా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అనేక జాతీయ రహదారుల నిర్మాణ ప్రాజెక్టులతో తెలంగాణలో పర్యాటకం మరింత మెరుగుపడుతుందని ఆశిస్తున్నాను.