Suryaa.co.in

Andhra Pradesh

కొవ్వూరు అర్బన్ బ్యాంకు ఎన్నికలలో వైసీపీ దౌర్జన్యం

• జగన్ రెడ్డి అంబేద్కర్ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో తొక్కారు
• రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్రం పై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు
• మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడుతూ కొవ్వూరు అర్బన్ బ్యాంకు ఎన్నికలను రద్దు చేసిందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టిడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

కొవ్వూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో టీడీపీ ఏకగ్రీవం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక ఎన్నికలను రద్దు చేశారు. ఆ స్థానంలో దుర్మార్గంగా కమిటిని ఏర్పాటు చేశారు. ఎన్నికలని రద్దు చేయడాన్ని వ్యతిరేకించిన 11మంది అర్బన్ బ్యాంకు డైరెక్టర్ లను, టీడీపీ ద్విసభ్య కమిటీ సభ్యులను, నాయకులను అరెస్ట్ చేయడం జగన్ రెడ్డి పిచ్చికి పరాకాష్ట. ఎన్నికలను రద్దు చేసినట్టు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను చూపించకుండా, అడ్డగోలుగా ఎన్నికలను రద్దు చేయడం అన్యాయం. సభ్యులను అరెస్ట్ చేయడం మరీ అన్యాయం. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన వారిని తప్పించి అడ్డగోలుగా త్రిసభ్య కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. ఎన్నికల వ్యవస్థను జగన్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నాడు.

రాష్ట్రంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేకుండా అధికారాన్ని, పొలీసులను అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఎన్నికల వ్యవస్థను హైజాక్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడానికి వీల్లేదనే పరిస్థితిని సృష్టించారు. జగన్ రెడ్డి అంబేద్కర్ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో తొక్కి రాజారెడ్డి నెత్తుటి రాజ్యాంగాన్ని రాష్ట్రం పై బలవంతంగా రుద్దుతున్నారు. తిరుపతి ఎన్నికల్లో తప్పుడు వ్యక్తులతో, దొంగ ఓట్లతో ఎన్నికల వ్యవస్థను నాశనం చేశారు. దానికి సంబంధించిన సాక్ష్యాలను బయటపెట్టినా ఇంతవరకు చర్యలు లేవు. ఇప్పడు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన కొవ్వూరు అర్బన్ బ్యాంకు ఎన్నికలని రద్దు చేసి బులుగు బ్యాచ్ తో ప్రమాణ స్వీకారం చేయించడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రభుత్వం ఎన్నికలని రద్దు చేయడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా, ప్రజలు వ్యతిరేకిస్తున్నా ప్రమాణ స్వీకారం చేయిచడం సిగ్గు చేటు. జగన్ రెడ్డికి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పై గౌరవం లేదు, ప్రజలంటే విలువ లేదు. ఎన్నికలను రద్దు చేసి తనకు తాను నియంతగా చెప్పుకుంటున్నాడు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా, వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించకుండా నియంత పోకడలకు పోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత, తిరుగుబాటు వస్తుంది. తీవ్రమైన పరిణామాలని జగన్ రెడ్డి ఎదుర్కోక తప్పదు.

చంద్రబాబు నాయుడు పర్యటనలో దుర్మార్గంగా రాళ్లతో దాడులు, దౌర్జన్యాలు చేశారు. పేదవాడికు పెడుతున్న పట్టెడన్నాన్ని అందనివ్వకుండా అన్న క్యాంటిన్లను ధ్వంసం చేశారు. రాష్ట్రంలో 16పట్టణాలలో అన్నక్యాంటిన్లని ప్రభుత్వం తీసేసినా, విధ్వంసం చేసినా ప్రైవేటుగా అన్నాక్యాంటిన్లని పెట్టి పేదవాడి కడుపునింపాలనే ఉద్దేశంతోచంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తోంది. పేదవాడి కడుపునింపే అన్న క్యాంటిన్ల మీద ఎందుకింద దుర్మార్గపు ఆలోచనలు? 14 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం ప్రతి పక్షనాయకునిగా ఉన్న చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గంలో పర్యటిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించి అరాచకాలు చేస్తోంది. ఈ అరాచకపు చర్యలపై ప్రజలు తిరగబడుతున్నారు.

మున్ముందు రాష్ట్రంలో వైసీపీ ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. టీడీపీ కార్యక్రమాలు చేపడితే మీకెందుకు అంత కడుపు మంట? చంద్రబాబు నాయుడు, లోకేష్ లు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా జగన్ రెడ్డికి వణుకుపుడుతోంది. వైసీపీ ప్రజా విశ్వాసాన్ని, ప్రజాదరణని కోల్పోయి ప్రజా వ్యతిరేకతని మూటకట్టుకుంటోంది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో నాయకులు వెళుతుంటే ప్రజలు తిరుగుబాటు చేయడం స్పష్టంగా కనపడుతుంది. చంద్రబాబు నాయుడు, లోకేష్ కి వచ్చే ప్రజాదరణని చూసి తట్టుకోలేకపోతున్నారు, ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే ఓర్వలేకపోతున్నారు. ప్రభుత్వం ఆటవిక పాలనకి, అరాచక పాలనకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయడు ఎక్కడికి వెళ్లినా, లోకేష్ ఎవరిని పరామర్శించడానికి వెళ్లినా పోలీసుల అడ్డంకులతో, దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారు. ప్రభుత్వ పాలన గురించి ప్రజలలో మార్పు వచ్చింది. ప్రజల తిరుగుబాటుని ఎవరూ ఆపలేరు. ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు. శ్రీలంక పరిస్ధితులు ఆంధ్రాలో తలెత్తక ముందే జగన్ రెడ్డి దురాలోచనను మానుకోవాలి. కొవ్వూరు అర్బన్ బ్యాంకులో ద్విసభ్య కమిటీని వేసి ప్రమాణ స్వీకారం చేయించడాన్ని వెనక్కి తీసుకోవాలి. అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన బోర్డ్ డైరెక్టర్లని, టీడీపీ నాయకులను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు సూచించారు.

LEAVE A RESPONSE