– పట్టాభిని హెచ్చరించిన వైసీపీ నేత ఎంవీ నారాయణరెడ్డి
గుడివాడ, అక్టోబర్ 20: సీఎం జగన్మోహనరెడ్డిని వ్యక్తిగతంగా దుర్భాషలాడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహానికి గురి కావద్దని గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ఎంవీ నారాయణరెడ్డి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని హెచ్చరించారు. బుధవారం గుడివాడ పట్టణం శరత్ థియేటర్లోని నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకులు ప్రతి నెలా ఒక ఎజెండాతో ముందుకు వెళ్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా డ్రగ్స్ పట్టుకున్నా వాటి మూలాలు ఏపీలో ఉన్నట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారన్నారు. సీఎం జగన్మోహనరెడ్డిని దుర్భాషలాడడంపై ప్రజలు ఎంతో ఆవేదనతో ఉన్నారన్నారు. టీడీపీ నాయకులు బంద్ కు ఇచ్చిన పిలుపునకు రాష్ట్రంలో ఎవరూ స్పందించలేదన్నారు. గుడివాడ పట్టణంలో ప్రజా జీవనం యథావిధిగా కొనసాగిందన్నారు. ప్రజల సమస్యలపై పోరాడాల్సిన టీడీపీ నాయకులు వాటిని గాలికి వదిలి సీఎం జగన్మోహనరెడ్డిని వ్యక్తిగతంగా విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. అయ్యన్నపాత్రుడు దగ్గర నుండి పట్టాభి వరకు సీఎం జగన్మోహనరెడ్డి ప్రాభావాన్ని అంగుళం కూడా తగ్గించలేరన్నారు. వైసీపీ శ్రేణులు సంయమనం పాటిస్తున్నాయని, రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని నారాయణరెడ్డి టీడీపీ శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, పార్టీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు, మాజీ కౌన్సిలర్ మాదాసు వెంకట లక్ష్మి, నాయకులు తులిమిల్లి యేషయ్య, నైనవరపు శేషుబాబు, తోట రాజేష్, షేక్ బాజీ, మెండా చంద్రపాల్, మామిళ్ళ ఎలీషా, వెంపటి సైమన్ తదితరులు పాల్గొన్నారు.