– ఇంతకూ యువకుడు ఎవరు సామీ?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఒకరు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి. మరొకరు తాజా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఐదేళ్లు సీఎంగా పనిచేసిన జగన్ వయసు 52 సంవత్సరాలయితే.. చంద్రబాబునాయుడు మొన్ననే 75 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అంటే వారిద్దరి వయసులో 23 ఏళ్లు తేడా అన్నమాట!
సహజంగా 75 ఏళ్ల వయసు వాళ్లు ఇంటిపట్టునే ఉండి, మనుమలు, మనుమరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు. లేదా విహారయాత్రలతో శేషజీవితం గడిపేస్తుంటారు. మరికొందరు వృద్ధాశ్రమాల్లో విశ్రాంతి తీసుకుంటారు. రచయితలయితే పుస్తకాలతో కాలం గడిపేస్తుంటారు. ఇప్పుడయితే చాలామంది, పెద్దముత్తయిదువల్లా టీవీ చర్చల్లో కనిపిస్తున్నారు. ఇదంతా మనం చూస్తున్నదే.
అంటే 52 ఏళ్ల జగన్కు-75 ఏళ్ల చంద్రబాబుకూ కచ్చితంగా అన్ని అంశాల్లోనూ తేడా ఉండి తీరాలి. అది మానసికంగానయినా, శారీరకంగానయినా సరే! సహజంగా 75 ఏళ్ల వయసున్న వాళ్లు, 52 ఏళ్ల వారితో ఏ విషయంలోనూ పోటీ పడలేరు. అది కష్టం కూడా. ఆలోచనలు కూడా వారితో పోటీపడలేవు. ఎందుకంటే 52 ఏళ్ల వారు దూకుడు మానేసి, ఆలోచనలకు పదునుపెడుతుంటారు కాబట్టి. శారీరకంగా కూడా బలంగానే ఉంటారు కాబట్టి!
అన్నింటికీ మించి.. 75 ఏళ్ల వారు శారీరక శ్రమ చేయటం బహు కష్టం. కిందకు ఒంగడమం మహా దుర్లభం. ఒకవేళ సాహసం చేసి బలవంతంగా కిందకు వంగినప్పటికీ, పైకి లేవడం కుదిరేపని కాదు. ఇక ఒక కాలువ నుంచి మరో కాలవగట్టుపైకి, చిన్నపిల్లాడి లెక్క దూకుదామనుకుంటే అస్సలు కుదరని పని. ఒకవేళ అత్యుత్సాహం ప్రదర్శించి, దూకుడు విన్యాసం చేస్తే, ఆసుపత్రిలో విశ్రాంతి తప్పదు. ఎవరికైనా 75 ఏళ్ల వ్యక్తికి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకువచ్చి, తన మనమలను పిలిచి.. గోలీకాయలు ఆడదామని చెబితే, పోరగాళ్లు ఫక్కున నవ్వుతారు. నువ్వు కింద ఏం కూర్చుంటావ్ తాతా అని ఎగతాళి చేస్తారు.
కానీ అదే 52 ఏళ్ల యువకుడు అవలీలగా కింద కూర్చుని పిల్లలతో గోలీలు ఆడేస్తాడు. మరి అదే 52 యువకులు సులభంగా నడుం వంచి కింద ఉన్న వస్తువులు సులభంగా తీయగలరు. ఉత్సాహంగా క్రికెట్, కబడ్డీ కూడా ఆడేయగలరు.
75 ఏళ్ల వృద్ధుడు తిరుమల కొండకు రికార్డు స్థాయి సమయంలో ఎక్కేయడం దుర్లభం. గగనం. అసాధ్యం. దుస్సాధ్యం. అన్నీనూ! కానీ అదే 52 ఏళ్ల యువకుడు ఆ రికార్డు సృష్టించేయగలడు. ఆ ఓపిక కూడా అతనికి ఉంటుంది.
ఇక 75 ఏళ్ల వృద్ధుడు ఏదైనా శంకుస్థాపనకు వెళ్లి నడుం వంచి కొబ్బరికాయ కొట్టడం చాలా కష్టం. నడుము సహకరించదు మరి. అదే 52 ఏళ్ల మధ్య యువస్కుడయితే అవలీలగా కిందకు వంగి, వంద కొబ్బరికాయలు టకా టకా కొట్టేయగలడు.
అంతేనా?.. 52 ఏళ్ల వ్యక్తి మైకు ముందు నిలబడి, ఏకబిగిన రెండు గంటలు మంచినీరు తాగకుండా మాట్లాడగలడు. ఆ ఓపిక అతనికి ఉంటుంది. కానీ ఓ 75 ఏళ్ల వృద్ధుడు.. అన్ని గంటలు మైకుముందు అంత ఓపికగా నిలబడగలరా? నెవర్! అర్ధగంట నిలబడితేనే అరలీటరు మంచినీరు తాగి అలుపు తీర్చుకోవలసిందే.
ఇంకా ఇలా 75 ఏళ్ల వృద్ధుడు.. 52 ఏళ్ల మధ్య వయస్కుడికీ ఉన్న శారీరక-మానసిక తేడాలు ఎన్నో.. ఎన్నెన్నో!
సీన్ కట్ చేస్తే..
మేడే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నె ల్లూరు జిల్లాలో జరిగిన మేడే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా భవన నిర్మాణ పనులు చేసే కార్మికులతో ముచ్చటించారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ 75 ఏళ్ల చంద్రబాబు వారితో కలసి పనిచేశారు. పార తీసుకుని, అవలీలలగా నడుం వంచి రాళ్లు తీశారు. అచ్చం యువకుల మాదిరిగానే ఆయన ఆ పనిచేయడం, టీవీల్లో చూసిన వారందికీ కనిపించింది. అదేదో జగన్ మాదిరిగా ఎడిట్ చేసిన ప్రెస్కాన్ఫరెన్స్ వీడియో కాదు. 75 ఏళ్ల వృద్ధుడు, తన వయసును కూడా లెక్కచేయకుండా అలా ఆడుతూ పాడుతూ వారితో పనిచేయడమే ఇక్కడ ఆశ్చర్యం.
మళ్లీ సీన్ కట్ చేస్తే..
జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఒక శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. సహజంగా శంకుస్థాపన అంటే.. కొబ్బరికాయ కొట్టే కార్యక్రమం తప్పనిసరిగా ఉంటుంది. అది శాస్త్రం కూడా! ఆ ప్రకారంగా ఎవరైనా నడుం కిందకు వంచి కొబ్బరికాయ కొట్టాలన్నమాట. బట్.. 52 ఏళ్ల జగన్ ఆ పనిచేయలేకపోయారు. నడుం వంచలేకపోయారు. మరి ఎలా చేశారనే కదా మీ డౌటనుమానం?
సింపుల్.. ఒక పెద్ద సైజు నాలుగుపలకల రాయిని తెప్పించారు. దాన్ని పండితుడు తనచేతితో పట్టుకుంటే, 52 ఏళ్ల జగనన్న ‘చాలా కష్టపడి, అవలీలలగా’ కొబ్బరికాయ కొట్టేశారు! ఆ ఫొటోలు, వీడియోలు చూసిన వారు.. 52 ఏళ్ల వృద్ధాప్యంలోనూ జగనన్న అంత సాహసం చేయడం సామాన్యమైన విషయం కాదు. అసలు ఆ వయసులో అలా చేయడం ఒక్క జగనన్నకే సాధ్యమైంది. జయహో జగన్ అంటూ తెగ ఎకసెక్కాలాడారు.
ఇంకో సీన్ కట్ చేస్తే..
75 ఏళ్ల చంద్రబాబు ప్రతి బహిరంగసభలో గంటన్నరకు తక్కువగా మాట్లాడరు. మహానాడులో అయితే అది ఎన్ని గంటలయినా కావచ్చు. కానీ మధ్యలో ఎప్పుడూ ఒక్క చుక్క మంచినీళ్లు తాగిన సందర్భాలు, భూతద్దం వేసి వెతికినా కనిపించవు. ఇక అధికారంలో ఉంటే అధికారులతో, విపక్షంలో ఉంటే పార్టీ నేత లతో కూడా అదే స్టైల్లో గంటలపాటు మాట్లాడతారు. అప్పుడూ చుక్క మంచినీరు తాగే అలవాటు ఉండదు. మహా అయితే మధ్యలో ఒకసారి మజ్జిగ తాగుతారంతే.
ఇక ఆ సమావేశాల్లో ఏసీ చలి గజగజలాడిస్తుంటుంది. అధికారులయినా, పార్టీ నాయకులయినా.. ఆ ఏసీ చలి దెబ్బకు వయసుతో సంబంధం లేకుండా కనీసం ఒకసారి, మరీ సీనియర్లయితే రెండుసార్లు మూత్ర విసర్జనకు బయటకు వెళ్లాల్సిందే. అప్పుడు కూడా 75 ఏళ్ల చంద్రబాబు నింపాదిగా అలాగే కూర్చుండిపోతారంతే! ఇది ఆయన దగ్గర సమావేశాలకు వెళ్లే అధికారులు, పార్టీ నాయకులకు అనుభవమే!!
లాస్ట్ సీన్ కట్ చేస్తే..
52 ఏళ్ల జగన్మోహన్రెడ్డి సహజంగా ఏ సభల్లోనూ ఎక్కువ సేపు మాట్లాడరు. అరగంటయితే ఎక్కువ. సీఎంగా సమీక్షలు నిర్వహించినప్పుడూ అంతే. కానీ ఆ మధ్యలో నీళ్లు తాగుతుంటారు. ఇది కూడా ఆయన వద్ద పనిచేసిన అధికారులు, నాయకులకు ఎదురయిన అనుభవమే.
***
చాలామంది భక్తులు తిరుమలకు కాలినడకన వెళ్లి మొక్కులు చెల్లిస్తుంటారు. అందులో యువకుల నుంచి వృద్ధుల వరకూ ఉంటారు. అయితే వృద్ధుల సంఖ్య చాలా తక్కువగా ఉండవచ్చు. ఒకవేళ వృద్ధులు మెట్లు ఎక్కినా నిదానంగా, మధ్యలో విశ్రాంతి తీసుకుని గమ్యం చేరుకోవడం చూస్తుంటాం. రాజకీయ నాయకుల్లో కూడా కొందరు మెట్ల మార్గాన తిరుమల వెళుతుంటారు.
కానీ ఇప్పటివరకూ 70 ఏళ్లు దాటిన వృద్ధ నేతలెవరూ మెట్ల మార్గాన వెళ్లిన దాఖలాలు లేవు. అదే చంద్రబాబునాయుడు, యువకుల మాదిరి గంటలోపే కొండపైకెళ్లారు. కానీ ఆయన వెనుక ఉన్న అధికారులు, పోలీసు అధికారులు మాత్రం ఆపసోపాలు పడుతూ పైకి చేరారు.
ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ 2 గంటల 25 నిమిషాల్లో కొండపైకి చేరుకుంటే, ప్రజాసంకల్పయాత్ర ముగిసిన సందర్భంగా, అలిపిరి ద్వారా నడక మార్గాన వెళ్లిన జగన్కు మాత్రం 3 గంటల 5 నిమిషాలు పట్టింది. ఇక రాహుల్ గాంధీ మాత్రం ఒక గంట 50 నిమిషాల్లోనే కొండపైకి చేరుకున్నారు. అయితే.. వీరందరిలో వయసు రీత్యా చంద్రబాబు పెద్దవాడయితే.. రాహుల్ గాంధీకి 54 , పవన్కు 53, జగన్కు 52 ఏళ్లు కావడం గమనార్హం.
* * *
తాజాగా నెల్లూరులో 75 ఏళ్ల వృద్ధుడయిన చంద్రబాబునాయుడు కిందకు వంగి, పార తీసుకుని రాళ్లు తీసిన దృశ్యం చూస్తే.. నాడు జగన్ ఏమాత్రం కిందకు వంగకుండా, రాయిని తెప్పించుకుని ఆ రాయిపైనే కొబ్బరికాయ కొట్టిన అపురూప దృశ్యం గుర్తుకువచ్చింది. అందుకే ‘కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు’ అని శ్రీశ్రీ, వీరిని ఊహించే.. చాలా ఏళ్ల కంటే ముందు వ్యంగ్యాస్త్రాలు సంధించినట్లున్నారు.
వయసు శరీరానికే. మనసుకు కాదన్నది చంద్రబాబు-జగన్ వ్యవహారశైలి స్పష్టం చేస్తుంది.