– అంబటి కుటుంబాన్ని పరామర్శించిన మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని
విజయవాడ, జూలై 19: జర్నలిస్టు యూనియన్ నేత దివంగత అంబటి ఆంజనేయులు యూనియన్ కార్య కలాపాల్లో తనదైన ముద్ర వేశారని సి.ఆర్. మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు కొనియాడారు. స్వర్గీయ ఆంజనేయులు గృహాన్ని బుధవారం సందర్శించి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. దివంగత అంబటి ఆంజనేయులు చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.
స్వర్గీయ ఆంజనేయులు నిరంతరం జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడ్డారని ఆయన ప్రస్తుతించారు. స్వతహాగా సౌమ్యులని, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఆంజనేయులు అనేక పోరాటాలు చేశారని ఆయన గుర్తుచేశారు. చివరి క్షణాల వరకు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తపించిన నాయకుడని, ఆయన మరణం పాత్రికేయలోకానికి తీరని లోటని ఆయన విచారం వ్యక్తం చేశారు. దివంగత ఆంజనేయులు కుమారులు అంబటి సంజయ్, అంబటి సంతోష్ లను ఈ సందర్భంగా ఓదార్చారు.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు చావా రవి మాట్లాడుతూ వ్యక్తిగత ఆరోగ్యంతో బాటు తమ అందరి ఆరోగ్యాల పట్ల దివంగత ఆంజనేయులు శ్రద్ధ వహించే వారని చైర్మన్ కు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే యూనియన్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, కార్యదర్శి ఆర్ వసంత్ ఐజేయూ కౌన్సిల్ సభ్యులు షేక్ బాబు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దారం వెంకటేశ్వరరావు, పెన్ జాబ్ అధ్యక్షులు బడే ప్రభాకర రావు, ట్రెజరర్ టి.వి. రంగారావు, సెక్రెటరీ సుమ ఉపేందర్, ప్రముఖ మిమిక్రి కళాకారులు సిల్వెస్టర్, లయన్ వై. రంగారావు, సి.ఆర్. మీడియా అకాడెమీ సెక్రెటరీ మామిడిపల్లి బాలగంగాధర తిలక్, ఓ.ఎస్.డి. ఎస్. శ్రీనివాస జీవన్, కంటెంట్ ఎడిటర్ కలమండ శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.