అమరావతి: తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు సహా ఇతర పరిణామాలపై కేంద్ర హోంశాఖకు ఎన్ఎస్జీ నివేదిక అందించింది. సెప్టెంబర్ 8 తేదీ అర్ధరాత్రి నుంచి 10 తేదీ అర్ధరాత్రి 1 గంట వరకు జరిగిన అరెస్టు, ఏసీబీ కోర్టు రిమాండ్, జైల్లో భద్రత తదితర అంశాలను నివేదికలో పేర్కొంది..
తొమ్మిదో తేదీ ఉదయం 6 గంటలకు సీఐడీ అరెస్టుతో పాటు ఎన్ఎస్జీ ప్రొటెక్ట్గా ఉన్న ఆయన్ను రోడ్డు మార్గంలో విజయవాడ తరలింపు అంశాన్ని ప్రస్తావించింది. 10 తేదీ తెల్లవారుజాము 3.30 గంటల నుంచి సిట్ కార్యాలయం విజయవాడ జీజీహెచ్, ఏసీబీ కోర్టుకు తరలించినట్లు పేర్కొంది. ఆ రోజు మొత్తం భద్రతా పరంగా అంత పటిష్ఠంగా లేని కోర్టు హాలు వెలుపల ఆయన్ను ఉంచినట్లు పేర్కొంది. అదే రోజు రాత్రి 9.29 నిముషాలకు వర్షంలో రాజమహేంద్రవవరం సెంట్రల్ జైలుకు తరలించారని రిపోర్టులో పేర్కొంది.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ప్రస్తుతం అయన భద్రత ఏమిటన్న విషయాన్ని కూడా ఎన్ఎస్జీ ప్రస్తావించింది. జైలు అవరణలోకి వెళ్ళే సమయంలో కొన్ని భద్రతా లోపాలు గుర్తించినట్టు పేర్కొంది. మొత్తం నివేదికను చంద్రబాబు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎన్ఎస్సీ సిబ్బంది కేంద్ర హోంశాఖకు, ఎన్ఎస్జీ ప్రధాన కార్యాలయానికి నివేదిక సమర్పించారు..