Suryaa.co.in

Andhra Pradesh

అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెనలే సామాజిక సాధికారత అంటే ఎలా?

-జగన్ పాలనలో ఐదుగురు దళిత మంత్రులు, 27 మంది దళిత ఎమ్మెల్యేలున్నా దళితులకు ఉపయోగం శూన్యం
-చంద్రబాబు దళితులకు పెట్టిన 27 పథకాలు అమలు కావడంలేదని ఏ నాయకుడైనా సీఎంకు తెలిపారా?
-మాజీ మంత్రి నక్కా ఆనందబాబు

జగన్ పాలనలో ఐదుగురు దళిత మంత్రులున్నా దళితులకు ఉపయోగం లేదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు.మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ..

జగన్ పాలనలో 27 మంది దళిత ఎమ్మెల్యేలున్నా దళితుల బాగు కోసం ఏవిధంగాను సహకరించడంలేదు. జగన్ రెడ్డి ప్రభుత్వం సామాజిక సాధికార బస్సు యాత్రలు దేనికి? చేస్తోందో అర్థం కావడంలేదు. రీజనల్ వారిగా చేస్తున్నారు, దీనివల్ల ఉపయోగమేమి? అసలు జగన్ కు సామాజిక సాధికారత అంటే అర్థం తెలుసా?

దళిత మంత్రులు, నాయకులకు ఇన్నాళ్లు సామాజిక సాధికారత గుర్తుకు రాలేదా? గతంలో దేశంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలు అణచివేతకు గురౌతున్నాయని, అంటరానితనం, అస్పశ్యతల మధ్య కొట్టుమిట్టాడుతుంటే బీఆర్ అంబేద్కర్ వారికి రాజ్యాంగం ప్రకారం ప్రత్యేక హక్కులు, రాయితీలు, రిజర్వేషన్ లు కల్పించారు. కేంద్రంలో గానీ, రాష్ట్రంలో గానీ అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు రాజ్యంగం ద్వారా సంక్రమించిన హక్కుల్ని దళితులు, గిరిజనులకు కల్పిస్తూ వచ్చారు. అణగారిన వర్గాలను ఉన్నత వర్గాలతో సమానంగా చేయడమే సాధికారత.

వైసీపీ ప్రభుత్వంలో సామాజిక సాధికారత లేదు. వైసీపీ ప్రభుత్వం సాధికారత సాధించే దిశగా ఎప్పుడూ పోలేదు. అందుకు ఏ ఒక్క పథకం అమలు చేయలేదు. రాష్ట్రంలో సాంఘీక సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ లను సాధికారత సాధించే దిశగా చంద్రబాబు హయాంలో ప్రయత్నించారు. ఆ శాఖలకు ఎంపోరిం యాడ్ చేశారు. వరి అభ్యన్నతికి అనేక పథకాలను తీసుకొచ్చారు. నేడు వాటిని పూర్తిగా తుంగలో తొక్కారు. సామాజిక న్యాయాన్ని అటెక్కించారు. సామాజిక న్యాయానికి నిట్టనిలువునా గొంతు కోశారు. దగా చేశారు.

సామాజిక న్యాయం గురించి డిబెట్లలో మాట్లాడటానికి అనేక సార్లు పిలిచాం. వైసీపీ నాయకులెవరూ ముందుకు రాలేదు. దళిత మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆత్మాభిమానం లేదు. అమ్మఒడి స్కాలర్ షిప్ లు గతంలోనూ టీడీపీ ప్రభుత్వం ఇచ్చింది. టీడీపీ హయాంలోని ఫ్రీ స్కాలర్ షిప్ పథకమే విద్యాదీవెన పథకం. గతంలో టీడీపీ ప్రభుత్వం హాస్టళ్లకు ఇచ్చే మెస్ ఛార్జీలు, అకామడేషన్ బిల్లులకు పేరు మార్చి వసతి దీవెన అంటున్నారు. కొత్తగా ఏమీ చేయలేదు. రాష్ట్ర బడ్జెట్ ను విడగొట్టారు. కులాలవారీగా వేరు చేశారు.

తెల్ల రేషన్ కార్డుపై రూపాయికి కిలో బియ్యం ఇచ్చే పథకంలో కూడా కులాలవారీగా కార్డులెన్ని ఉన్నాయో లెక్కేసి ఏ కులానికి ఎన్ని కోట్లు ఇస్తున్నామనేది ప్రభుత్వం ప్రజలకు చూపుతోంది. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎస్సీ కులంలో పుట్టి, ఎస్సీలుగా ఉండి ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారు. అనాదిగా వస్తున్న పథకాలు రద్దయ్యాయి.

టీడీపీ హయాంలో బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల ద్వారా 70 వేల మందికి లబ్ధి చేకూర్చాం
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ద్వారా నాలుగేళ్లలో 70 వేల మంది విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో చదువుకోవడానికి అవకాశం కల్పించాం. ఈ ప్రభుత్వం బెస్ట అవైలబుల్ స్కూళ్లను రద్దు చేసింది. రద్దు చేసినందుకు హైకోర్టు కు వెళ్లాం. ఈ పథకాన్ని పునరుద్ధరించాలని హైకోర్టు ఆర్డర్ వేసింది. దాదాపు 4 వందల కోట్లు తాగునీటి పథకానికి సబ్ ప్లాన్ నిధులు వెచ్చించాం. రూ. 16 వందల కోట్లు సీసీ రోడ్లకు ఖర్చు పెట్టాం. 4 లక్షల మందికి ఎస్సీ కార్పొరేషన్ బ్యాంక్ లింక్ డ్ స్కీములిచ్చాం. ఇంకా అనేక పథకాలకు వేల కోట్లు ఖర్చు పెట్టాం.

కేంద్రం నుంచి ఎన్ఎస్ఎఫ్ డీసీ, ఎన్ ఎస్ కే ఎఫ్ డీసీలను తీసుకొచ్చి దాదాపు 17 వందల మందికి ఇన్నోవా కార్లు ఇచ్చాం. వేల కోట్లు ఖర్చు చేసి అనేక మందికి స్వయం ఉపాధి కల్పించాం. వైసీపీ ప్రభుత్వం ఒక్కరికి కూడా లబ్ధి చూకూర్చలేదు. ఎస్సీ కార్పొరేషన్ ను మూడు ముక్కలు చేశారు. ఒక్కరికి కూడా రుణమివ్వలేదు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎలా లబ్ధి పొందారో ప్రస్తుత దళిత మంత్రులు, శాసనసభ్యులు ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి.

చంద్రబాబు పెట్టిన 27 పథకాలను రద్దు చేస్తే మాట్లాడే దమ్ము, ధైర్యం నేటి వైసీపీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు లేకపోయింది. భూమి కొనుగోలు పథకం ద్వారా భూములు లేని దళితులకు వేల ఎకరాలు కొనిచ్చింది టీడీపీ ప్రభుత్వం. ఆ భూముల్ని నేడు వైసీపీ ప్రభుత్వం లాక్కుంది. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు అదనపు ప్రయోజనాల కోసం ఖర్చు చేసుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దళితవాడల్లో ఆరు వేల కిలోమీటర్లు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేశాం.

ఎమ్మెల్సీ అనంతబాబు మర్డర్ చేసినా అతనికి రెడ్ కార్పెట్
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన వద్ద డ్రైవర్ గా పనిచేసే సుబ్రమణ్యం అనే దళితుడిని చంపేసి శవాన్ని తీసుకెళ్లి డోర్ డెలివరి చేస్తే మొక్కుబడిగా పార్టీ నుండి సస్సెండ్ చేశామని చెప్పి రాచ మర్యాదలతో జైలునుంచి తీసుకొచ్చారు. అతనికి రెడ్ కార్పెట్ పరిచారు. ముఖ్యమంత్రి నిర్వహించే లెజిస్లేచర్ పార్టీ సమావేశాల్లో, తూర్పు గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశాల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.

ఇసుక మాఫియాను ప్రశ్నించినందుకు వరప్రసాద్ ను శిరోముండనం చేశారు
ఇసుక మాఫియా గురించి ప్రశ్నించాడని వరప్రసాద్ అనే దళితుడిని పోలీసు స్టేషన్ లో శిరోముండనం చేశారు. సీఎం సొంత జిల్లాలో నాగమ్మను హత్య చేస్తే అడగడానికి వెళ్లిన టీడీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు కేసులు పెట్టారు. మీ ప్రభుత్వం సాధికారత గురించి మాట్లాడటమా? నాలుగు దళిత నియోజకవర్గాల మధ్య ఉన్న రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసి నిస్తేజం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు ఆందోళన చేస్తుంటే వారి చేతులకు బేడీలు వేసి నడిపించారు. పైగా వారిమీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు.

ఎస్సీ, ఎస్టీ యాక్టును అడ్డగోలుగా నిర్వీర్యం చేసినవారు సాధికారత గురించి మాట్లాడటమా?
ఎస్సీ, ఎస్టీ యాక్టును అడ్డగోలుగా నిర్వీర్యం చేసినవారు సాధికారత గురించి మాట్లాడుతున్నారు. సాధికారత ద్వారా దళితులకు ఏం చేశారని చెబుతారు? 2001లో అంటరానితనంపై జస్టిస్ పున్నయ్య ఏకసభ్య కమిషన్ ను వేసి రాష్ట్రంలో సంవత్సర కాలంపాటు స్థితిగతులను అధ్యయనం చేయించి జస్టిస్ పున్నయ్య 42 సిఫార్సులు ఇస్తే సిఫార్సులకు సంబంధించిన 18 జీవోలను విడుదల చేసి.. ఎస్సీ ఎస్టీ కమిషన్ ను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబునాయుడుకే దక్కుతుంది.

చంద్రబాబుపై అవాకులు, చవాకులు పేలడం మంచిదికాదు. అలాంటి ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను నిర్వీర్యం చేశారు. నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ గా ఎన్టీరామారావు ఉన్న హయాంలో బీఆర్ అంబేద్కర్ కు భారత రత్న అవార్డు ఇచ్చారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో అంబేద్కర్ విగ్రహం పెట్టడం కూడా ఎన్టీ రామారావు కృషే. కేఆర్ నారాయణ్ రాష్ట్రపతి కావడంలో, జీఎంసీ బాలయోగిని లోక్ సభ స్పీకర్ చేయడంలో చంద్రబాబు నాయుడు చొరవ ఉంది. వైసీపీలోని దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు ఆత్మగౌరవంగా బతకాలి.

ప్రతిపక్షాల గొంతు నులమడం సరికాదు. చంద్రబాబునాయుడును జైల్లో పెట్టడంతో గొప్ప విజయం సాధించినట్లుగా స్వీట్లు పంచుకోవడం, బాణాసంచ కాల్చుకోవడం, పండుగ చేసుకోవడం సైకోయిజానికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడు పేద, బడుగు వర్గాల పక్షాన ఉంటుంది. నరకాసుర వధ మొదలైంది. కంటిన్యూ అవుతుంది. వైసీపీకి సమయం దగ్గరపడింది. ఏ దళితులను వంచించారో ఆ దళితులే వైసీపీకి బుద్ది చెబుతారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు.

LEAVE A RESPONSE