Suryaa.co.in

Andhra Pradesh

త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో వైకాపా విలీనం ఖాయం

శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్డే అంజనప్ప

రాష్ట్ర చరిత్రలోనే చెరగని సంక్షేమ సంతకం చేస్తున్న కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనతో విపక్ష వైకాపా దిక్కుతోచని స్థితిలో పడిందని, కాంగ్రెస్‌ పార్టీలో వారి విలీనం ఖాయంగా కనిపిస్తు ందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు వడ్డే అంజనప్ప. సంక్షేమం, అభివృద్ధి మేళవింపుగా సాగుతున్న ప్రజాకర్షక పాలన తో ఇక వారికి పుట్టగతులు ఉండవనే వైకాపా నేతలంతా పక్క పార్టీల వైపు చూస్తున్నారు.

ఈ క్రమంలో పలువురు వైకాపా నేతలు తమ సొంతగూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకోగా, వాళ్లందరికంటే ముందుగా జగన్ కూడా అదే పనిలో విలీన రాయబారాల్లో బిజిబిజీగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో పార్టీ ఓడిపోయిన దగ్గర్నుంచి బెంగళూరు లో అదే పనిగా పెట్టుకున్నట్లు తమకు పక్కా సమాచారం ఉందన్నారు. ఈ నెల 20వ తేదీతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి వందరోజుల సందర్భంగా ఈమేరకు తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు వడ్డే అంజనప్ప.

ఎన్డీయే కూటమి 100 రోజుల పాలన అద్భుతంగా ఉందని ప్రజలు శభాష్ అంటుంటే జగన్, వైకాపా నేతలు జీర్ణించుకోలేక అవస్థ పడు తున్నారని చురకలు వేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం మాది అని ప్రజలంతా అనుకునేలా తమ ప్రభుత్వం 100 రోజుల పాలన సాగిందన్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకుంటునే రాష్ట్ర చరిత్రలోనే నిలిచిపోయే జూన్‌-14వ తేదీన చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాలతోనే రాష్ట్రం దశ మారిందని, మాటిచ్చిన సంక్షేమాన్ని రెండింతలుగా అందించడంలో కూటమి చరిత్ర సృష్టిస్తోందన్నారు.

ప్రజల కోసం పాలన బ్రహ్మాండంగా ఉందని, చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తోందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛను వెయ్యి రూపాయలు పెంచారని, మొదటి నెలలోనే 3 నెలల బకాయిలు కలిపి ఇచ్చారని, ప్రతినెలా 1వ తేదీనే ఇళ్ల వద్ద రూ.4 వేల పింఛన్ ఇస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షలమందికి ఏకకాలంలో పంపిణీ చేస్తున్నారన్నారు. అది చూసిన తర్వాత కూటమి గెలిచి, చంద్రబాబు సీఎం అయితే సంక్షేమం ఆగిపోతుందని ప్రచారం చేసిన వారంతా నాలుక కరుచు కుంటున్నారని చురకలు వేశారు.

మరీ ముఖ్యంగా వైకాపాలో వణుకు తారాస్థాయికి చేరిందన్నారు. రామలక్ష్మణులాగా సమన్వయంతో పనిచేస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ దెబ్బతో వైకాపా మొత్తం తట్టాబుట్టా సర్దుకునే పనిలో పడిందన్నారు. ఈ సూపర్ హిట్టు జోడి పాలన, ఇటు రాజకీయంలోనూ రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా సమన్వయంతో పనిచేస్తూ ముందుకెళ్తున్నారన్నారు. వైసీపీ నాయకులు ఏం చేయాలో అర్థంగాని పరిస్థితిలో తలోదారి వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి తర్వాత ఆ పార్టీ పతనం మరింత వేగం పుంజుకోవడం ఖాయమన్నారు.

బాలినేని బాటలోనే ఇంకా చాలామంది నాయకులు ఎవరి దారి వారు చూసుకుంటున్నారని, వైసీపీకి మనుగడ లేదని, అక్కడ ఉంటే ఉనికికే ప్రమాదమని వాళ్లంతా ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరాలనే ఉద్దేశంతో బెంగళూరులో కూర్చొని మంతనాలు జరుపుతున్నారని వెల్లడించారు. ఇలా స్వయంగా పార్టీ అధ్యక్షుడే దిక్కులేని పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో చేరాలని జగన్‌రెడ్డి చూస్తుంటే ఆ పార్టీ నాయకులు ఏ పార్టీలో చేరాలో తెలియక సందిగ్ధంలో పడిపోయారన్నారు.

కొంతమంది బీజేపీలోకి, మరికొంతమంది తెలుగుదేశంలోకి, జనసేన, ఇంకొంతమంది కాంగ్రెస్‌లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలిపారు. ఇక భవిష్యత్తులో వైసీపీకి మనుగడ ఉండదన్నారు. భవిష్యత్తులో ఏపీని దేశానికే ఆదర్శంగా స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలనే ఆశయంతో చంద్రబాబు, పవన్ కష్టపడి పని చేస్తున్నారని, రానున్న 15 సంవత్సరాల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో అద్భుతమైన రాష్ట్రంగా ఏపీ అభివృద్ధి చెందుతోందని చెప్పారు. దేశంలోనే ఏపీ ఒక ఆదర్శంగా నిలబడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు వడ్డే అంజనప్ప.

LEAVE A RESPONSE