Suryaa.co.in

Andhra Pradesh

‘గ్రీవెన్స్’ మానవత్వం!

– చిన్నారి వైద్యానికి మంత్రి గొట్టిపాటి ఆర్థిక సాయం
– అధికారుల అలసత్వంపై ఫిర్యాదులు… చర్యలకు వినతులు
– పోటెత్తిన అర్జీదారులు… వినతులు స్వీకరించి, పరిష్కారం చూపిన నేతలు

మంగళగిరి: నాలుగేళ్ళ వయస్సు ఉన్న తన పాపకు చిన్నమెదడు ఎదుగుదల లేదని.. కూర్చోవడం, నడవడం, మాట్లాడటం లేదని.. వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్ళమని చెబుతున్నారని.. ఇప్పటికే పాప కోసం లక్షల రూపాయలు ఖర్చుచేశామని ఇక తమ వద్ద డబ్బులు లేవని .. తమను ఆదుకోవాలని తిరుపతి జిల్లా నాయుడు పేటకు చెందిన బి.రంజిత్ విన్నవించారు. ఇక్కడి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో గురువారం గ్రీవెన్స్ జరిగింది. రంజిత్‌ విన్నపానికి చలించిపోయిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెంటనే వారికి రూ. 20,000 ల ఆర్థిక సాయం అందించారు. మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకున్నారు. గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీదారుల నుండి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఎమ్మెల్యే బూర్ల రామాంజినేయులు అర్జీలు స్వీకరించారు. వారి సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకున్నారు.

• ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహింపట్నం మండలం, కొండపల్లికి చెందిన తలారి రంగారావు విజ్ఞప్తి చేస్తూ.. తాను మాల కులానికి చెందిన వాడనని.. 2018 లో టాటా హిటాచీ ఎక్స్కవేటర్ ను కొనుగోలు చేసి వైసీపీ నాయకుడు జి. కొండూరు ఎంపీపీ వేములకొండ తిరుపతిరావు, వేములకొండ సాంబశివరావులకు నెలకు రూ. 1,40,000 చొప్పున అద్దెకు నిమిత్తం ఇచ్చానని తెలిపారు. 2022 ఫిబ్రవరి తరువాత అద్దె చెల్లించకుండా.. వెళ్ళి అడిగితే అద్దె చెల్లించేది లేదు.. బండి ఇచ్చేది లేదని బెదిరిస్తున్నారని మాల, మాదిగలంటూ తిడుతూ భయపెడుతున్నారని గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. వారి నుండి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
• గుంటూరు జిల్లా, తాడికొండ మండలానికి చెందిన చుంటు సీతమ్మ విజ్ఞప్తి చేస్తూ.. భూమిని ఆన్ లైన్ ఎక్కించకుండా అధికారులు తాత్సారం చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. గ్రీవెన్స్ లో ఇచ్చిన అర్జీలు మండల కార్యాలయానికి వెళితే సమస్యను పరిష్కరించకుండానే పరిష్కరించామని తప్పుడు మెసేజ్ లు పంపుతున్నారని.. అట్టి అధికారులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆమె గ్రీవెన్స్ లో వేడుకున్నారు.
• యునైటెడ్ ఎలక్ట్రసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సభ్యులు ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు విజ్ఞప్తి చేస్తూ.. గతంలో అనేక సంవత్సరాలు వాచ్ & వార్డులుగా పనిచేస్తూ.. ఐటిఐ అర్హత ఉన్నవారిని షిఫ్ట్ ఆపరేటర్లుగా నియమించాలన్న కోర్టు ఆదేశాలమేరకు తాము స్కిల్ ఆపరేటర్లుగా నియామకమయ్యామని, కానీ, స్కిల్ వర్కర్లకు ఇస్తున్న వేతనం కాకుండా ఆ వాచ్ మెన్ కు ఇస్తున్న జీతం కంటే తక్కువ వేతనం ఇస్తున్నారని మొరపెట్టుకున్నారు. తమకు స్కిల్ ఆపరేటర్లకు అందే జీతం ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు.
• నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గం దగదర్తి మండలానికి చెందిన మాలేపాటి రవీంద్ర విజ్ఞప్తి చేస్తూ.. సొంత మండలంలో వైసీపీ పార్టీకి చెందిన వారిని స్థానిక ఎమ్మెల్యే తన వర్గంగా చేర్చుకుని టీడీపీని రెండు వర్గాలుగా చీల్చి అటు పార్టీకి ఇటు తమకు తీవ్ర ద్రోహం చేస్తున్నారని… ఆయన వ్యవహార శైలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి నేడు నిస్సహాయ స్థితిలో ఉన్నామని తెలిపారు. 42 ఏళ్ళుగా టీడీపీని నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
• ఏలూరు జిల్లా, నిడమ్మర్రు మండలం, ఆమదాలపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో తమ భూమి 4.55 సెంట్లు ముదునూరి గోపాలకృష్ణంరాజు వారి కుమార్తె దివ్య కబ్జా చేశారని.. దీనిపై కోర్టుకు వెళ్ళగా ఆ భూమి మాకే అప్పగించమని.. వారిని ఖాళీ చేయించాలన్నదని.. అయినా అధికారులు పట్టించుకోవడంలేదని ఓగిరాల మహేష్ బాబు తన ఆవేదనను వ్యక్తం చేశాడు. వారిని ఖాళీచేయించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
• ట్రాన్స్ ఫార్మర్, కరెంట్ స్థంభాలు, సర్వీస్ నెంబర్ కోసం 16 ఏళ్ళ నుండి తిరుగుతున్నానని.. ఎందరో అధికారులు మారుతున్నారు కాని తనకు మాత్రం పనులు జరగడంలేదని.. తిరగ్గా తిరగ్గా.. ట్రాన్స్ ఫార్మర్, లైన్ బిగించారు కానీ, సర్వీస్ నెంబర్ ఇవ్వలేదని.. సర్వీస్ నెంబర్ ఇప్పించి న్యాయం చేయాలని మంత్రి గోట్టిపాటికి అట్లూరి, వేణుగోపాల్, అటలూరి భాస్కర్ విజ్ఞప్తి చేశారు.
• విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలం మధుపాడ గ్రామానికి చెందిన ఎన్. శ్రీనివాసరావు విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలోని సర్వే నెంబర్ 1 లో గల 8.13 సెంట్ల భూమిలో 1.30 సెంట్లను బీసీ కాలనీకి కేటాయించగా.. మిగతా భూమిని 22A లో పెట్టారని.. దాంతో క్రయ విక్రయాలు ఆగిపోయి ఇబ్బందులు పడుతున్నామని దయ చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు.
• నంద్యాల టౌన్ కు చెందిన ఎన్. రమాదేవి విజ్ఞప్తి చేస్తూ.. వారికి నంద్యాల టౌన్ లో వారసత్వంగా వచ్చిన నాలుగు సెంట్ల స్థలం ఉందని దాన్ని కబ్జా చేసేందుకు కె. నారాయణరెడ్డి ప్రయత్నించగా.. కోర్టు తమకే అనుకూలంగా తీర్పు ఇచ్చిందని దాన్ని కబ్జా చేసేందుకు యత్నించిన వ్యక్తి చనిపోవడంతో జి. గణేష్ అనే మరో వ్యక్తి స్థలాన్ని కబ్జా చేసి సెటిల్ మెంట్ కు రమ్మని బెదిరిస్తున్నారని ఆమె గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.
• 2018 డీఎస్సీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ స్పోర్ట్స్ కోటాలో జిల్లా విద్యాశాఖ, కలెక్టర్‌ ధ్రువీకరించిన మెరిట్ లిస్ట్ లో మొదటి ప్లేస్ లో ఉన్న తనకు ఆపాయింట్ మెంట్ ఆర్డర్ ఇచ్చి నాలుగు రోజులు పాఠశాలకు వెళ్ళి ఉద్యోగం చేయించారని, తరువాత కూడా తనను నిలిపివేసి, అక్రమంగా ఇ. మహేష్ అనే వ్యక్తికి ఉద్యోగం ఇచ్చారని.. ఈ అక్రమానికి పాల్పడిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె. సురేష్ కుమార్ బంధు ప్రీతితో ఈ పని చేశారని ఈ అక్రమ నియామకంపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజవర్గం, కంబదూరు మండలం కూరాకుల పల్లి గ్రామానికి చెందిన గాజుల పుష్పవతి గ్రీవెన్స్ లో వేడుకున్నారు.
• నెల్లూరు జిల్లా, కొవూరు నియోజకవర్గంలోని కోవూరు కో ఆపరేటీవ్ షుగర్‌ ఫ్యాక్టరీ కార్మికులు 230 మంది విజ్ఞప్తి చేస్తూ.. తాము షుగర్‌ ఫ్యాక్టరీ లో కన్సాలిడేట్ ఎన్.ఎం.ఆర్ లుగా 40 ఏళ్ళుగా పనిచేసి ఉన్నామని.. యాజమాన్యం ఫ్యాక్టరీని 2013 లో మూసివేశారని.. కాని తమకు రావాల్సిన బకాయిలు ఇంకా ఇవ్వలేదని… తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించి ఆదుకోవాలని వారు అభ్యర్థించారు.
వీటితో పాటు గ్రామాల్లో సీసీ రోడ్లు, వీధి లైట్ల కోసం పలు అర్జీలు అందగా.. సీఎంఆర్ఎఫ్ అందించి ఆదుకోవాలని పలువురు నేతలను వేడుకున్నారు. మరికొందరు అధికారులు బదిలీల కోసం అభ్యర్థించగా.. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు వినతులు అందించారు. అర్జీలు స్వీకరించిన నేతలు కలెక్టర్, ఎస్పీలతో పాటు సంబంధిత మండల అధికారులకూ ఫోన్లు చేసి సమస్యలను వివరించి పరిష్కరించాలని తెలిపారు.

LEAVE A RESPONSE