Suryaa.co.in

Telangana

తెలంగాణను బీహార్ లా మారుస్తున్నారు

– ఇది ప్రజా పాలన కాదు గూండాల పాలన
– నర్సాపూర్ గోమారంలోని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు

సీనియర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి ఇంటి మీద కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.ఈ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు గూండా రాజ్యం నడుస్తుంది. ప్రజల యొక్క హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయి.

మొన్న సిద్దిపేటలో నా కార్యాలయం మీద దాడి కావచ్చు, హైదరాబాదులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి కావచ్చు, నిన్న సునీత లక్ష్మారెడ్డి గారి ఇంటి మీద దాడి కావచ్చు. రాష్ట్రంలో గుండు రాజ్యాన్ని తలపించే విధంగా పరిపాలన సాగుతుంది. తెలంగాణకున్న మంచి పేరును మంటగలిపి ఈరోజు బీహార్ లాగా తెలంగాణను మారుస్తున్నారు.

నిన్న సునీత లక్ష్మారెడ్డి మీద జరిగిన దాడి కాంగ్రెస్ నాయకత్వం ప్రోత్సాహంతో జరిగిన దాడి. రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే మాటలు రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలను ప్రతిపక్షాల మీద దాడి చేసే విధంగా ప్రోత్సహించినట్లు ఉన్నాయి.

ఎమ్మెల్యే నివాసంలో లేనప్పుడు ఉద్దేశపూర్వకంగా దాడి చేయాలని, ఎమ్మెల్యే గారి ఇంటి ముందు పటాకాయలు కాల్చడం, ఇంట్లోకి పటాకాయలు విసరడము ఇంట్లో ఉన్న వారిపై దాడి చేయడం హేయమైనది.

ఇప్పుడే ఎస్పి తో, ఐజి తో మాట్లాడాను వెంటనే కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.కాంగ్రెస్ నాయకులు దాడి చేశారన్న విషయం వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నది. అంతే కాకుండా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు.

హెడ్ కానిస్టేబుల్ చేతులోని ఫోన్ లాక్కోని నెట్టేస్తే హెడ్ కానిస్టేబుల్ కింద పడిపోయాడు. పోలీసులపై దాడి జరిగినా కేసు తీసుకోవడం లేదు. కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. దేశంలో తెలంగాణ పోలీసులు అంటే మంచి పేరు ఉండేది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పోలీసులను చెడగొడుతున్నారు.

పోలీసు అధికారులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు.10 సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఏనాడైనా ఎమ్మెల్యేల ఇంటిపైన దాడి జరిగిందా? ఫిర్యాదు ఇచ్చిన 24 గంటల్లో ఎఫ్ఐఆర్ చేసిన సందర్భాలు ఉన్నాయి.

కాంగ్రెస్ గుండాల రాజ్యంలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు దాడి చేసిన వారిని అరెస్ట్ చేయరు. వెంటనే గోమారంలో దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయాలి. దాడిని ప్రోత్సహించిన వారిపై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కూడా వెళ్తాం. దాడి చేసిన వారికి శిక్ష పడేదాకా వదిలిపెట్టం.

ఇది ప్రజా పాలన కాదు గూండాల పాలన.మా ఓపికకు కూడా ఒక హద్దు ఉంటది. పోలీసులు ఇలాంటి దాడులను కట్టడి చేయడంలో విఫలమైతే రాయలసీమ లాంటి ఫ్యాక్షన్ పరిస్థితులు తెలంగాణలో కూడా వచ్చే అవకాశం ఉంది.తెలంగాణ ప్రాంతంతో తెలంగాణ ప్రజలతో మాది పేగు బంధం ఎక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా మేము చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం.

అదేవిధంగా ప్రభుత్వం పోలీసులు కూడా వ్యవహరిస్తే మంచిది. ఇంట్లో చొరబడి దాడి చేసిన వారిని అరెస్టు చేసి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉందని నిరూపించుకోవాలి.

డిజిపి ఉన్నత మైన పదవిలో ఉన్నారు మీరు ఆ పదవికి గౌరవం తెచ్చే విధంగా చట్టానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్లిన వారిని ఉపేక్షించవద్దు అని సూచిస్తున్నాను.డిజిపి వెంటనే ఈ ఘటన పై స్పందించి దాడి చేసిన వారిని అరెస్ట్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను.ఒకవేళ అరెస్టు చేయనట్టయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి డిజిపి ఆఫీస్ని ముట్టడిస్తాం.

LEAVE A RESPONSE