Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రం కోసం ఢిల్లీ నిధులు తెచ్చుకోలేని నేత జగన్‌!

– వైసీపీకి ప్రజా సంక్షేం పట్టదు
– మాజీ సీఎంది పెద్ద క్రిమినల్ చరిత్ర
– పోలవరం, అమరావతి పూర్తి చేస్తారని ప్రజలు ఊహించారు
– సాక్షి వార్త పత్రిక కాదు… ఒక రోత పత్రిక, వైసీపీకి కరపత్రం
– లైసెన్స్ ను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రద్దు చేయాలి
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్‌

మంగళగిరి: కటకటాల్లోకి వెళ్లకుండా చూసుకునేందుకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకెళ్లి గల్లీ గల్లీ తిరిగి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన జగన్ రెడ్డి ఏనాడు ప్రజా సంక్షేమం కోసం రాష్ట్రానికి నిధులు తెచ్చేందుకు ఢిల్లీకి వెళ్లలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ… నేతల కాళ్లు పట్టుకొని తన సొంత ప్రయోజనాల కోసం పాటుపడ్డారే తప్ప జగన్ ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి చేసిన మేలు ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు. ఇంకా రామయ్య ఏమన్నారంటే… జగన్ ఢిల్లీవెళ్లారుగానీ ప్రజా సంక్షేమానికి ఎప్పుడూ ఢిల్లీ యాత్రలు చేయలేదు.

జగన్ రాజకీయ ప్రస్తానమంతా కేసుల నుంచి తప్పించుకోవడానికే వెచ్చించారు. ప్రజాసేవ ఏనాడు చేయలేదు. జగన్ రాజకీయ సేవ చేయడానికి రాజకీయాల్లోకి రాలేదని నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. కొందరు ప్రజా సేవచేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పి తమ పబ్బం గడుపుకుంటుంటారు. జగన్ ఆ కోవకు చెందినవాడే. జగన్ రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టేనాటికే ఆయనపై బోలెడు కేసులున్నాయి. ఆయనకు పెద్ద క్రిమినల్ చరిత్ర ఉంది. 16 నెలలు చెంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిన విషయం అందరికీ తెలిసిందే.

కేసుల నుంచి తప్పించుకోవడానికి, కేసుల నుండి రక్షణ పొందడానికి, జైలుకు పోకుండా తనకు తాను కాపాడుకోవడంకోసం ఆయన రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాలు నడుపుతున్నాడంటాను. దీనికి జగన్ సమాధానం చెప్పగలరా? కాదనగలరా? జగన్ అయిదేళ్ళలో 29 సార్లు ఢిల్లీ వెళ్లారు. వెళ్లినప్పుడల్లా ప్రజలు చకోర పక్షుల్లాగ ఎదురుచూశారు. ఢిల్లీ నుండి నిధుల మూటలు మోసుకొస్తారని, కోట్లాది రూపాయల రాయితీలు తెస్తారని, ప్రజా సంక్షేమం కోసం పథకాలు మంజూరు చేయించుకొని వస్తారని నిరీక్షించారు. వారి ఎదురుచూపులు ఎదురుచూపులుగానే మిగిలిపోయాయి.

పోలవరం పూర్తి చేయడానికి గ్యారంటీగా నిధులు తెస్తారనుకున్నారు. ఉత్తి చేతులతో వచ్చారు. అమరావతి నిర్మాణం బ్రహ్మాండంగా జరుగుతుంది.. తమ కష్టాలు తీరుతాయని జనం ఆశించారు. వారి ఆశలు నిరాశలయ్యాయి. ఢిల్లీ విభజన హామీలు నెరవేర్చుకొని వస్తాడనుకున్నారు. ఏ ఒక్క హామీని నెరవేర్చుకొని రాలేదు. అన్నీ తుస్సు మనేలా ఏమీ చేయలేదు. ప్రధాని వద్ద సాగిలబడి తన కేసుల మాఫీ గురించి విన్నవించుకొని తిరిగి కారెక్కి విజయవాడ వచ్చేసేవాడు.

చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిశారు. ముఖ్యమైన మంత్రులను కూడా కలిశారు. స్వయంగా కేంద్ర మంత్రే చంద్రబాబు ఉన్న చోటికి వచ్చారు. అదీ.. చంద్రబాబు ఢిల్లీలో పొందే గౌరవం. చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ప్రెస్ మీట్ పెడతారు. రాయితీలను వివరిస్తారు. 2,800 కోట్ల నిధులను ఢిల్లీ నుండి సాధించడం గొప్ప విషయం. పోలవరం ప్రాజెక్టుకు ఈ నిధులు ఇస్తామన్నారని చంద్రబాబు బాహాటంగా ప్రకటించారు. జగన్ ఇలా ఏనాడైనా ప్రకటించారా? ఇన్నాళ్లు తాను కోర్టుకు వెళ్లనవసరం లేదని, కేసుల విచారణ అంత స్పీడుగా రాదులే అనే ధోరణితో ఇన్నాళ్లు ఉన్నారు.

రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ఆయన చేసిందేమీలేదు. వరద బాధితుల సహాయార్థం15వేల కోట్లు ఇస్తామని ఢిల్లీలో చెప్పారు. మీరు వెళ్లినప్పుడు అలా చెప్పారా? విశాఖ స్టీల్ ప్లాంట్ ను కదల్చడానికి వీలులేదని చంద్రబాబు ఢిల్లీ పెద్దలతోను, ప్రధానితోను అన్నారు. మీరెప్పుడైనా ఇలా చెప్పారా? రాష్ట్రంలో 8 జిల్లాలు వెనుకబడిపోయాయని, ఆ 8 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కావాలని పట్టుబట్టి చంద్రబాబు తీసుకొచ్చారు. మీరెప్పుడైనా అలా తెచ్చారా? రాష్ట్ర అభివృద్ధి గురించి ఎప్పుడైనా మాట్లాడారా? రాష్ట్ర గౌరవాన్ని ఢిల్లీలో విపరీతంగా పెంచిన ఘనాపాటి చంద్రబాబు. ప్రజల తరపున ముఖ్యమంత్రిగా ఢిల్లీలో మాట్లాడేవారు.

జగన్ సొంత విషయాలు తప్పితే ప్రజల గురించి ఏనాడు మాట్లాడలేదు. జగన్ విభజన హామీల్లో ఒక్క హామీనైనా నెరవేర్చమని ఢిల్లీ పెద్దలను ఏనాడైనా అడిగారా? డిశెంబర్ లో విశాఖ రైల్వే జోన్ వస్తుందని సాక్ష్యాత్తు రైల్వే మంత్రే చంద్రబాబుతో అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం ఇటువంటివేమైనా జగన్ సాధించారా? ఆనాడు వైసీపీ అఘాయిత్యాలను నిలదీసినందుకు రఘురామకృష్ణంరాజు ప్రత్యేక విమానంలో తీసుకెళ్లి ఆయనను కొట్టి కక్ష సాధించుకున్నారు. మోడీ వద్ద సాగిలపడడంవల్లే ఒక్క రోజు కూడా కోర్టుకు వెళ్లలేదు. ఈ విషయం నిజం కాదని చెప్పగలరా? ముఖ్యమంత్రికి ఒక న్యాయం, మామూలు నిందితులకు ఒక న్యాయమా? ఎందుకిలా జరుగుతోంది. జగన్ కే ఈ వెసలుబాటు ఉంది? ఏ చట్టం లో ఇలా ఉందో న్యాయకోవిదులు చెప్పగలరా? పదవిపోయి నాలుగు నెలలైనా కోర్టుకు వెళ్లలేదు.

చట్ట ప్రకారం అతనికి శిక్ష పడాలి. సీబీఐ 11 కేసులు, ఈడీ 5 కేసులు నమోదు చేసింది. అవి ఎప్పుడు అవుతాయి?. 2012 లో జగన్ పై ఛార్జిషీట్లు వేస్తే ఇంతవరకు విచారణకు హాజరవలేదు. గతంలో దేశ ప్రధాని ఇందిరాగాంధి, అంతులే లాంటివారినే అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఇతను వారికన్నా గొప్పవాడా? జగన్ లో ఏమైనా ప్రత్యేకత ఉందా? ఈ ప్రత్యేకత అందరు నిందితులకు వర్తిస్తుందా? లేక జగన్ కు ఒక్కడికేనా? జగన్ పేరులో, హోదాలో గొప్పతనమేమైనా ఉందా? భారతదేశ పౌరుడిగా నేను అడుగుతున్నాను. ఈ విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస, కోరిక నాలో ఉన్నాయి.

సీఎంగా ఉంటే కోర్టులకు హాజరుకానవసరం లేదా? జగన్ తనకు శిక్షలు పడకుండా చూడండని ఢిల్లీ వెళ్లాడే తప్ప ప్రజల కోసం కాదు. ఐదు సంవత్సరాలు సీఎంగా జగన్ కోర్టుల విచారణకు హాజరు కాలేదు.. ఇప్పుడు ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. నాలుగు నెలలుగా కోర్టులకు ఎందుకు హాజరు కావడం లేదు.. మతలబు ఏంటి? విపత్తుల సమయంలో చంద్రబాబునాయుడు పోషించిన పాత్ర తీరును దేశ ప్రజలందరూ అభినందించారు. జగన్ సాక్షి పత్రికలో మాత్రం దగుల్బాజీ రాతలు రాయిస్తున్నారు. సాక్షి వార్త పత్రిక కాదు ఒక రోత పత్రిక. అది వైసీపీకి కరపత్రంగా మారింది. అందులో సందేహమేమీ లేదు. సాక్షి లైసెన్స్ ను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రద్దు చేయాలి.

LEAVE A RESPONSE