– ఏలూరు ఎంపీ మహేష్ వినూత్న ప్రయోగం
ఏలూరు: ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో పరిష్కరించాల్సిన సమస్యలను లోక్ సభలో ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సంబంధించిన ప్రశ్నలను విద్యార్థులు, ప్రజల నుంచి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆహ్వానించారు.
విద్యార్థులు, ప్రజల నుంచి వచ్చిన వాటిలో ఉత్తమమైన కొన్ని ప్రశ్నలను ఎంపిక చేసి, వాటిని ప్రజల తరఫున ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పార్లమెంట్లో ప్రస్తావిస్తారు. ప్రశ్నలు పంపించే కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గంలోని విద్యార్థులతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజలు “మీ ఎంపీ పార్లమెంట్లో ఏ ప్రశ్న అడగాలి?”.. అని పంపే ప్రశ్నల్లో ఎంపికైన వాటిని ఎంపీ పార్లమెంట్లో అడుగుతారు. అంతేకాకుండా, ఎంపికైన ప్రశ్నలు రాసిన వారిని పార్లమెంట్కి ఆహ్వానించి, ఒక రోజు పాటు విజిటర్స్ గ్యాలరీలో కూర్చునే అవకాశం కల్పిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం… మీ ప్రశ్నలను నేరుగా 9618194377, 9885519299 నంబర్లకు వాట్సప్ ద్వారా పంపగలరు.