– రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఎద్దేవా
వినుకొండ: వైసీపీ పాలనంతా అవినీతిమయమని, ఆ అయిదేళ్లలో స్కామ్ లే స్కామ్ లని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
వినుకొండ నియోజకవర్గంలో వెంకుపాలెం నుంచి నరగాయపాలెం వరకు రూ.4 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును, మార్కాపురం ఆర్ అండ్ బి రోడ్డు నుంచి దొండపాడు వరకు రూ.6.15 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో కలిసి మంత్రి సవిత శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ, జగన్ అసమర్థ, అవినీతి పాలన వల్ల 2919-24 మధ్య కాలంలో ఎన్నో స్కామ్ లు జరిగాయన్నారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామన్నారు.
వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని మంత్రి సవిత వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అశోక్ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.