● ఉచిత ప్రయాణం పేరుతో మహిళలను దారుణంగా వంచించారు
● ఎన్నికల్లో ఇచ్చిన హామీకి జీవోల్లో పెట్టిన నిబంధనలు పూర్తి భిన్నం
● ఈ నిబంధనలతో పుణ్య క్షేత్రాలకు బస్సుల్లో ఉచితంగా తిరగడం మహిళలకు సాధ్యమయ్యే పనేనా?
● కర్నాటక, తెలంగాణలో అమలవుతున్న పథకాన్ని చూసి కూడా సరిగ్గా అమలు చేయలేరా?
● 15 నెలల సమయం తీసుకుని కూడా ఇంత దారుణమైన నిబంధనలా?
● తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి
తాడేపల్లి: ఫ్రీ బస్సు పేరుతో కూటమి ప్రభుత్వం మహిళలను దారుణంగా వంచించిందని, జీవోలో పేర్కొన్న నిబంధనలు చూస్తే మహిళలకు మేలు చేయాలన్న ఆశయం కంటే వారిని మోసం చేయాలన్న తపనే ఎక్కువగా కనిపిస్తోందని వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్నాటక, తెలంగాణలో ఇప్పటికే అమలవుతున్న పథకాన్ని అంతకన్నా బాగా అమలు చేస్తామని 15 నెలల సమయం తీసుకుని అంతకన్నా హీనంగా అమలు చేస్తున్నారని ఆరోపించారు. కూటమి నాయకులు చెప్పినట్టు మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణించి పుణ్యక్షేత్రాలు సందర్శించాలంటే, ఎన్ని రోజులు పడుతుందని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని ప్రశ్నించారు.
ఉచిత బస్సు కోసం ఎన్నిసార్లు ఎక్కిదిగాలి?
ఎన్నికలకు ముందు మహిళలకు ఫ్రీ బస్ పేరుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ విచ్చలవిడిగా ప్రచారం చేసి తీరా అధికారంలోకి వచ్చాక మహిళలను పట్టించుకున్న పాపానపోలేదు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. అన్ని పుణ్య క్షేత్రాలను రూపాయి ఖర్చు లేకుండా సందర్శించవచ్చని, ఎవరైనా టికెట్ అడిగితే నా పేరు చెప్పమని చంద్రబాబు ఊదరగొట్టాడు. నేనే సేఫ్ డ్రైవర్ అని ప్రచారం చేసుకున్నాడు. (ఈ సందర్భంగా చంద్రబాబు, జనసేన వీడియోలు ప్రదర్శించారు.)
దాదాపు 15 నెలల తర్వాత పథకాన్ని అమలు చేసే పేరుతో షరతులు విధించి, మహిళలను వంచనకు గురిచేస్తున్నారు. కేవలం 5 రకాల బస్సుల్లో మాత్రమే ఫ్రీ బస్ పథకం అమలు చేస్తామని, ఉచిత ప్రయాణానికి షరతులు విధించి జీవో ఎంస్ నెంబర్ 27 ఇచ్చారు.
పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్సప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. నాన్ స్టాప్, ఇంటర్ స్టేట్, సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, అన్నిఏసీ సర్వీసులకు ఈ పథకం వర్తించదని చెప్పారు. పుణ్య క్షేత్రాలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో వెళ్లొచ్చని ఎన్నికలకు ముందు చెప్పి తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే సప్తగిరి ఎక్స్ప్రెస్ సర్వీసులో కూడా టికెట్ తీసుకోవాలనే నిబంధన పెట్టడం దారుణం.
కేవలం 50 కిమీల పరిధిలో తిరిగే బస్సులకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయడం మహిళలను వంచించడమే. మరీ దారుణంగా అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లాల సర్వీసుల్లో, కాంట్రాక్ట్ సర్వీసులకి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయకపోవడం చూస్తుంటే, ఎవరి కోసం పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు.?
కూటమి ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో ఉచిత బస్సుల్లో పుణ్యక్షేత్రాలు తిరగడం అయ్యే పనేనా.? శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి తిరుమల చేరుకోవాలంటే ఎన్నిసార్లు ఎన్ని బస్సులు ఎక్కి దిగాలో ముఖ్యమంత్రి ఆలోచించారా.? మీరు చెప్పినట్టు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో పుణ్యక్షేత్రాలు తిరగాలంటే, కనీసం మూడు నాలుగు రోజులు ప్రయాణించాలా లేదా?
కర్నాటక, తెలంగాణలో అమలవుతున్న పథకాన్ని అమలు చేయడానికి 15 నెలల సమయం తీసుకుని కూడా అంతకన్నా దరిద్రంగా అమలు చేసే ప్రయత్నం చేయడం కూటమి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం.
బస్సెక్కి టికెట్ కి డబ్ములివ్వమని, మా చంద్రన్న చెప్పాడని మహిళలంటే కండక్టర్ ఊరుకుంటాడేమో మంత్రి రాంప్రసాద్రెడ్డి సమాధానం చెప్పాలి.