• గీత కార్మికులకు ఉపాధి పెంచేలా నూతన ఉత్పత్తుల రూపకల్పన
• ఆదరణ 3.0 పథకం ద్వారా మోపెడ్లు
• రంపచోడవరం హార్టికల్చర్ పరిశోధనా కేంద్రంలో తాటి ఉత్పత్తుల తయారీ
• బీసీలకు అండగా కూటమి ప్రభుత్వం
– రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి సవిత
విజయవాడ: బడుగు బలహీన వర్గాల కోసం డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న తన జీవితాంతం పాడుపడ్డారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్. సవిత అన్నారు. స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ గౌతు లచ్చన్న 116 వ రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాన్ని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎస్.సవిత మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సర్దార్ గౌతు లచ్చన్న అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు.
త్వరలోనే ఆదరణ 3.0 పథకాన్ని ప్రారంభించనున్నామని, ఈ పథకం ద్వారా గీత కార్మికులకు మోపెడ్ ద్విచక్ర వాహనాలు పంపిణీ చేస్తామన్నారు. గౌతు లచ్చన్న స్ఫూర్తితో బీసీ సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. అందుకే బీసీలంతా ముఖ్యమంత్రికి అండగా నిలబడాలన్నారు. ముందుగా సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు లచ్చన్న జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. గౌతు లచ్చన్న పోరాట యోధుడే కాదు గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. అంటరానితనంపై అలుపెరగని పోరాటం చేశారని, హరిజన, గిరిజన రక్షణ యాత్రలు నిర్వహించారన్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ డాక్టర్ సర్ధార్ గౌతు లచ్చన్నతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందన్నారు. ఎక్కడో ఒడిశా సరిహద్దుల్లో మారుమూల పల్లెటూర్ లో పేద కుటుంబంలో పుట్టిన ఆయన స్వాతంత్య్ర ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించారన్నారు. 95 ఏళ్ళ వయస్సులో కూడా దేశానికి సేవ చేసిన గొప్ప వ్యక్తి గౌతు లచ్చన్న అన్నారు. దేశమంతా గర్వించదగ్గ గొప్ప నాయుకుడిగా దివంగత ఎంపీ ఎర్రన్నాయుడు ఎదగడంలో గౌతు లచ్చన్న ఎంతో కీలక పాత్ర పోషించారన్నారు.
బీసీలకు పెద్ద పీట వేస్తూ, వారికి ఎన్నో పదవులు ఇచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 2018 లో తోటపల్లి ప్రాజెక్ట్ కు గౌతు లచ్చన్న పేరు పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి అన్నారు. గత ప్రభుత్వం అయిదేళ్ళుగా గౌతు కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టిందన్నారు. సమాజం కోసం పోరాడిని గౌతు లచ్చన్న కుటుంబాన్ని గత ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంటే తప్పు అని కనీసం ఎవరు మందలించలేదన్నారు. బీసీ లు అప్పుడు, ఇప్పుడు.. ఎప్పుడూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అండగా నిలబడ్డారన్నారు. గౌడ్ కులంలో 5 కులాలను ఏకం చేసిన వ్యక్తి గౌతు లచ్చన్న అని అన్నారు. గౌతు వారసులుగా శివాజీ, దివంగత ఎర్రన్నాయుడు రాష్ట్రం మొత్తం ప్రజా సమస్యల పై పోరాడారన్నారు.
రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమే ఈ కార్యక్రమం అన్నారు. బిరుదులు అందరికీ ఇస్తారు.. కొందరు మాత్రమే స్వతహాగా సాధిస్తారన్నారని, అలా వచ్చిందే సర్దార్ అనే బిరుదు, లచ్చన్న త్యాగానికి సర్ధార్ గుర్తు అని అన్నారు. వెనుకబడిని వర్గాల కోసం, అంటరానితనం పై పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న అని అన్నారు.
ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ బలహీన వర్గాలకి అండగా నిలిచిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. గత ప్రభుత్వం గౌతు కుటుంబాన్ని ఎన్నో బాధలు పెట్టిందన్నారు. ఆడబిడ్డని చూడకుండా శాసనసభ్యుడు గౌతు శిరీష మీద అనేక కేసులు పెట్టారన్నారు. సోషల్ మీడియా లో పోస్ట్ లు పెట్టారని గౌతు శిరీష ని అరెస్ట్ చేశారన్నారు.
పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల కోసం, సమాజం కోసం పాటుపడిన వ్యక్తులను ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు. అలా గుర్తుండిపోయే నాయకులు గౌతు లచ్చన్న అని, ఆయన ఆశయాలను ఇకముందూ కొనసాగిస్తామన్నారు.
పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధులు ఆచార్య ఎన్.జి.రంగా ను పార్లమెంటు సభ్యునిగా శ్రీకాకుళంలో నిలబెట్టి గెలిపించిన వ్యక్తి లచ్చన్న అని తెలిపారు. గౌతు లచ్చన్న అడుగుజాడల్లో నడుస్తూ ముందు తరాలకు ఆయన స్ఫూర్తి అందిస్తామన్నారు.
ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ బీసీలకు రాజకీయ గుర్తింపు కావాలని కోరుకున్న వ్యక్తి డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న అని అన్నారు. స్వాతంత్రోద్యమ కాలంలోనే జాతిపిత మహాత్మా గాంధీజీ ఇచ్చిన స్ఫూర్తితో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్నారన్నారు.. ఆయన జీవితం ఎంతోమంది మాలాంటి వారికి స్ఫూర్తిదాయకమన్నారు.
గౌతు లచ్చన్న మనుమరాలు, శాసన సభ్యుడు గౌతు శిరీష మాట్లాడుతూ ప్రజా పోరాటాలు చేసిన నాయకులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. చిన్నప్పుడు నేను తాత గారి దగ్గర పెరగడం వల్ల.. ఆయన ఆశయాలు, ఆలోచనలు నాపై ప్రభావం చూపించాయన్నారు. విలువలతో, నిజాయితీతో పని చేసిన గొప్ప నాయకుడు గౌతు లచ్చన్న అని అన్నారు. గత 5సంవత్సరాల్లో గౌతు లచ్చన్నను గౌరవించకపోగా మా కుటుంబాన్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టారన్నారు. గౌతు కుటుంబానికి రాజకీయ వారసురాలుగా నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. తాత, తండ్రి నేర్పిన విలువలతోనే రాజకీయం చేస్తానన్నారు.
కార్యక్రమంలో ప్రభుత్వ విప్, శాసన సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు, శాసన సభ్యుడు కాగిత కృష్ణ ప్రసాద్, పితాని సత్యన్నారాయణ, మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, వర్ల కుమార్ రాజా, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి సహా పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, అధిక సంఖ్యలో గీత కార్మికులు, కూటమి నాయకులు, తదితరలు పాల్గొన్నారు.