– 2014-19 మధ్య పనులు జరిగిన బిల్లుల విడుదలకు రంగం సిద్ధం
– చెల్లింపుల కోసం కేంద్రంతో మాట్లాడి 3,54,177 పనులు ఆన్ గోయింగ్ వర్కులుగా మార్పు
– రూ.180 కోట్ల చెల్లింపులకు కసరత్తు పూర్తి
– సీఎం ఆదేశంతో పనులు చేసిన వారి అకౌంట్లలోకి 23వ తేదీన జమ కానున్న రూ.145 కోట్లు
అమరావతి: 2014-19 మధ్య కాలంలో జరిగిన నరేగా పనులకు బిల్లుల చెల్లింపు విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా నాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన నరేగా పనులకు బిల్లులు చెల్లించలేదు. బిల్లులు ఇవ్వకుండా వర్కులను క్లోజ్ చేసింది.
2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శద్ద పెట్టింది. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సిఎం చంద్రబాబు ఈ విషయంపై పలు మార్లు చర్చించి నిధుల చెల్లింపులకు ఉన్న అడ్డంకులను తొలగించారు. ఇందులో భాగంగా వైసీపీ ప్రభుత్వం క్లోజ్ చేసిన 3,54,177 పనులు ప్రస్తుతం ఆన్ గోయింగ్ వర్కులుగా మార్పుచేశారు. కేంద్రం ఇచ్చిన ఈ వెసులుబాటుతో పనులు చేసిన వారికి బిల్లులు చెల్లింపు చేయడం ద్వారా న్యాయం చేసే అవకాశం ఏర్పడింది.
ఈ ప్రక్రియపై సిఎం చంద్రబాబు సచివాలయంలో బుధవారం మరోసారి సమీక్ష చేశారు. మొత్తం రూ.179.38 కోట్ల బిల్లుల చెల్లింపునకు సంబంధించి 5.54 లక్షల పనులను ఆన్ గోయింగ్ వర్కులుగా నమోదు చేశారు. దీనికి సంబంధించి కసరత్తు పూర్తి చేసిన పంచాయతీ రాజ్ శాఖ రూ.179 కోట్లకు గాను రూ.145 కోట్లను ప్రస్తుతం అప్లోడ్ చేసింది. ఈమొత్తానికి సంబంధించి ఆర్థిక శాఖ ఎన్ఐసికి నిధులు విడుదల చేసింది.
పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లు, గ్రామస్తుల అకౌంట్లలో 23వ తేదీన ఈ మొత్తం నిధులు జమకానున్నాయి. మిగిలిన మొత్తానికి సంబంధించి పలు సాకేంతిక కారణాలతో చెల్లింపు ప్రక్రియ నిలిచింది. అవసరమైన ఎస్టిమేషన్ లేకపోవడం, ఖర్చు చూపకపోవడం, ఆ పనిచేసిన ప్రాంతాలు పట్టణ ప్రాంతంలో విలీనం కావడం వంటి కారణాలతో ఆయా పనుల బిల్లుల చెల్లింపు ప్రక్రియ పెండింగ్లో ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
గత ప్రభుత్వం కొన్ని బిల్లులకు నిధులు ఇవ్వకుండానే చెల్లించనట్లు రిపోర్టుల్లో చూపింది. ఈ కారణంగా వాటికి అవసరమైన చెల్లింపులు జరపడానికి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వీటిపైనా కసరత్తు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వైసీపీ చెల్లించకుండా నిలిపివేసిన మొత్తం రూ.329 కోట్ల నరేగా బిల్లుల చెల్లింపును ప్రభుత్వం దశలా వారిగా చెల్లింపులు చేపట్టింది.
ఇందులో భాగంగా 23వ తేదీ జరిపే రూ.145 కోట్ల చెల్లింపులతో కలిపి ఇప్పటి వరకు మొత్తం రూ.250 కోట్లను చెల్లించినట్లు అవుతుంది. గ్రామాల్లో చిన్న చిన్న పనులు చేసి బిల్లుల కోసం ఎదురుచూస్తున్న వారి కష్టాలకు ముగింపు పలికినట్లు అయ్యింది. వేలమంది ఈ చెల్లింపుల ద్వారా ఆర్థిక వెసులబాటు పొందనున్నారు. బిల్లుల చెల్లింపుపై ఏడాది కాలంగా ప్రత్యేక శ్రద్దతో ముఖ్యమంత్రి రెగ్యులర్గా సమీక్షించి ఈ సమస్యను పరిష్కరించారు.