– విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై ఎందుకీ మౌనం?
● రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న మాట్లాడరేం?
● ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలేమయ్యాయి?
● మా వల్లే కేంద్ర ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు
● 32 విభాగాలు ప్రయివేటీకరణ చేస్తుంటే కేంద్రాన్ని అడగరేం?
– వైయస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కే కే రాజు
విశాఖపట్నం: ఎన్నికల మందు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని నమ్మించి, అధికారంలోకివచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రజలను కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని వైయస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కే కే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖపట్నం వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… మా వల్లే కేంద్రంలో ప్రభుత్వం నడుస్తోందని చెబుతున్న కూటమి నేతలు… విశాఖ ఉక్కుపై చిత్తశుద్ధి ఉంటే ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామాలు చేయాలని సవాల్ విసిరారు. ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు, విశాఖ వేదికగా ఇదే విషయాన్ని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసిన విషయం గుర్తు చేశారు.
స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగేవరకు కార్మిక సంఘాలు, రాజకీయ పక్షాలతో కలిసి పోరాటం దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని కేకే రాజు స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ విషయంలో పెద్ద ఎత్తున వైయస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారు. ఎన్నికలకు ముందు తియ్యని మాటలతో రాష్ట్ర ప్రజలను, ఉక్కు ఫ్యాక్టరీ కార్మిక సంఘాలను, కార్మికులను మోసం చేస్తూ అబద్దపు హామీలిచ్చారు. మా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కానివ్వమని హామీ ఇచ్చారు.
మాకు ఓట్లేసి గెలిపిస్తే.. మమ్నల్ని అసెంబ్లీకి, పార్లమెంటుకు పంపిస్తే.. సొంత గనులు కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సొంతగనులు కేటాయించేలా చేస్తామని నమ్మబలికారు. కానీ ఇవాళ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులకి మడుగులొత్తుతూ కార్మికు సంఘాలకి, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి ఉన్న సుమారు లక్ష కుటంబాలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారు.
స్టీల్ ప్లాంటుకు ప్యాకేజీ పేరుతో మభ్యపెట్టి.. ఆ ప్యాకేజీ పేరుతో తీసుకొచ్చిన రూ.11,400 కోట్లలో ఇప్పటివరకు రూ.8,500 కోట్లు ఇచ్చారు. దాన్ని కూడా ప్లాంటు అభివృద్ధికి వినియోగించకుండా.. గతంలో ప్లాంటుకు జీఎస్టీ, ఇతర అవసరాలకు, బెదిరించి వీఆర్ ఎస్ తీసుకునేలా చేసిన ఉద్యోగులకు వెచ్చించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను వ్యతిరేకించాలి.
కేంద్ర ప్రభుత్వం మా వల్లే నడుస్తోందని చెప్పుకుంటున్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అనేకసార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ప్రజలకు చేసిన వాగ్ధానాల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ఎంపీల ద్వారా కేంద్రానికి మద్ధతు ఉపసంహరించుకుంటామని డిమాండ్ చేస్తే… కచ్చితంగా విశాఖ ఉక్కు ప్రభుత్వరంగ సంస్థగానే కొనసాగుతుంది. ఈరోజు ఏపీలో గెలిచిన ఎంపీలు కేంద్రానికి మద్ధతు ఉపసంహరించుకుంటే.. కేంద్ర ప్రభుత్వం కూలిపోతుంది. మరి ఎందుకు మీరా పని చేయడం లేదు?
32 విభాగాలను ప్రయివేటీకరణ దిశగా అడుగులు వేస్తుంటే.. ఈ ప్రాంతంలో గెలిచిన టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్రా ప్రజలకు నష్టం జరుగుతుంటే మీరేం చేస్తున్నారు?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో 14,500 మంది ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల్లో 4,700 మందిని తొలగించారు. మొదటి విడతలో వీఆర్ ఎస్ కు సంబంధించి 1150 మంది శాశ్వత ఉద్యోగులను తొలగిస్తే.. రెండో విడతలో మరో 1017 మందిని వీఆర్ ఎస్ ద్వారా తొలగించేందుకు సిద్దంగా ఉన్నారు. దీనికితోడు మూడు నెలలుగా ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు. 2024 జూన్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకివస్తే అదే ఏడాది సెప్టెంబరు నుంచి హెచ్ ఆర్ ఏ ఇవ్వలేదు. ఎల్ టీ సీ, ఎల్ ఎల్ టీసీ కూడా లేదు.
ఉద్యోగులు తీసుకున్న రుణ బకాయిలు రూ.150 కోట్లు ఉంటే అవి కూడా చెల్లించడం లేదు. సీఎస్ ఆర్ నిధులతో నడిచే విమల విద్యాలయాన్ని కూడా మూసివేసారు. స్టీల్ ప్లాంట్ ఆసుపత్రిలో అత్యంత దౌర్భాగ్య పరిస్ధితులున్నాయి. ఎవరు వెళ్లినా ప్రయివేటు ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. మెడికల్ బిల్లులు చెల్లించడం లేదు. గతంలో యూనిట్ కు రూ.60 పైసలు ప్లాంట్ క్వార్టర్స్ లో ఉన్న ఉద్యోగులు చెల్లిస్తే.. దాన్ని ఇప్పుడూ యూనిట్ ధర రూ.8 చేశారు. అంటే నేరుగా పొమ్మనే పొగపెడుతున్నారు.
రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్రా వాసులు మిమ్నల్ని చీకొట్టకముందే, మీకు చీము నెత్తురు ఉంటే, ఉత్తరాంధ్రా ప్రాంతానికి అన్యాయం జరుగుతుందన్న స్పృహ ఉంటే, ఉక్కు ప్రయివేటీకరణ జరిగితే ఆర్ధికంగా, సామాజికంగా ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం జరుగుతుందన్న ఆలోచన ఉంటే.. తక్షణమే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి. 32 విభాగాల ప్రయివేటీకరణ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోండి. ఎన్నికల మందు వాగ్దానం చేసినట్లు స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలా చేయండి.