– ఎక్కడో సీఎం, మంత్రులు
– రైతుబిడ్డలు ఇక్కడ.. రాష్ట్ర సీఎం, మంత్రులు ఎక్కడ?
– సమస్యలు ఇక్కడ ఉంటే.. సీఎం, మంత్రులు ఢిల్లీ, బీహార్లోనా?
– ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస ట్వీట్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుండగా, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీ, బీహార్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. రైతుల కష్టాలపై దృష్టి పెట్టకుండా, రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసి జాతీయ రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆయన ప్రశ్నించారు.
ఈ విషయమై కేటీఆర్ ఎక్స్ (X) వేదికగా వరుస ట్వీట్లు చేశారు. “రైతుబిడ్డలు ఇక్కడ, రాష్ట్ర సీఎం, మంత్రులు ఎక్కడ?” అని ఆయన ప్రశ్నించారు. “సమస్యలు ఇక్కడ ఉంటే, సీఎం, మంత్రులు ఢిల్లీ, బీహార్లోనా?” అని నిలదీశారు. యూరియా కోసం రైతులు పడుతున్న పాట్లు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆయన ఎత్తి చూపారు. “రైతులు యూరియా కోసం తండ్లాడుతుంటే, మీరు ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడికి ఎగిరిపోతారా?” అని ఘాటుగా విమర్శించారు.
కేటీఆర్ జాతీయ పార్టీల తీరుపైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “జాతీయ పార్టీలకు ఓట్లు, రాష్ట్ర ప్రజలకు పాట్లు” అంటూ ఆయన మండిపడ్డారు. యూరియా సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.
“యూరియా ఏదయా అంటే కాంగ్రెస్ ఎంపీలు తేలేరు, బీజేపీ ఎంపీలు అడగనే అడగరు” అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, జాతీయ పార్టీల నిర్లక్ష్యంపై తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, ప్రశ్నిస్తున్నారని కేటీఆర్ హెచ్చరించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.