– శాసన సభ్యులకు మంత్రి నారా లోకేష్ ఆహ్వానం
అమరావతి: రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సీ ఫైలుపైనే తొలి సంతకం చేశారు. దీనిద్వారా సుమారు 16వేల మందికి టీచర్ ఉద్యోగాలు రాబోతున్నాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు. గత అయిదేళ్లలో ఒక్క డిఎస్సీ ఏర్పాటుచేయలేదు. నోటిఫికేషన్ దగ్గర నుంచి ఎగ్జామ్స్, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. రేపు కొత్త ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేతులమీదుగా నియామక ఉత్తర్వులు అందించబోతున్నాం. ఇది కూటమి ప్రభుత్వానికి గర్వకారణం. ఎమ్మెల్యేలంతా హాజరై జయప్రదం చేయాల్సింది కోరుతున్నాం. ప్రతిపక్ష సభ్యులకు కూడా జీఏడీ ద్వారా ఆహ్వానం పంపించాం. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరామని మంత్రి తెలిపారు.
మెగా డిఎస్సీని అడ్డుకునేందుకు వైసీపీ వారు సుమారు వందకు పైగా కేసులు వేశారు. పకడ్బందీగా నోటిఫికేషన్ ఇవ్వడంతో ఒక్క స్టే కూడా రాలేదు. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ పూర్తిచేశాం. రేపు సచివాలయం వెనుక వైపు నిర్వహించే భారీ కార్యక్రమానికి టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతోపాటు వారి కుటుంబ సభ్యులు కలిసి సుమారు 32వేల మంది హాజరుకాబోతున్నారు. వేదిక వద్ద ప్రతిజిల్లాకు ఒక్కొక జోన్ ఏర్పాటుచేశాం.
ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు హాజరై సంబంధిత జోన్లలో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. స్థలాభావం వల్ల అందరికీ బస్సులు ఏర్పాటుచేశామని చెప్పారు. శాసనమండలి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ… డిఎస్సీ విషయంలో మంత్రి లోకేష్ కృషికి అభినందనలు తెలిపారు. ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేసే అవకాశం లేకుండా ఎంపిక ప్రక్రియ పూర్తిచేశారని ప్రశంసించారు