– ఫోన్లో యాక్టివ్ సిమ్ కార్డ్ లేకపోతే మెసేజింగ్ యాప్లు పనిచేయకుండా నిబంధనలు
– ‘మీడియానామా’ తన కథనం
న్యూ ఢిల్లీ:: ఇకపై ఫోన్లో యాక్టివ్ సిమ్ కార్డ్ లేకపోతే వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్చాట్, షేర్చాట్, జియోచాట్, అరట్టై వంటి ప్రముఖ మెసేజింగ్ యాప్లు పనిచేయకుండా నిబంధనలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం కంపెనీలను ఆదేశించింది. దేశంలో సైబర్ మోసాలను అరికట్టే లక్ష్యంతో తీసుకొచ్చిన “టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ సవరణ నిబంధనలు, 2025″లో భాగంగా ఈ మార్పులు చేశారు. ఈ నిబంధనలను అమలు చేయడానికి యాప్లకు 90 రోజుల గడువు విధించారు. కొత్త నిబంధనల ప్రకారం ఈ యాప్లు తమ సేవలను వినియోగదారుడి సిమ్ కార్డ్తో నిరంతరం అనుసంధానమై ఉండేలా చూసుకోవాలి.
కంప్యూటర్ బ్రౌజర్ల ద్వారా లాగిన్ అయిన వారిని ప్రతి 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్గా లాగౌట్ చేయాలని, మళ్లీ క్యూఆర్ కోడ్ ద్వారా ధ్రువీకరించుకున్న తర్వాతే లాగిన్ అవ్వనివ్వాలని టెలికాం శాఖ స్పష్టం చేసింది. దీనివల్ల ప్రతీ సెషన్ యాక్టివ్గా ఉన్న సిమ్తో ముడిపడి ఉంటుందని, నేరగాళ్లు రిమోట్గా యాప్లను దుర్వినియోగం చేయడం కష్టమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం యాప్ను ఇన్స్టాల్ చేసే సమయంలో ఒక్కసారి మొబైల్ నంబర్ను ధ్రువీకరించుకుంటే చాలు.
ఆ తర్వాత సిమ్ కార్డ్ను తీసేసినా లేదా డీయాక్టివేట్ చేసినా యాప్ పనిచేస్తూనే ఉంటుంది. ఈ లొసుగును అడ్డం పెట్టుకుని సైబర్ నేరగాళ్లు, ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారు మోసాలకు పాల్పడుతున్నారని, వారిని గుర్తించడం కష్టంగా మారుతోందని ప్రభుత్వం చెబుతోంది. సిమ్ బైండింగ్ ద్వారా యూజర్, వారి నంబర్, డివైజ్ మధ్య సంబంధాన్ని గుర్తించడం సులభమవుతుందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడినట్టు ‘మీడియానామా’ తన కథనంలో పేర్కొంది. ఇప్పటికే బ్యాంకింగ్, యూపీఐ యాప్లలో ఇలాంటి భద్రతా ప్రమాణాలు అమలులో ఉన్నాయి.



