– పవన్ ఫ్లాప్ సినిమాల్ని కోమటిరెడ్డి అడ్డుకోవడమెందుకు?
– లోకేష్ విమానాలు, హెలికాఫ్టర్ల ఖర్చు ఎవరిది?
– దమ్ముంటే ఆ వివరాలన్నీ బయట పెట్టగలరా?
– అన్నీ విశాఖ వెళ్లిపోతే అమరావతి ఎందుకు?
– వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)
తాడేపల్లి: ఎవరైనా ఓ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు మాకు అవమానం జరిగింది. దుఃఖం కలిగింది. మాకు కుర్చీ వేయలేదు. స్థానిక ఎమ్మెల్యేతో బాగుండాలి. మా జోలికి స్థానిక ఎమ్మెల్యే రాకూడదు. తమను పార్టీ అవమానించిందని చెప్పి ఇతర పార్టీల్లోకి వెళ్లడం చూశాం. కానీ ఏకంగా రాజీనామాలు చేయడం, వాటిని ఆమోదించాలని పట్టుబట్టడం ఎక్కడా చూడలేదని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పష్టం చేశారు. కోనసీమలో తెలంగాణ వాళ్ల దిష్టి తగిలి కొబ్బరిచెట్లు చనిపోతున్నాయని ఆయన డిప్యూటీ సీఎంగా చెప్పాడా? లేక ఒక మాంత్రికుడిగా చెప్పారా? ఈ రాష్ట్రానికి ఆయన ఉప ముఖ్యమంత్రి అయితే వెంటనే కేరళ నుంచి శాస్త్రవేత్తల్ని తీసుకొచ్చి ఆ చెట్లకు వచ్చిన వ్యాధి తెలుసుకుని వాటికి చికిత్స చేసి బతికించాలి.
తద్వారా చెట్టుకూ, కోనసీమ రైతుకూ జీవం పోయాలి. చేతబడి చేసే వాడిలా దిష్టి తగిలిందని చెప్పడమేంటి?. మంత్రి నారా లోకేష్, ప్రజల సొమ్ము నయా పైసా కూడా ఖర్చు చేయకుండా విమానాల్లో తిరుగుతున్నారని చెబుతున్నారు. మరి ఆయన తిరుగుతున్న ప్రత్యేక విమానాలు, స్పెషల్ హెలికాప్టర్ల ఖర్చు ఎవరు పెడుతున్నారు? ఇది ప్రతి ఒక్కరిలో ఉత్పన్నమవుతున్న ప్రశ్న. ఆయన తన బినామీలతో ఖర్చు పెట్టించి విమానాల్లో తిరుగుతున్నారా? లేక 99 పైసలకే వైజాగ్లో భూములు తీసుకున్న వారు ఆ ఖర్చు పెడుతున్నారా?. లేదా ఉర్సా, బిర్సా వంటి కంపెనీలు లోకేష్ ప్రయాణ ఖర్చు భరిస్తున్నాయా?. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలంటే రూ.10 లక్షలు ఖర్చవుతుంది. మరి ప్రతి వారం వచ్చి పోతున్నందుకు రూ.20 లక్షలు ఖర్చవుతోంది.
అది ఎవరు భరిస్తున్నారు? చంద్రబాబుకు సీఎంగా అధికారం ఉంది. మరి మంత్రి నారా లోకేష్కు ప్రత్యేక అధికారం ఏముంది?. గత ప్రభుత్వ హయాంలో అప్పటి విపక్షనేత చంద్రబాబు మంగమ్మ శపథం చేసిన తర్వాత అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకున్నారా? లేదా? అని నేను సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నిస్తే ఇప్పటివరకూ సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడు ఆ విషయంలో వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలను నిందిస్తున్న చంద్రబాబు, అప్పుడు జీతం తీసుకోలేదా?. ఆడని సినిమాల్ని అడ్డుకోవడమెందుకు?: పవన్కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్పై స్పందిస్తూ.. తాను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నానని, పవన్ సినిమాలు ఆడనివ్వబోమని మంత్రి కోమటిరెడ్డి అంటున్నారు.
కానీ, నిజానికి పవన్కళ్యాణ్ సినిమాలేవీ ఆడడం లేదు. కాబట్టి మార్నింగ్ షో పడితే మ్యాట్నీకి ఆపాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పటి వరకు పవన్ సినిమాలు కొనుక్కున్న వారు బికారులైపోయారు. ప్రభుత్వానికి ఆ నిర్మాతలు ఇప్పటివరకూ జీఎస్టీ కూడా చెల్లించలేదు. అయినా ఏ అధికారి అడగడం లేదు. కనీసం పట్టించుకోవడం లేదు. అన్నీ విశాఖ వెళ్లిపోతే అమరావతి ఎందుకు? ఇక్కడ కేవలం అసెంబ్లీ, ఆఫీసులు, కోర్టు, చంద్రబాబు ఇల్లు మాత్రమే ఉంటుందట? మరి ఇంకా ఊరు ఏం ఉంటుందని ఇక్కడి రైతులు ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు తమకు కేటాయించే ప్లాట్లు ఎవరికి అమ్ముకోవాలని రైతులు నిలదీస్తున్నారు. దాదాపు 1000 నుంచి 1500 మంది వరకు పని చేసే కంపెనీలు, సంస్థలన్నీ వైజాగ్ వెళ్లిపోతే.. ఇక్కడ ఎవరుంటారు? ప్రభుత్వ ఉద్యోగులు తప్ప. బయటి నుంచి ఎవరొస్తారు? ఇక్కడ ఎందుకు ఉంటారు? ఈ పరిస్థితి ఉంటే, అసలు తాము భూములు ఎందుకిచ్చామని ఏడ్చే పరిస్ధితి వచ్చిందని రైతులు బాధపడుతున్నారు.